గ్రేటర్లో కుటుంబాల సంఖ్య 21,60,601
సర్వే పూర్తయినవి 20,11,293
ఇంకా గణించాల్సినవి 1,49,308
సర్వే సాక్షిగా మహానగరి జనగణన ఇది..
హైదరాబాద్: సమగ్ర కుటుంబ సర్వేలో ప్రజలు స్వచ్ఛందంగా వివరాలు వెల్లడించడంతో హైదరాబాద్ జనాభా ఎంతో ‘లెక్క’ తేలింది. తాజా లెక్కల ప్రకారం సిటీలో ఇప్పటికే 20,11,293 కుటుంబాలను అధికారులు సర్వే చేశారు. మరో 1,49,308 కుటుంబాలకు సర్వే నిర్వహించాల్సి ఉంది. ఈ లెక్కన గ్రేటర్లో మొత్తం కుటుంబాల సంఖ్య సుమారుగా 21,60,601 ఉండే అవకాశం ఉంది.
2011 జనాభా లెక్కల ప్రకారం...: 2001-2011 నాటికి గ్రేటర్లోని హైదరాబాద్ జిల్లా జనాభా పెరుగుదల కేవలం 2.97 శాతంగా ఉండటం సైతం తప్పని అర్థమవుతోంది. జిల్లా పరిధిలో ఓయూ, కంటోన్మెంట్ ప్రాంతాలు లేవు. వాటిని కలిపి గణించినా పెరుగుదల 4.7 శాతమే. 1991-2001 మధ్య పెరుగుదల రేటు 21.74 శాతంగా కాగా, మలి దశాబ్దానికి దారుణంగా తగ్గిపోవడం ఎన్నో ప్రశ్నల్ని లేవనెత్తింది. తాజా సర్వేతో అవన్నీ పటాపంచలయ్యాయి. 2011 నాటి సర్వేలోని వివరాలు తప్పుల తడకలని.. కాకి లెక్కలని సమగ్రకుటుంబ సర్వే నిగ్గుతేల్చింది. అంతేకాదు..2011 జనగణనలో హైదరాబాద్ జిల్లా జనాభా కేవలం 39.43 లక్షలుగా పేర్కొన్నారు. అది 50 లక్షలకు పైనే ఉంటుందని అప్పట్లోనే ‘సాక్షి’ వెల్లడించింది. జిల్లాలోని రేషన్కార్డులు.. గ్యాస్ కనెక్షన్ల సంఖ్యను పోల్చి చూపుతూ అప్పట్లో గ్రేటర్ జనాభాను అంచనా వేసింది.
టాప్లో ఎల్బీ నగర్...
తాజా సర్వే వివరాలతో గ్రేటర్లోని 18 సర్కిళ్లలో 2011 నాటి కంటే కుటుంబాలు పెరిగిన వాటిల్లో ఎల్బీ నగర్ అగ్రస్థానంలో ఉంది. ఈ సర్కిల్లో అత్యధికంగా అప్పటికంటే 87,377 కుటుంబాలు పెరిగాయి. మొత్తం 2,26,796 కుటుంబాలున్నాయి. అత్యల్పంగా ఆబిడ్స్-1 సర్కిల్లో 3,445 కుటుంబాలు పెరిగాయి. ప్రస్తుతం మొత్తం 23,471 కుటుంబాలు ఈ సర్కిల్లో ఉన్నాయి. అత్యధికంగా కుటుంబాలు పెరిగిన సర్కిళ్లలో ఎల్బీనగర్ తర్వాత వరుసగాా కుత్బుల్లాపూర్, కూకట్పల్లి, సికింద్రాబాద్లు ఉన్నాయి. వరుస క్రమంలో పెరిగిన కుటుంబాలు ఆయా సర్కిళ్లలో ఇలా ఉన్నాయి..
జూబ్లీహిల్స్లో ‘సర్వే’ పత్రాలు మాయం
ఖైరతాబాద్ నియోజక వర్గం జూబ్లీహిల్స్ డివిజన్ పరిధిలోని జూబ్లీహిల్స్ రోడ్నంబర్ 10, గాయత్రిహిల్స్ ప్రాంతాల్లో మంగళవారం నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వే పత్రాలు అదృశ్యమయ్యాయి. ఇందుకు సంబంధించిన రెండు పుస్తకాలు కనిపించడం లేదని జూబ్లీహిల్స్ సమగ్ర సర్వే క్లస్టర్ ఇంచార్జ్ శ్యాంసుందర్, ఎన్యూమరేటర్ మధుకర్స్వామి బుధవారం జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మంగళవారం సాయంత్రం వరకు రామంతపూర్కు చెందిన ఇద్దరు విద్యార్థులు అసోసియేట్ ఎన్యూమరేటర్లుగా గాయత్రిహిల్స్ ప్రాంతంలోని 80 ఇళ్లను సర్వే చేశారని ఇంకా కొన్ని మిగిలి ఉండటంతో సర్వే పుస్తకాలను తీసుకొని వారు తమ ఇళ్లకు ఆటోలో వెళ్లారు. ఆ సందర్భంలో ఆటోలో వాటిని మరిచిపోయినట్లు భావిస్తున్నారు. బుధవారం ఉదయం గుర్తించి శ్యాంసుందర్, మధుకర్ స్వామిలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ పుస్తకాలు దొరికినవారు తమ పోలీస్స్టేషన్లో అందించాలని ఇన్స్పెక్టర్ వెంకట్రెడ్డి కోరారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.