ఏప్రిల్ 6 నుంచి వీఐటీ ప్రవేశ పరీక్షలు


     దరఖాస్తులకు ఫిబ్రవరి 29 చివరి తేదీ

     వ్యవస్థాపక కులపతి జి.విశ్వనాథన్ వెల్లడి




సాక్షి, హైదరాబాద్: వెల్లూరు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(వీఐటీ) బీటెక్ ప్రవేశ పరీక్షలు ఈ ఏడాది ఏప్రిల్ 6 వ తేదీ నుంచి ప్రారంభమవుతున్నట్లు విశ్వవిద్యాలయ వ్యవస్థాపక కులపతి డాక్టర్ జి.విశ్వనాథన్ తెలిపారు. హైదరాబాద్‌లో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన ఈ పరీక్ష వివరాలను ప్రకటించారు. వెల్లూరు, చెన్నై క్యాంపస్‌లలో దాదాపు 4,500 బీటెక్ సీట్ల కోసం దేశవ్యాప్తంగా పరీక్ష నిర్వహిస్తున్నామని, దాదాపు 112 కేంద్రాల్లో ఏప్రిల్ 6-17 మధ్య తేదీల్లో వీటిని నిర్వహిస్తామని ఆయన వివరించారు.


ఏప్రిల్ 28న ఫలితాల వెల్లడి, మే 11వ తేదీ నుంచి కౌన్సెలింగ్, జూలై మొదటి వారంలో తరగతులు ప్రారంభమవుతాయని ఆయన తెలిపారు. దరఖాస్తులు సమర్పించేందుకు ఈ నెల 29వ తేదీ చివరి రోజని చెప్పారు. మరిన్ని వివరాలకు http://www. vit.ac.in/

వెబ్‌సైట్‌ను చూడవచ్చన్నారు.



ఆయా స్టేట్ బోర్డుల ఇంటర్మీడియెట్ పరీక్ష ఫలితాల్లో అగ్రస్థానంలో నిలిచిన వారికి తమ సంస్థలో వంద శాతం ట్యూషన్ ఫీజు రాయితీ కల్పిస్తున్నామని, వీఐటీ ప్రవేశపరీక్షలో ర్యాంకులు సాధించిన వారికి కూడా వారి ప్రతిభ ఆధారంగా 25 శాతం నుంచి 75 శాతం వరకూ రాయితీ అందిస్తామని ఆయన వివరించారు. తమ రాష్ట్రంలో వీఐటీ కేంద్రాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తమను ఆహ్వానించిందని డాక్టర్ జి.విశ్వనాథన్ తెలిపారు. అయితే ఈ అంశాన్ని పరిశీలిస్తున్నామని, త్వరలో ఒక నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పారు.




 

Read also in:
Back to Top