కేజీహెచ్ పై దిగివచ్చిన ప్రభుత్వం


విశాఖ మెడికల్: కేజీహెచ్‌లో గుండె శస్త్రచికిత్సల విభాగాన్ని ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్య(పీపీపీ) పద్ధతిన కేర్ ఆస్పత్రికి అప్పగించాలన్న నిర్ణయాన్ని ప్రభుత్వం ఎట్టకేలకూ వెనక్కుతీసుకొంది. ప్రభుత్వ రంగంలో పనిచేసే కార్డియోథొరాసిక్ సర్జన్లు అందుబాటులో లేకపోవడంతో పీపీపీ విధానంలో ప్రైవేటు ఆస్పత్రుల నుంచి సర్జన్లను రప్పించి  శస్త్రచికిత్సలు చేయించాలని ప్రభుత్వం భావించింది. ఈ విషయమై వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి, వైద్య విద్యా సంచాలకుల సూచనల మేరకు కేజీహెచ్‌లో గుండె శస్త్రచికిత్సలను కేర్ ఆస్పత్రి కార్డియోథొరాసిక్ సర్జన్ల పర్యవేక్షణలో నిర్వహించాలని తొలుత నిర్ణయించి ఒప్పందం కుదుర్చుకుంది.



దీనిపై ఈ నెల 16న సాక్షిలో ‘కేజీహెచ్ గుండె ప్రైవేటు పరం’ అనే శీర్షికన కథనం ప్రచురితమైంది. దీనికి స్పందించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, సీపీఎం, ఇతర పలు ప్రజాసంఘాలు, ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ  ఆందోళనలు చేపట్టాయి. దీంతో ప్రభుత్వం కేర్ ఆస్పత్రితో ఒప్పందాన్ని రద్దుచేసుకుంది.ఖాళీగా ఉన్న ఓపెన్ హార్ట్ సర్జన్ పోస్టును భర్తీచేసింది. దాదాపు ఏడాదిన్నర తరువాత ఓపెన్ హార్ట్ సర్జరీలకు మళ్లీ మంచిరోజులు వచ్చాయి.




 

Read also in:
Back to Top