'కార్యకర్తలంతా ఎన్నికలకు సిద్ధం కావాలి'


కాచిగూడ: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు పార్టీ కార్యకర్తలందరూ సిద్ధంగా ఉండాలని, గెలుపే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ క్రమశిక్షణ గల సైనికుల్లాగా పనిచేయాలని బీజేపీ శాసనసభాపక్ష నేత, ఎమ్మెల్యే డాక్టర్ కె.లక్ష్మణ్ పిలుపునిచ్చారు. బుధవారం బర్కత్‌పురలోని బీజేపీ గ్రేటర్ కార్యాలయంలో పార్టీ గ్రేటర్ అధ్యక్షులు బి.వెంకట్‌రెడ్డి అధ్యక్షతన పార్టీ పదాధికారులు, కన్వీనర్‌లు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, మాజీ కార్పొరేటర్ల సమావేశం జరిగింది.





కార్పొరేషన్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని అన్ని అసెంబ్లీలవారీగా కో-ఆర్డినేటర్లను నియమించడం, బహిరంగ సభలు పెట్టడం, డివిజన్‌ల వారిగా పార్టీకి ఉన్న అన్ని మోర్చాల సమావేశాలు నిర్వహించి, బస్తీల వారిగా పాదయాత్రలు చేస్తూ నాయకుల పర్యటనలు ఏర్పాటు చేసి స్థానిక సమస్యలను గుర్తించడం వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ప్రజల సమస్యలు తీర్చే విధంగా చూడాలని సూచించారు. సమస్యలు పరిష్కారం కాకపోతే ఆందోళన కార్యక్రమాల ద్వారా ప్రజల్లో బీజేపీని బూత్‌స్థాయి నుంచి పటిష్ట పరచాలని అప్పుడే ఎన్నికల్లో గెలవడం సాధ్యమవుతుందని అన్నారు. ఆగస్టు నెలలో నగరంలో తొలి విడతగా 5 నియోజక వర్గాల్లో బహిరంగ సభలు ఉంటాయని తెలిపారు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top