రోడ్డు ప్రమాదంలో వీఆర్వో మృతి


శివంపేట(మెదక్): వేగంగా వెళ్తున్న లారీ ఎదురుగా వస్తున్న ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వీఆర్వో మృతిచెందాడు. ఈ సంఘటన మెదక్ జిల్లా శివంపేట మండలం చిన్న గొట్టిముక్కల సమీపంలో మంగళవారం జరిగింది. చేగుంట మండలం నార్సింగ్ గ్రామంలో వీఆర్వోగా పనిచేస్తున్న నాగేశ్వర్రావు(45) ఈ రోజు జిల్లా కేంద్రంలో జరగనున్న మీటింగ్‌కు హాజరయ్యేందుకు తన బైక్ పై బయలు దేరారు.


బైక్ చిన్నగొట్టిముక్కల సమీపంలోకి చేరుకోగానే.. నర్సాపూర్ నుంచి తూప్రాన్ వైపు వెళ్తున్న లారీ ఎదురుగా వచ్చి బైక్ ను ఢీకొట్టింది. దీంతో నాగేశ్వర్రావు తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమర్టం నిమిత్తం నర్సాపూర్ ఆస్పత్రికి తరలించారు.  కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

 




 

Read also in:
Back to Top