‘త్రివేణి’కి ఏపీఎండీసీ సలాం

‘త్రివేణి’కి ఏపీఎండీసీ సలాం


- చెన్నై సంస్థకు రూ. 1,600 కోట్ల బెరైటీస్ కాంట్రాక్టు

- ఖనిజాభివృద్ధి సంస్థలో ‘కీలకనేత’ కుంభకోణం

- ‘త్రివేణి’ కోసం పుట్టుకొచ్చిన టెయిలర్‌మేడ్ కండిషన్లు

- బిడ్డింగ్‌లో 3 సంస్థలు మాత్రమే మిగిలేలా నిబంధనలు


 

 సాక్షి, హైదరాబాద్: తూతూమంత్రపు టెండర్లతో రూ. 1,600 కోట్ల విలువైన బెరైటీస్ తవ్వకం కాంట్రాక్టును చెన్నైకి చెందిన త్రివేణి ఎర్త్‌మూవర్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృద్ధి సంస్థ కట్టబెట్టింది. వైఎస్సార్ జిల్లా మంగంపేటలోని బెరైటీస్ ప్రాజెక్టులో ఖనిజ తవ్వకం, వ్యర్థాల తరలింపు పనుల కోసం ఏపీఎండీసీ ఈ-టెండర్లు పిలిచింది. ఏటా 30 లక్షల టన్నుల బెరైటీస్ ఖనిజ తవ్వకం, 90 లక్షల క్యూబిక్ మీటర్ల వ్యర్థాల తొలగింపు చొప్పున మూడేళ్లలో 90 లక్షల టన్నుల ఖనిజ తవ్వకం,  270 లక్షల క్యూబిక్ మీటర్ల వ్యర్థాల తొలగింపు కోసం టెండర్లు పిలవగా మూడు సంస్థలు మాత్రమే ప్రైస్ బిడ్డింగులో పాల్గొన్నాయి. ముందస్తు ఒప్పందంలో భాగంగా వీటిలో రెండు సంస్థలు ‘త్రివేణి’కి అనుకూలంగా ‘రింగ్’ అయ్యాయి. టెండర్లను రద్దుచేసి తిరిగి  నిర్వహించాల్సి ఉన్నా ఏపీఎండీసీ అందుకు భిన్నంగా ఓకే చెప్పేసింది. కాంట్రాక్టుపై ఒప్పందం చేసుకోవాలంటూ త్రివేణికి లేఖ ఇచ్చింది. చిత్రమేమిటంటే ఈ కుంభకోణం వల్ల ఏపీఎండీసీకి కూడా రూ.530 కోట్లుపైగా నష్టం వాటిల్లనుంది. అయినా ‘కీలకనేత’కు భారీగా ముట్టడంతో ఈ వ్యవహారం ఎలాంటి ఆటంకాలూ లేకుండా సాగిపోతోందని వినిపిస్తోంది.

 

 ఏపీఎండీసీలో ‘కీలకనేత’ మంత్రాంగం

 ప్రభుత్వంలో ‘కీలక’ నేత ఆదేశాలు, మంత్రాంగం మేరకు బెరైటీస్ తవ్వకం కాంట్రాక్టును ‘త్రివేణి’కే కట్టబెట్టేందుకు ఏపీఎండీసీలో గూడుపుఠాణీ జరిగిందన్న ఆరోపణలున్నాయి. ‘త్రివేణి’ అధినేత స్వయంగా ‘కీలకనేత’ను కలిసి భారీగా ముట్టజెప్పారని, దాంతో ఆ సంస్థకు అనుకూలంగా టెండరు నిబంధనలు రూపొందించేలా ఏపీఎండీసీలో మంత్రాంగం నడిచిందనే ఆరోపణలున్నాయి. ఏపీఎండీసీ అనుసరించిన తీరు ఈ ఆరోపణలకు బలం చేకూర్చేదిలా ఉంది. ఎక్కువ సంస్థలు ఈ టెండర్లలో పాల్గొనేందుకు అవకాశం లేకుండా నామమాత్రపు పోటీ ఉండేలా టెండరు నిబంధనలు రూపొందాయి. టెండరు నోటిఫికేషన్ జారీ చేసిన తర్వాత ‘త్రివేణి’కి అనుకూలంగా ఉండేలా కొన్ని సవరణ ప్రకటనలు కూడా విడుదలయ్యాయి. ఈ కాంట్రాక్టును త్రివేణి సంస్థకు కట్టబెట్టాలని ఏపీఎండీసీ ముందే నిర్ణయించుకుని  దానికి అనుకూలంగా ‘టెయిలర్‌మేడ్’ నిబంధనలు రూపొందించింది. తాము కోరుకున్న సంస్థలకు మాత్రమే టెండర్లలో పాల్గొనేందుకు అర్హత ఉండేలా ఉద్దేశపూర్వకంగా నిబంధనలు రూపొందించడాన్ని టెండర్ల పరిభాషలో ‘టెయిలర్‌మేడ్ కండిషన్లు’ అంటారు.  

 

 ఖనిజ తవ్వకాలకు, లోడింగ్‌కు, అన్‌లోడింగ్‌కు హైఎండ్ క్రేన్లు, హై ఎండ్ యంత్రాలు కలిగి ఉండాలనేది ఇందులో ప్రధానమైన నిబంధన. ఈ కారణంగా అనేక సంస్థలకు టెండర్లలో పాల్గొనేందుకు అర్హత లేకుండా పోయింది. దీంతో ‘కీలకనేత’ ఆశించినట్లే మూడు సంస్థలు మాత్రమే టెక్నికల్ బిడ్డింగులో అర్హత పొందాయి. కమల్‌జీత్ సింగ్ అహ్లూవాలియా - నాగార్జున కన్‌స్ట్రక్షన్ కంపెనీ లిమిటెడ్(ఎల్-3), ఇంద్రాణి పట్నాయక్ - వీపీఆర్ మైనింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రయివేట్ లిమిటెడ్(ఎల్-2), త్రివేణి ఎర్త్‌మూవర్స్(ఎల్-1)గా బిడ్డింగ్‌లో మిగిలాయి. కీలక నేత సూచన మేరకు మిగిలిన రెండు సంస్థలు ఈ -టెండర్లలో పాల్గొని ‘రింగ్’ కావడం ద్వారా ‘త్రివేణి’కి అనుకూలంగా వ్యవహరించాయి.

 

 ఐదేళ్లు ధారాదత్తం...

 గత ఏడాది డిసెంబరు 16వ తేదీ వరకూ మంగంపేట బెరైటీస్ ప్రాజెక్టులో ఖనిజ తవ్వకం, వ్యర్థాల తరలింపు కాంట్రాక్టును ‘త్రివేణి’ సంస్థే నిర్వహించింది. తాజాగా మూడేళ్లపాటు ఇవే పనుల కోసం ఏపీఎండీసీ టెండర్లు నిర్వహించింది. కానీ ఏటా 5 శాతం చొప్పున పెంచి మరో రెండేళ్లు పొడిగించేందుకు ఏపీఎండీసీకి అవకాశం ఉందని టెండర్ నిబంధనలను బట్టి తెలుస్తోంది. అంటే ఐదేళ్ల పాటు ఈ కాంట్రాక్టును ‘త్రివేణి’కి ధారాదత్తం చేసేందుకు ఏపీఎండీసీ రంగం సిద్ధం చేసిందన్నమాట. టన్ను ఖనిజ తవ్వకానికి రూ.149, క్యూబిక్ మీటరు వ్యర్థాల తొలగింపునకు రూ. 299 చొప్పున ‘త్రివేణి’ కోట్ చేసింది.

 

 ఈ లెక్కన మూడేళ్లలో 270 లక్షల క్యూబిక్ మీటర్ల వ్యర్థాల తొలగింపునకు (2.7 కోట్లుఁ 299) రూ. 807. 30 కోట్లు అవుతుంది.  90 లక్షల టన్నుల ఖనిజ తవ్వకానికి ( 90 లక్షలు ఁ 149) రూ. 134.10 కోట్లు కలిపి మొత్తం రూ. 941.40 కోట్లు అవుతుంది. (అంటే ఈ కాంట్రాక్టు ప్రకారం ఏడాదికి రూ. 313 కోట్లుపైగా మొత్తాన్ని త్రివేణి సంస్థకు ఏపీఎండీసీ చెల్లించాల్సి ఉంటుంది) మూడేళ్ల తర్వాత  ఏటా 5శాతం పెంపుతో మరో రెండేళ్లు ఈ పనిచేసేందుకు త్రివేణికి ఏపీఎండీసీ చెల్లించాల్సిన మొత్తం (మొదటి మూడేళ్లకు చెల్లించే దానితో కలిపి) రూ. 1600 కోట్లు పైమాటే.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top