మత్తు ఇంజక్షన్ల విక్రయం: ముగ్గురి అరెస్ట్


హైదరాబాద్(యాకుత్‌పురా): మత్తు ఇంజక్షన్లను విక్రయిస్తున్న ముగ్గురు వ్యక్తులను రెయిన్‌బజార్ పోలీసులు శనివారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. వారి వద్ద నుంచి 200 మత్తు ఇంజక్షన్లను స్వాధీనం చేసుకున్నారు. ఎస్ఐ జి.శ్రీనివాస్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం... మల్కాజిగిరి ప్రాంతానికి చెందిన ప్రకాశ్ (43) కొన్ని రోజులుగా మత్తు ఇంజక్షన్లను విక్రయిస్తున్నాడు. యాకుత్‌పురా బాగ్‌హే జహేరా ప్రాంతానికి చెందిన మహ్మద్ అబ్దుల్ మాజిద్ ఖాన్(45) ప్రకాశ్ వద్ద మత్తు ఇంజక్షన్లను కొనుగోలు చేసి పాతబస్తీలోని పలు ప్రాంతాల్లో విక్రయిస్తున్నాడు.



ప్రకాశ్‌తో పాటు సైనిక్‌పురి ప్రాంతానికి చెందిన శైలేష్ (34) సైతం మత్తు ఇంజక్షన్ల విక్రయాలు చేస్తుంటాడు. మాజిద్ మత్తు ఇంజక్షన్లను రూ. 5.50లకు కొనుగోలు చేసి యాకుత్‌పురా పరిసర ప్రాంతాల్లో అవసరమైన వారికి అధిక ధరలకు విక్రయిస్తున్నాడు. దీనిపై విశ్వసనీయ సమాచారం మేరకు శనివారం దక్షిణ మండలం టాస్క్‌ఫోర్స్ పోలీసులు అబ్దుల్ మాజిద్ ఇంటిపై దాడి చేసి 200 మత్తు ఇంజక్షన్లను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం తదుపరి విచారణ నిమిత్తం రెయిన్‌బజార్ పోలీసులకు అప్పగించారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మత్తు ఇంజక్షన్ల విక్రయాలు చేస్తున్న ప్రకాశ్‌తో పాటు అబ్దుల్ మాజిద్, శైలేష్‌లను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top