మీ అక్రమాల పాలనను చూడ్డానికి జాతీయ నేతల్ని పిలవండి

మీ అక్రమాల పాలనను చూడ్డానికి జాతీయ నేతల్ని పిలవండి - Sakshi


వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి భూమన ధ్వజం


 సాక్షి, హైదరాబాద్: కృష్ణా పుష్కరాలకు ఆహ్వానించినట్టుగానే.. రాష్ట్రంలో తాను సాగిస్తున్న అవినీతి, అక్రమాల పాలన ను తిలకించడానికీ జాతీయస్థాయిలోని ప్రముఖుల్ని సీఎం చంద్రబాబు సాదరంగా పిలవాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్‌రెడ్డి కోరారు. ఆయన బుధవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ చంద్రబాబు పాలన రాష్ట్రానికి రాచపుండులాగా మారిందని, అయినా ప్రచారార్భాటంతో రాచఠీవిని ప్రదర్శించేందుకు యత్నిస్తున్నారని ధ్వజమెత్తారు. అసెంబ్లీ సమావేశాల్ని ఐదురోజులే నిర్వహిస్తామని చెప్పడం దారుణమని, 12 రోజులపాటు పుష్కరాల్లో మునిగి తేలడానికి సమయముందిగానీ, అసెంబ్లీకి మాత్రం సీఎంకు సమయం లేదా? అని ప్రశ్నించారు.


ప్రజాసమస్యల్ని అసెంబ్లీలో చర్చకు రాకుండా ఎలాచేస్తారో... ప్రజల తరఫున మాట్లాడే ప్రతిపక్షం గొంతును ఎలా నొక్కుతారో.. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై నిందారోపణలు ఎలా చేస్తారో చూడ్డానికి పుష్కరాల మాదిరిగానే జాతీయ పెద్దలను, ప్రముఖుల్ని ఆహ్వానించాలని కోరారు. అవినీతిలో రాష్ట్రం అగ్రగామిగా ఉంటున్న పరిస్థితిని, అమరావతిలో రాజధాని నిర్మాణం పేరిట దారుణమైన రీతిలో సాగుతున్న అవినీతి, అక్రమాల్ని చూడ్డానికి  అన్నాహజారేనూ ఆహ్వానించాలన్నారు.


 ‘ఓటుకు కోట్లు’తో బాబు గొంతు మూగపోయింది..: పోలవరం జాతీయ ప్రాజెక్టుకు పూర్తిగా కేంద్రమే నిధులివ్వడానికి బదులుగా నాబార్డు ద్వారా నిర్మింపజేస్తామని చెబుతున్నా చంద్రబాబు వ్యతిరేకించట్లేదంటే... ‘ఓటుకు కోట్లు’ వ్యవహారం ఆయన నోరు మూగపోయేలా చేసిందని భూమన విమర్శించారు.


 సింధు విజయాన్నీ మార్కెటింగ్ చేసుకుంటున్నారు..: పండుగలను, పుష్కరాలనూ వదలకుండా తన ప్రచారార్భాటంతో చంద్రబాబు మార్కెటింగ్ చేసుకుంటున్నారని ఆయన విమర్శించారు. చివరకు ఒలింపిక్ రజత పతక విజేత సింధు విజయాన్ని కూడా మార్కెటింగ్ చేసుకుంటున్న ఘనుడు చంద్రబాబన్నారు. సింధు స్వశక్తితో విజయం సాధిస్తే తానే తయారుచేశానని చెప్పుకోవడమేంటన్నారు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top