బిచ్చమెత్తితే పెట్టుబడులు రావు
సీఎంపై అంబటి రాంబాబు ధ్వజం
సాక్షి, హైదరాబాద్: మౌలిక సదుపాయాలు కల్పించి మంచి పరిపాలనను అందిస్తే ఏపీకి పెట్టుబడులు వస్తాయి తప్ప విదేశాలకు వెళ్లి బిచ్చమెత్తితే రావని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పీఏసీ సభ్యుడు అంబటి రాంబాబు సీఎం చంద్రబాబుపై ధ్వజమెత్తారు. సీఎం ఐదు రోజుల చైనా పర్యటనకు వెళ్లడంపై ఆయన తీవ్రంగా స్పందించారు. సోమవారం ఆయన పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు.గతంలో జపాన్ పర్యటనలో కొన్ని కంపెనీలతో చేసుకున్న ఎంఓయూలు ఏమయ్యాయని, అక్కడి నుంచి ఎన్ని పెట్టుబడులు వచ్చాయో చెప్పాలని డిమాండ్ చేశారు.
అన్ని సూట్కేసులెందుకో..: బాబు విదేశీ పర్యటనలకు వెళుతున్నది ఏపీలో దోచుకున్న సొమ్మును విదేశీ బ్యాంకుల్లో దాచుకోవడానికే అనే అనుమానం కలుగుతోందని అంబటి అన్నారు. ప్రత్యేక విమానాల్లో చంద్రబాబు విదేశాలకు వెళ్లేటపుడు పెద్ద సంఖ్యలో సూట్కేసులు ఎందుకు తీసుకెళుతున్నారు.. మూడు నాలుగు రోజుల పర్యటనకు కొన్ని సూట్కేసులు చాలు కదా అని ప్రశ్నించారు. ఆయన పర్యటనలను కేంద్రం పరిశీలించాలని డిమాండ్ చేశారు. కొత్త రాజధాని నిర్మాణంలో నైపుణ్యం, అనుభవం గల స్వదేశీ సంస్థలున్నా చంద్రబాబు సింగపూర్ వెనుక పరుగెత్తడం వెనుక దోపిడీయే కారణమని రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. సచివాలయ భవనాలు కుంగిపోతున్నట్లు సాక్షిలో రాస్తున్నారంటూ చంద్రబాబు మండిపడ్డారని, ఆ మాట నిజం కాకపోతే మీడియాను తీసుకెళ్లి చూపించాలన్నారు.అక్కడికి వెళ్లేందుకు ఆంక్షలెందుకన్నారు.