సమాచారాన్ని సరకుగా మార్చేస్తున్నారు

సమాచారాన్ని సరకుగా మార్చేస్తున్నారు - Sakshi


పీపుల్స్ డెమోక్రసీ సంపాదకులు ప్రకాష్ కారత్

విజయవాడ సెంట్రల్: కార్పొరేట్ గుప్పెట్లోకి మీడియా వెళ్లడంతో సమాచారాన్ని సరుకుగా మార్చేస్తున్నారని పీపుల్స్ డెమోక్రసీ సంపాదకులు ప్రకాష్ కారత్ అన్నారు. ‘ప్రజాశక్తి’ 35వ వార్షికోత్సవం సందర్భంగా శనివారం విజయవాడలో ‘వర్తమాన పరిస్థితులు - మీడియా’ అనే అంశంపై సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న కారత్ మాట్లాడుతూ... నరేంద్ర మోదీ ప్రధాని అయ్యాక నయా ఉదారవాద ఆర్థిక విధానాలు, హిందుత్వ అజెండా తీవ్రతరం అవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.



ప్రస్తుతం వ్యాపారం, రాజకీయం పెనవేసుకొని దుష్ట కూటమిగా మారిందన్నారు. నలభయ్యేళ్ల పత్రికా ప్రస్థానంలో తాను ఏనాడూ నయవంచన చేసుకోలేదని ‘సాక్షి’ ఎడిటోరియల్ డెరైక్టర్ కె.రామచంద్రమూర్తి చెప్పారు. ప్రత్యామ్నాయ పత్రికలను ప్రజలు ఎప్పుడూ ఆదరిస్తూనే ఉన్నారని తెలిపారు. మోదీభావజాలంతో పనిచేసే మీడియా ఎక్కువైందన్నారు. నేటి జర్నలిజంలో సత్యశోధన కష్టంగా మారిందని విశాలాంధ్ర పూర్వ సంపాదకులు రాఘవాచారి అన్నారు.



ప్రజాశక్తి సంపాదకులు పాటూరు రామయ్య అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో విశాలాంధ్ర, నవతెలంగాణ సంపాదకులు ఈడ్పుగంటి నాగేశ్వరరావు, ఎస్.వీరయ్య, ప్రజాశక్తి పూర్వ సంపాదకులు తెలకపల్లి రవి, ప్రజాశక్తి సాహితీ సంస్థ చైర్మన్ వి.కృష్ణయ్య ప్రసంగించారు.




 

Read also in:
Back to Top