ముక్కలుగా నరికి బోరుబావిలో వేశారు


పరిగి: రంగారెడ్డి జిల్లాలో ఆరు రోజుల క్రితం అదృశ్యమైన యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. ఈ సంఘటన శనివారం రంగారెడ్డి జిల్లా పరిగి మండలం చీగురాలపల్లి గ్రామంలో వెలుగు చూసింది. వివరాలు.. మండలంలోని నారాయణపూర్‌కు చెందిన ముక్తార్(22) పరిగిలో నెట్ సెంటర్ నిర్వహిస్తుంటాడు. కాగా, గత నెల 27న చీగురాలపల్లిలో తన స్నేహితుడు రాఘవేంద్రను కలిసేందుకు వెళ్తున్నానని చెప్పి వెళ్లిన ముక్తార్  తిరిగి కనిపించలేదు. దీంతో 30 వతేదీ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.


పోలీసులు స్నేహితులను అదుపులోకి తీసుకొని విచారించగా అసలు విషయం బయట పడింది. ముక్తార్‌ను హత్య చేసి ముక్కలు ముక్కలుగా నరికి చీగురాలపల్లి గ్రామంలోని ఒక బోరుబావిలో వేసినట్లు నిందితులు తెలిపారు. దీంతో పోలీసులు బోరు బావిలో నుంచి ముక్తార్ దేహాన్ని బయటకు తీసేందుకు ప్రయత్నిస్నున్నారు. కాగా, హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.




 

Read also in:
Back to Top