నలుగురు యువతులు అదృశ్యం
హైదరాబాద్: నగర పరిధిలో వేర్వేరు ఘటనల్లో ముగ్గురు యువతులు, ఒక బాలిక కనిపించకుండా పోయారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కేరళకు చెందిన వేణినివాస్ శ్రీవాణి(29) చంపాపేటలోని ఫోకస్ ఆసుపత్రిలో పని చేస్తోంది. అదే ఆసుపత్రిలో పనిచేసే ఇబ్రహీపట్నం మండలం వెలిమినేడు గ్రామానికి చెందిన మంద నాగరాజును ప్రేమించి వివాహం చేసుకుంది. బుధవారం ఇంటి నుంచి ఆసుపత్రికి బయలుదేరిన శ్రీవాణి ఎటో వెళ్లిపోయింది. పరిచయస్తులను వాకబు చేసినా ఫలితం కనిపించకపోవటంతో భర్త నాగరాజు సైదాబాద్ పోలీసులను ఆశ్రయించాడు.
మరో ఘటనలో నిజమాబాద్ జిల్లా జెక్రాన్పల్లి మండలం మనోహరాబాద్కు చెందిన లింగారెడ్డి కుమార్తె అపర్ణ(24)కు మతి స్థిమితం లేదు. ఏడాది నుంచి ఆమెను రంగారెడ్డి జిల్లా హస్తినాపురంలో గల షిర్డీ సాయినగర్లోని కీర్తన ఫౌండేషన్లో ఉంచుతున్నారు. విష్ణునగర్లోని మానసిక వికాస కేంద్రంలో ఆమెకు చికిత్స చేయిస్తున్నారు. ఈ నెల 17న వికాస కేంద్రానికి వచ్చిన అపర్ణ ఆడుకుంటూ వెళ్లి కనిపించకుండా పోయింది. ఈ మేరకు గురువారం మానసిక వికాస కేంద్రం ప్రిన్సిపాల్ ప్రసాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఎల్బీ నగర్ సద్గుర్నగర్కు చెందిన అరుణ(14) స్ధానిక హైస్కూల్లో 9వ తరగతి చదువుతోంది. ఈ నెల 17న పాఠశాలకు వెళ్తున్నానని చెప్పి వెళ్లి తిరిగి రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు చుట్టుపక్కల ప్రాంతాల్లో వెతికినా ప్రయోజనం లేకపోవడంతో ఎల్బీనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సరూర్నగర్ లోని శారదానగర్లో నివాసముండే రవళి(20) బీటెక్ సెకండియర్ చదువుతోంది. మూడు రోజుల కిందట కళాశాలకు వెళ్తున్నట్లు ఇంట్లో చెప్పి వెళ్ళింది. తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు చైతన్యపురి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.