బాబు వల్లే రాష్ట్రానికి అరిష్టాలు

బాబు వల్లే రాష్ట్రానికి అరిష్టాలు - Sakshi


వైఎస్సార్‌సీపీ పీఏసీ సభ్యుడు అంబటి రాంబాబు మండిపాటు

సాక్షి, హైదరాబాద్: పవిత్ర కృష్ణా పుష్కరాలను ముఖ్యమంత్రి చంద్రబాబు పూర్తిగా అపవిత్రం చేశారని, ఆయన చేసిన పాపాల వల్లే రాష్ట్రానికి ఎన్నో అరిష్టాలు ఏర్పడ్డాయని వైఎస్సార్‌సీపీ రాజకీయ వ్యవహారాల మండలి (పీఏసీ) సభ్యుడు అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. పుష్కరాలకు కేటాయించిన రూ.1,800 కోట్లలో సగానికిపైనా నిధులను చంద్రబాబు టీడీపీ తాబేదార్ల జేబుల్లో నింపారని ఆరోపించారు. అంబటి బుధవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు.


 ఇసుక మాఫియా వల్ల బలైనా

‘‘చంద్రబాబు, లోకేశ్ తాలూకూ మాఫియా కృష్ణా నదీ గర్భంలో ఇసుక తవ్వి రూ.లక్షల కోట్లు దోపిడీ చేసింది. దాని ఫలితంగా ఏర్పడిన గుంటల్లో పడి ఐదుగురు విద్యార్థులు బలయ్యారు. ఇసుక మాఫియాతో కృష్ణా నదిని సర్వనాశనం చేయించిన చంద్రబాబు ఇవాళ పుష్కరాలు బ్రహ్మాండంగా జరిగాయని చెప్పుకుంటూ ఉంటే, పత్రికలు రాస్తూ ఉంటే ప్రజలు చెవిలో పూలు పెట్టుకొని వినాల్సి వస్తోంది. బాబు చేసిన పాపాల ఫలితాన్ని రాష్ట్ర ప్రజలు అనుభవించాల్సిన స్థితి ఏర్పడింది.’’


 ఊకదంపుడు ఉపన్యాసాలు

‘‘చంద్రబాబు పుష్కరాల 12 రోజులూ పవిత్ర ప్రదేశాలకు వచ్చి, భక్తులను నిర్భందించి మరీ గంటల తరబడి రాజకీయ ఉపన్యాసాలు ఇచ్చారు. పుష్కరాల్లో ఊకదంపుడు ఉపన్యాసాల్లో మునిగి తేలిన చంద్రబాబు కృష్ణా డెల్టా ఎండిపోతున్నా... రాష్ర్టంలో కరువు విలయతాండవం చేస్తున్నా పట్టించుకున్న పాపాన పోలేదు’’ అని అంబటి విమర్శించారు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top