‘అమ్మా’నుషం


ముగ్గురు చిన్నారులను చంపి.. ఆత్మహత్యకు యత్నించిన తల్లి



బాలానగర్: ఓ తల్లి తన ముగ్గురు చిన్నారులను చంపేసి, తానూ ఆత్మహత్యకు యత్నించింది. ఈ సంఘటన మంగళవారం మహబూబ్‌నగర్ జిల్లా బాలానగర్ మండలం గంగాధర్‌పల్లిలో చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన భిక్షపతి, కౌసల్య దంపతులు భిక్షాటన చేసి జీవనం సాగిస్తున్నారు. వారికిఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. అయితే సోమవారం రాత్రి కౌసల్యతో ఆమె అత్త, ఆడబిడ్డ ఘర్షణ పడ్డారు. తిరిగి మంగళవారం ఉదయం కూడా వారు గొడవకు దిగారు. దీంతో మనస్తాపం చెందిన కౌలస్య తన పిల్లలతో పాటు తాను కూడా ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంది.



అందులో భాగంగా ఉదయం చెన్నమ్మ (05), కుమార్ (03)ను ఉరివేసి, జ్యోతి (01)ని గొంతు పిసికి చంపేసింది. అనంతరం తాను కూడా ఆత్మహత్య చేసుకోవడానికి చెరువు వద్దకు పరుగెడుతుండగా స్థానికులు అడ్డుకున్నారు. దీంతో ఆమె బతికి బయటపడింది. ఈ సంఘటనపై కౌసల్య మాట్లాడుతూ తన అత్తింటివారు అదనపు కట్నం కోసం వేధిస్తుండడం వల్లే ఈ దారుణానికి ఒడి గట్టినట్లు తెలిపింది.

 

 

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top