టైగర్ మెమన్ను పీఓకేలో కలిశా
కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉస్మాన్ మజీద్
శ్రీనగర్: 1993 ముంబై బాంబు పేలుళ్ల అనంతరం అదే ఏడాది టైగర్ మెమన్ను పాక్ ఆక్రమిత కశ్మీర్(పీవోకే)లో రెండుమూడుసార్లు కలిశానని కాంగ్రెస్ ఎమ్మెల్యే, మాజీ మిలిటెంట్ ఉస్మాన్ మజీద్ శుక్రవారం తెలిపారు. పీవోకే రాజధాని ముజఫరాబాద్లోని తమ కార్యాలయానికి టైగర్ వచ్చేవాడన్నారు. బాబ్రీ మసీదు విధ్వంసం, తర్వాతి అల్లర్లకు ప్రతీకారంగానే తానీ మారణకాండకు పాల్పడినట్లు టైగర్ చెప్పాడన్నారు. పేలుళ్లకు ప్రణాళిక వేసి, ఆయుధాలు సమకూర్చి, కుట్ర అమలు చేసింది ఐఎస్ఐ అని తెలిపాడన్నారు.
యాకూబ్ మెమన్ లొంగిపోయాడనే వార్త వినగానే ఐఎస్ఐ ఎక్కడ తనను చంపేస్తుందోనని టైగర్ భయపడ్డాడని మజీద్ తెలిపారు. ఐఎస్ఐ నుంచి ఇదివరకటి గౌరవం లభించకపోవడం, అనుమానంతో చూడటంతో చంపేస్తారని భయపడి టైగర్ దుబాయ్కి పారిపోయాడని వివరించారు. అయితే టైగర్ కూడా లొంగిపోతాడేమోనని ఐఎస్ఐ అతన్ని పాక్కు రప్పించుకుందన్నారు.