'గుంతలు లేని రోడ్డు చూపిస్తే రూ. లక్ష బహుమానం'
'హైదరాబాద్ నగరంలోని రోడ్లను అందంగా తీర్చిదిద్దుతాం. అద్దంలా మెరిసిపోయేలా చేస్తాం. కొద్ది రోజుల తర్వాత.. ఎవరైనా రోడ్లపై గుంతలు చూపిస్తే వారికి వెయ్యి రూపాయలు బహుమానం ఇస్తాం' ఇది చాలా నెలల కిందట జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్ కుమార్ చెప్పిన మాట.
'హైదరాబాద్ ను ప్రపంచంలోనే క్లీన్ సిటీగా మార్చుతామన్నారు. రోడ్లు అద్దంలా మెరిసిపోయేలా చేస్తామన్నారు. గుంతలు చూపిస్తే వెయ్యి రూపాయలు ఇస్తామన్నారు. నడిరోడ్డుపై నిల్చొని చెబుతున్నా.. నగరంలో గుంతలు లేని రోడ్డు కనీసం ఒక్కటి చూపించిన నేనే లక్ష రూపాయలు బహుమానం ఇస్తా' ఇదీ బీజేపీ ఎమ్మెల్యే కిషన్ రెడ్డి ప్రభుత్వానికి విసిరిన సవాల్.
నగరంలో పాడైన రోడ్లకు మరమ్మత్తులు, తాగునీటి సమస్యను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ ఆధ్వర్యంలో నల్లకుంట ఫీవర్ ఆస్పత్రివద్ద బుధవారం నిర్వహించిన ధర్నాలో కిషన్ రెడ్డి పాల్గొన్నారు. రోడ్లు బాగుచేస్తామన్న ముఖ్యమంత్రి కేసీఆర్.. 1300 మంది పారిశుద్ధ్య కార్మికులను తొలిగించారని, పేదలకు ఇళ్లు కట్టిస్తామన్న హామీని కూడా అటకెక్కించారని విమర్శించారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే సీఎం ఇంటిని, సచివాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు.