'ఇక నుంచి అసెంబ్లీ అమరావతిలోనే'
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలను ఇక నుంచి నూతన రాజధాని అమరావతిలోనే నిర్వహిస్తామని స్పీకర్ కోడెల శివప్రసాదరావు చెప్పారు. హైదరాబాద్లో ఆదివారం ఆయన మీడియాతో మార్చి 3 నుంచి బడ్జెట్ సమావేశాలను నిర్వహించే అవకాశముందన్నారు.
తొలిసారిగా అమరావతిలో నిర్వహించే అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. శాసనసభకు సంబంధించిన అన్ని కార్యక్రమాలను ఇక నుంచి అమరావతిలోనే నిర్వహిస్తామని స్పష్టం చేశారు. హైదరాబాద్ అసెంబ్లీలో ఇప్పటి వరకు నాలుగు సమావేశాలను నిర్వహించామన్నారు. ఈ నెల 25 లోగా ఏపీ అసెంబ్లీ సిబ్బంది అమరావతికి తరలివెళ్తారని..వారికి కావాల్సిన అన్ని వసతులు కల్పిస్తున్నామన్నారు. గత అసెంబ్లీ వర్షాకాల సమావేశాలను అమరావతిలో నిర్వహించాలని భావించిన వసతులు లేని కారణంగా హైదరాబాద్లో నిర్వహించిన విషయం తెలిసిందే.
(చదవండి : మహిళలపై కోడెల వివాదస్పద వ్యాఖ్యలు ! )
మహిళల పట్ల ఆయన చేసిన వ్యాఖ్యలపై మాట్లాడుతూ 'మహిళల గురించి నేను ఏమి తప్పుగా మాట్లాడలేదు. మహిళా పార్లమెంట్ సదస్సులో నా మాటలను వక్రీకరించారు. నేను చేసిన వ్యాఖ్యలను వక్రీకరించి ప్రచారం చేసిన వారిపై సరైన సమయంలో చర్యలు తీసుకుంటాను. మహిళల గురించి అనని మాటలను కూడా అన్నట్లు చెప్పారు. మహిళా సదస్సు సందర్భంగా కొందరు పనిగట్టుకుని దుష్ప్రచారం చేశారు' అని చెప్పారు.