'సీఎం సభను తప్పుదోవ పట్టించారు'
హైదరాబాద్: రాష్ట్రంలో సింగరేణి కార్మికుల స్థితిగతులు, స్థానిక పరిస్థితులు తెలుసుకోవడం కోసమే సింగరేణి యాత్ర చేపట్టినట్లు బీజేపీ శాసనసభ పక్షనేత కిషన్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్లో ఆదివారం ఆయన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో మాట్లాడుతూ.. నిర్వాసితుల సమస్యలు తెలుసుకోవడానికి ఈ యాత్ర ఎంతో ఉపయోగపడిందన్నారు.
సింగరేణి తవ్వకాలతో కొన్ని గ్రామాలు ఎలా కనుమరుగయ్యాయి. పంటలు పండే భూములు ఎలా బీళ్లుగా మారాయో తెలుసుకోవడానికి యాత్ర దోహదపడిందని చెప్పారు. అసెంబ్లీలో సీఎం కేసీఆర్ సింగరేణిలో కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ కార్మికులు లేరని చెప్పి సభను తప్పుదోవ పట్టించారని ఆరోపించారు. ప్రస్తుతం సింగరేణిలో 26 వేల మంది కాంట్రాక్టు ఉద్యోగులు ఉన్నారని...కాంట్రాక్ట్ ఉద్యోగులు లేని విభాగమంటూ లేదని తెలిపారు. ప్రభుత్వం ప్రజలను తప్పు దారి పట్టించే పని చేస్తోందని మండిపడ్డారు. కేంద్రం కార్మికుల జీతాలు పెంచినా కూడా సింగరేణిలో వాటిని ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమంలో సమ్మె సైరన్ ఇచ్చి దేశం దృష్టి ఆకర్షించిన సింగరేణి కార్మికులకు సీఎం అన్యాయం చేస్తున్నారని కిషన్రెడ్డి చెప్పారు.