భావనపాడు పేరుతో మరో దోపిడీ
సర్కారుపై ధ్వజమెత్తిన వైఎస్సార్సీపీ నేత బొత్స
సాక్షి, హైదరాబాద్: భావనపాడు పోర్టు నిర్మాణం పేరుతో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రభుత్వం మరో దోపిడీకి తెర తీస్తోందని వైఎస్సార్ కాంగ్రెస్ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ ధ్వజమెత్తారు. ఉత్తరాంధ్ర సిగలో కిరీటమని, భారీ ఓడరేవు అని పత్రికల్లో వచ్చిన వార్తలను ఆయన ప్రస్తావిస్తూ అసలు భావనపాడు పోర్టుకు గ్లోబల్ టెండర్లు ఎందుకు పిలవలేదని సూటిగా ప్రశ్నించారు. ఆయన గురువారం పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... పోర్టు ఆదాయంలో 2.3 శాతం వాటాను రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చే విధంగా జరిగిన ఒప్పందాల వెనుక ఉన్న లొసుగులు ఏమిటో బయట పెట్టాలని డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో టీడీపీకి డబ్బు సంచులు మోసిన వారికి నామినేషన్ పద్ధతిలో కాంట్రాక్టులు ఇస్తున్నారని విమర్శించారు. దీనిపై ఎవరైనా ప్రశ్నిస్తే వారంతా అభివృద్ధికి ఆటంకమని టీడీపీ విమర్శలు చేస్తోందన్నారు. పోలవరం ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని రూ.16 వేల కోట్ల నుంచి రూ.42 వేల కోట్లకు పెంచి తద్వారా కాంట్రాక్టు పనుల్లో విపరీతంగా దోచుకున్నారని, ఇదే తరహాలో భావనపాడులో కూడా మరో దోపిడీకి సిద్ధమయ్యారని దుయ్యబట్టారు.
రాష్ట్రంలో ప్రజాధనం లూటీ అవుతోందని, దాన్ని ఆపేందుకు నిరంతరం పోరాటం చేస్తున్నామని బొత్స తెలిపారు. రాజధాని నిర్మాణానికి వైఎస్సార్సీపీ వ్యతిరేకం కాదని, స్విస్ చాలెంజ్ విధానంలో రాజధానిని కట్టాలని ప్రయత్నించడాన్నే తాము ప్రతిఘటించామని చెప్పారు.