మళ్లీ పులిరాజ పంజా

మళ్లీ పులిరాజ పంజా


రాష్ట్రంలో రోజూ 100 మందికి హెచ్‌ఐవీ పాజిటివ్!

- గుంటూరు, తూర్పుగోదావరి జిల్లాల్లో ఎక్కువగా నమోదు

- ప్రతీనెలా 120 మంది గర్భిణులకు హెచ్‌ఐవీ ఉన్నట్టు నిర్ధారణ

- చాపకింద నీరులా విస్తరిస్తోన్న వ్యాధి

 గడిచిన 12 నెలల్లో హెచ్‌ఐవీ టెస్టులు చేసింది 7.94 లక్షల మందికి

 హెచ్‌ఐవీ సోకినవారి సంఖ్య 23,960

 హెచ్‌ఐవీ సోకిన గర్భిణులసంఖ్య 996


 

 సాక్షి, హైదరాబాద్ : పులిరాజాకు ఎయిడ్స్ వస్తుందా? ఒకప్పుడు అన్ని టీవీ చానళ్లలో, రోడ్లపక్కన హోర్డింగ్‌లపైన, పత్రికల్లో భారీ ప్రకటనలు హోరెత్తిన విషయం గుర్తుంది కదూ! హెచ్‌ఐవీపై ప్రజల్ని చైతన్యం చేస్తూ జారీ అయిన అవి అప్పట్లో రాష్ట్రంలో  చర్చనీయాంశమయ్యాయి కూడా. అంతేకాదు.. ఎయిడ్స్ నిరోధం కోసం ప్రభుత్వపరంగా పెద్ద ఎత్తున చర్యలు కొనసాగాయి. నిధుల కేటాయింపూ జరిగింది.



 మరిప్పుడో.. : పులిరాజా వస్తున్నాడహో.. అంటూ జాగృతపరిచే ప్రకటనలు లేవు. హోర్డింగ్‌లలో ప్రకటనల్లేవు. కరపత్రాల్లేవు.ఆస్పత్రుల్లోనూ వ్యాధి గురించి చెప్పే గోడరాతల్లేవు. కేంద్ర నిధులు చిక్కిపోయాయి. దీంతో ఎయిడ్స్ నివారణ చర్యలు అంతంతమాత్రమయ్యాయి.



 దీని ఫలితం.. : రాష్ట్రంలో పులిరాజు మళ్లీ విజృంభించాడు. రాష్ట్రంలో హెచ్‌ఐవీ-ఎయిడ్స్ మరలా జడలు విప్పుతోంది. చాపకింద నీరులా విస్తరిస్తోంది. రాష్ట్రంలో రోజూ 100మందికిపైనే హెచ్‌ఐవీ పాజిటివ్ కేసులు నమోదవుతున్నట్టు సాక్షాత్తూ ప్రభుత్వ తాజా సర్వేలోనే వెల్లడవడం గమనార్హం. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో రోజూ 70వేల నుంచి లక్షమందికి హెచ్‌ఐవీ టెస్టులు నిర్వహిస్తుంటే 100 నుంచి 125 మందికి హెచ్‌ఐవీ పాజిటివ్ ఉన్నట్టు తేలుతోంది. అత్యధికంగా గుంటూరు, తూర్పుగోదావరి, కృష్ణా, పశ్చిమగోదావరి, విశాఖ జిల్లాల్లో ఉన్నట్టు వెల్లడైంది. ప్రతీనెలా 120 మంది గర్భిణులకు హెచ్‌ఐవీ ఉన్నట్లు నిర్ధారణవుతోంది.



 నిధుల్లేక.. మందులు కొనట్లేదు: హెచ్‌ఐవీ-ఎయిడ్స్ నివారణ చర్యల్లో ప్రధానమైంది పరీక్షలు. తర్వాత మందుల సరఫరా కీలకం. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు సరిగా రావట్లేదు. ఏడాదికి దాదాపు రూ.80 కోట్ల వరకు రావాల్సివుంటే 2015-16లో వచ్చింది రూ.20 కోట్లే. ఈ ఏడాది ఇవీ ఇంతవరకూ రాలేదు. ఈ నేపథ్యంలో ఇంటిగ్రేటెడ్ కౌన్సెలింగ్ అండ్ టెస్టింగ్ సెంటర్(ఐసీటీసీ)లలో హెచ్‌ఐవీ బాధితులకు పరీక్షలు నిర్వహిద్దామంటే.. కనీసం సిరంజీలు, సూదులు(నీడిల్స్) లేని పరిస్థితి నెలకొంది. హెచ్‌ఐవీ సోకిన గర్భిణులకు పుట్టే బిడ్డలకు హెచ్‌ఐవీ సోకకుండా ఇవ్వాల్సిన నెవరపిన్ సిరప్‌లు 9నెలలుగా లేవు.



హెచ్‌ఐవీ సోకిన గర్భిణులకు డెలివరీ చెయ్యాలంటే కావాల్సిన గ్లౌజ్‌లుసైతం ప్రభుత్వాసుపత్రుల్లో లేవు. గతంలో రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ మండలి(ఏపీశాక్స్) హెచ్‌ఐవీ బాధితులకు తమ నిధులతో మందులు కొనేది. ఇప్పుడు ఏపీశాక్స్ నుంచి నిధులు రాకపోవడంతో రాష్ట్ర మౌలిక వైద్య సదుపాయాల అభివృద్ధి సంస్థ కొనట్లేదు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వాసుపత్రుల్లో మందులడిగితే.. మీరే కొనుక్కోండని చెబుతున్నారు. దీనివల్ల ప్రధానంగా టెస్ట్ కిట్‌లు లేక వేలాదిమంది వైద్యపరీక్షలకు దూరమవుతున్నారు. హెచ్‌ఐవీ ఉన్నా టెస్టులు చేయకపోవడం వల్ల తెలుసుకోలేక జీవితాన్ని కోల్పోతున్నారు. ఈనేపథ్యంలో రాష్ట్రంలో హెచ్‌ఐవీ చాపకింద నీరులా విస్తరిస్తోంది. సరైనవిధంగా వైద్యపరీక్షలు జరిగితే హెచ్‌ఐవీ సోకినవారి సంఖ్య మరింత ఎక్కువగా ఉన్నా ఆశ్చర్యం లేదు.

 

 రిజిస్టర్లూ లేవు..

 సాధారణంగా హెచ్‌ఐవీ టెస్టు చెయ్యాలంటే  రోగినుంచి అనుమతి పత్రం తీసుకున్నాకే పరీక్ష చెయ్యాలి. లేదంటే చెయ్యకూడదు. అయితే అలాంటి కన్సంట్ లెటర్లు తీసుకోవడం లేనేలేదు. అంతేకాదు.. హెచ్‌ఐవీ సోకిన బాధితుల వివరాలు నమోదుకు రిజిస్టర్లు కూడా లేవు. ఇప్పటికైనా ప్రభుత్వం హెచ్‌ఐవీ నివారణ చర్యలపై మరింత శ్రద్ధ పెడితే మేలు. లేకుంటే పరిస్థితి మరింత దిగజారే ప్రమాదముంది.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top