108 సర్వీసులకు అంతరాయం

108 సర్వీసులకు అంతరాయం - Sakshi


నాలుగుచోట్ల తెగిపోయిన కేబుల్ వైర్లు

తెలంగాణ, ఏపీలో నిలిచిపోయిన అంబులెన్సులు

 

సాక్షి, హైదరాబాద్: తెలంగాణ, ఏపీల్లో 108 అంబులెన్స్ సర్వీసులకు బ్రేక్ పడింది. ఆదివా రం మధ్యాహ్నం నుంచి ఈ సర్వీసులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. 108 నెంబరుకు ఫోన్ చేస్తే బిజీ టోన్ వస్తోంది. అంబులెన్స్ సేవలు నిలిచిపోవడంతో రెండు రాష్ట్రాల్లో క్షతగాత్రు లు, రోగులు విలవిల్లాడుతున్నారు. ఈ సేవలకు సంబంధించి బీఎస్‌ఎన్‌ఎల్ నెట్‌వర్క్ కేబుల్ వైర్లు నాలుగు చోట్ల తెగిపోవడంతో ఈ పరిస్థితి తలెత్తింది. రెండు రాష్ట్రాల 108కు సంబంధించిన కాల్‌సెంటర్ హైదరాబాద్‌లో ఉన్న సంగతి తెలిసిందే. ఈ సర్వీసుల కోసం బీఎస్‌ఎన్‌ఎల్ ద్వారా ఆరు ప్రత్యేక లైన్లు 24 గంటలపాటు కాల్స్ అందుకుంటాయి.

 

 అయితే దామెర పోచంపల్లి, మేడ్చల్, హైదరాబాద్‌లోని మరో రెండుచోట్ల ఈ ఫోన్ లైన్లకు సంబంధించిన వైర్లు తెగిపోయాయి. దీంతో సర్వీసులకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఇంతకుముందు ఇలా అన్ని లైన్లు నిలిచిపోయిన పరిస్థితి లేదని జీవీకే-ఈఎంఆర్‌ఐ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ బ్రహ్మానందరెడ్డి ‘సాక్షి’కి తెలిపా రు. 108 కింద రెండు రాష్ట్రాల్లో 752 అంబులెన్స్‌లు పనిచేస్తున్నాయి. రోజుకు 2,800 కాల్స్ అత్యవసర కేసులకు సంబంధించినవే ఉంటాయి. ఆకస్మికంగా సర్వీసులు నిలిచిపోవడంతో మారుమూల ప్రాంతాలు, గ్రామీణ ప్రాంతాలు, ప్రధాన రహదారులపై ప్రమాదాలకు గురైనవారు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఆదివారం అర్ధరాత్రి వరకు సేవలను పునరుద్ధరిస్తామని బ్రహ్మానందరెడ్డి తెలిపారు.

 

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top