‘ఆన్లైన్’ ఆగిపోవడంతో ఆరా!
ఐసిస్ రిక్రూటర్ అద్నాన్ అరెస్టు తెలిసిందిలా
సాక్షి, హైదరాబాద్: ఐసిస్ (ఐఎస్ఐఎస్)కు ఆన్లైన్ రిక్రూటర్గా వ్యవహరిస్తున్న అద్నాన్ హసన్ దమూదీని దుబాయ్ పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం భారత నిఘా వర్గాలకు ‘ఆన్లైన్’ ద్వారానే తెలిసింది. గత ఏడాది సిరియా వెళ్లే ప్రయత్నాల్లో పశ్చిమ బెంగాల్లోని మాల్దాలో పట్టుబడిన నలుగురు హైదరాబాద్ యువకుల్నీ ఆకర్షించింది అద్నాన్ అని నిఘా వర్గాలు తేల్చిన విషయం విదితమే. కర్ణాటకలోని ఉత్తర కన్నడ జిల్లాలో ఉన్న భత్కల్కు చెందిన అద్నాన్ ధర్వాడలోని కర్నాటక్ యూనివర్సిటీ నుంచి కామర్స్ విభాగంలో డిగ్రీ పూర్తి చేశాడు. బతుకుదెరువు కోసం 2012లో దుబాయ్ వెళ్లిన అద్నాన్ అక్కడి వరల్డ్ ట్రేడ్ సెంటర్లోని ఓ సంస్థలో అసిస్టెంట్ డెలివరీ కో-ఆర్డినేటర్గా పని చేస్తున్నాడు.
వెబ్సైట్స్ సాయంతో యువతకు వల
భత్కల్ ప్రాంతానికే చెందిన, ఐఎంలో కీలకపాత్ర పోషించిన సుల్తాన్ ద్వారా ఐసిస్ వైపు మళ్లిన అద్నాన్.... ట్విటర్, ఫేస్బుక్, యూట్యూబ్ల్లో ఖాతాలు తెరిచి, కొన్ని వెబ్సైట్స్ సహాయంతో ఆన్లైన్ ద్వారా పలువురు యువతను ఐసిస్ వైపు ఆకర్షించాడు. ట్విటర్లో అద్నాన్ దమూదీ పేరుతో ఖాతా నిర్వహించడంతో పాటు ఇసాబా, తౌహీద్ పేర్లతో ఏర్పాటు చేసిన వెబ్సైట్స్లో అభ్యంతరకరమైన వీడియోలు, వ్యాఖ్యలు అప్లోడ్ చేస్తుండేవాడు. నలుగురు నగర యువకుల్ని విచారించిన నిఘా వర్గాలు వీటితో పాటు అద్నాన్కు సంబంధించిన స్కైప్ తదితర ఆన్లైన్ కార్యకలాపాలను గుర్తించారు.
అప్పటి నుంచి నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఎన్టీఆర్వో) సహాయంతో ఇతడి అన్ని రకాలైన ఆన్లైన్ కార్యకలాపాలపై సాంకేతికంగా నిఘా వేసి ఉంచాయి. దాదాపు రెండు నెలల క్రితం నుంచి అద్నాన్ ఆన్లైన్ కార్యకలాపాలు పూర్తిగా ఆగిపోయినట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. దీంతో ఏం జరిగిందనే విషయాన్ని ఆరా తీయగా... ఐసిస్ కార్యకలాపాల ఆరోపణలపై దుబాయ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు వెలుగులోకి వచ్చింది. అద్నాన్ను భారత్కు డిపోర్టేషన్ ద్వారా తీసుకువచ్చేందుకు కేంద్రం ఆధీనంలోని హోం మంత్రిత్వ శాఖ ద్వారా అక్కడి అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నారు.