1నుంచి ఇంటర్ తరగతులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఇంటర్మీడియెట్ తరగతులు జూన్ 1 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నెల 25 నుంచి మొదటి దశ ప్రవేశాలను చేపట్టిన ఇంటర్ బోర్డు నేడు వాటిని ఖరారు చేసి జూన్ 1 నుంచి తరగతులను ప్రారంభించేందుకు చర్యలు చేపట్టింది. ఈ మేరకు అన్ని ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్ జూనియర్ కాలేజీలకు అకడమిక్ క్యాలెండర్ను విడుదల చేసింది. 2016-17 విద్యా సంవత్సర ంలో చేపట్టిన కార్యక్రమాల సమగ్ర వివరాలను అందులో పొందుపరిచింది. జూన్ 2న కాలేజీల్లో తెలంగాణ రాష్ట్రావిర్భావ వేడుకలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది.
కాలేజీల్లో 223 పని దినాలు
జూనియర్ కాలేజీల్లో దాదాపుగా 223 పని దినాలు బోధన చేపట్టాలని ఇంటర్ బోర్డు నిర్ణయించింది. విద్యా సంవత్సరంలో మొత్తంగా 301 రోజులు ఉంటే అందులో 78 రోజులు సెలవులు తీసేయగా 223 పని దినాలు కాలేజీలు పని చేయాలని పేర్కొంది. ఇందుకు అనుగుణంగా కాలేజీలు చర్యలు చేపట్టాలని స్పష్టం చేసింది. అలాగే నెలవారీగా నిర్వహించాల్సిన పని దినాలను వెల్లడించింది. జూన్లో 25 రోజులు, జూలైలో 23, ఆగస్టులో 24, సెప్టెంబర్లో 22, అక్టోబర్లో 15, నవంబర్లో 24, డిసెంబర్లో 23, 2017 జనవరిలో 23, ఫిబ్రవరిలో 22, మార్చిలో 22 రోజులు పని చేయాలని బోర్డు పేర్కొంది.