చంద్రబాబును ఎవరూ కాపాడలేరు
- ఓటుకు కోట్లు కేసులో వాస్తవాలన్నీ బయటకు రాబోతున్నాయి..
- వైఎస్సార్సీపీ నేత అంబటి
సాక్షి, హైదరాబాద్: ఓటుకు కోట్లు కేసులో టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబును ఎవరూ కాపాడలేరని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు అన్నారు. ఈ కేసుకు సంబంధించి తమ పార్టీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అన్ని సాక్ష్యాధారాలతో కోర్టును ఆశ్రయించినట్లు చెప్పారు. ఆయన చేసిన ప్రైవేటు ఫిర్యాదును ఏసీబీ కోర్టు స్వీకరించి విచారణకు ఆదేశించడం హర్షించదగిన పరిణామంగా పేర్కొన్నారు. త్వరలో ఈ కేసుకు సంబంధించిన వాస్తవాలు బయటకు రాబోతున్నాయని చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు, తెలంగాణ సీఎం కేసీఆర్లు జోక్యం చేసుకున్నా చంద్రబాబును తప్పించలేరని, న్యాయవ్యవస్ధ చాలా బలీయమైనదని స్పష్టం చేశారు. అంబటి సోమవారం పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ కేసు నుంచి చంద్రబాబును రక్షించేందుకు గతంలో తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నించిందని, ఈ విషయంలో వెంకయ్యనాయుడు రాజీ కుదిర్చారని చెప్పారు. అందుకు ప్రతిఫలంగా ఏపీ ప్రయోజనాలను చంద్రబాబు తాకట్టు పెట్టారని మండిపడ్డారు.
పవన్కు మోదీ, బాబు సమాధానం చెప్పాలి..
ఏపీకి ప్రత్యేక హోదాతో పాటు పలు అంశాలపై జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అడిగిన ప్రశ్నలకు ప్రధాని మోదీ, చంద్రబాబు సమాధానం చెప్పాలని అంబటి డిమాండ్ చేశారు. ప్రత్యేక హోదాతో పాటు రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎవరు పోరాటం చేసినా తమ పార్టీ మద్దతు ఇస్తుందన్నారు.
వైఎస్ వర్ధంతి రోజు సేవా కార్యక్రమాలు
సెప్టెంబర్ 2న దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి సందర్భంగా పార్టీ శ్రేణులు, అభిమానులు సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలని అంబటి పిలుపునిచ్చారు. అన్నదానం, రక్తదానం వంటి సేవా కార్యక్రమాల ద్వారా మహానేతకు ఘనంగా
నివాళులర్పించాలనికోరారు.