టీడీపీవి నీచ రాజకీయాలు
-
వైఎస్సార్సీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ ధ్వజం -
‘జల్లికట్టు’ స్ఫూర్తితో ప్రత్యేక హోదా కోసం పోరాడుదాం
సాక్షి, హైదరాబాద్: రాజధానిలో, ప్రకాశం జిల్లాలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటనలకు లభించిన ప్రజా స్పందనను చూసి ఓర్వలేక అధికార టీడీపీ నీచ రాజకీయాలకు పాల్పడుతోందని వైఎస్సార్సీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ ధ్వజమెత్తారు. మంత్రులు, అధికార పార్టీ నేతలు నోటికొచ్చినట్లు మాట్లాడుతు న్నారని దుయ్యబట్టారు. ఆయన శనివారం పార్టీ కేంద్ర కార్యాల యంలో విలేకరులతో మాట్లాడారు. రాజధానిలో రైతులపై సాగుతున్న అకృత్యాలను జగన్ ప్రశ్నించడం అపరాధమా? అని ప్రశ్నించారు. దళితులు, రైతులు తమకు జరిగిన అన్యాయాన్ని జగన్కు వివరించిన ప్రాంతాలను టీడీపీ నేతలు పసుపు నీళ్లతో శుద్ధి చేయడం దేనికి సంకేతమన్నారు.
జగన్ ప్రశ్నలకు సమాధానాలివ్వండి
పర్యటనలో వైఎస్ జగన్ లేవనెత్తిన అంశాలకు టీడీపీ వారికి ధైర్యం ఉంటే సమాధానాలు చెప్పాలే గానీ, చౌకబారు విమర్శలు ఏమిటని బొత్స మండిపడ్డారు. జగన్ సంధించిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక మంత్రులు తమ స్థాయిని మర్చిపోయి మాట్లాడడం మునుపెన్నడూ చూడలేదన్నారు.
అఖిలప్రియపై దాడి జరగలేదు
ఎమ్మెల్యే అఖిలప్రియపై ఎవరూ దాడి చేయలేదని బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. ఆమె కారు అటుగా వచ్చినపుడు వైఎస్సార్ కాంగ్రెస్ జిందాబాద్ అంటూ కార్యకర్తలు నినాదాలు చేశారని, అయితే అలాంటి వాటిని తాము సమర్థించబోమని స్పష్టం చేశారు. దాడుల సంస్కృతిని వైఎస్సార్సీపీ ఎప్పుడూ ప్రోత్సహించదన్నారు. జల్లికట్టుపై తమిళులంతా ఒక్కటై సాధించుకున్నారని, ఇదే స్ఫూర్తితో ప్రత్యేక హోదా కోసం అందరం పోరాడాలని బొత్స పిలుపునిచ్చారు.