విద్యార్థిని రక్షించిన ఫేస్బుక్
తిరువొత్తియూరు: అదృశ్యమైన ఓ బాలుడు ఫేస్బుక్ మూలంగా తల్లిదండ్రుల చెంతకు చేరాడు. పాత చాకలిపేట శ్రీనివాసపురం రెండో వీధికి చెందిన మహ్మద్ జిలాని రెండో కుమారుడు మహ్మద్ రియాజ్ ఆరో తరగతి చదువుతున్నాడు. 19వ తేదీ రాత్రి మహ్మద్ రియాజ్ ఇంటి వద్ద ఆడుకుంటూ కన్పించకుండా పోయాడు. పలు చోట్ల గాలించినా ఫలితం లేదు. చివరకు పోలీసుల్ని ఆశ్రయించాడు. మహ్మద్ జిలానీకి ఫోన్ చేసిన ఓ వ్యక్తి రియాజ్ను వెతికి పెడితే పారితోషికం ఇస్తావా? అంటూ ప్రశ్నించాడు.
ఇందుకు జిలానీ అంగీకరించి రూ.50 వేలు ఇచ్చేందుకు అంగీకరించాడు. ఆ మొత్తాన్ని ఇవ్వడానికి జెమిని వంతెన వద్దకు వెళ్లగా అక్కడ ఫోన్లో మాట్లాడిన వ్యక్తి జాడ లేదు. మళ్లీ ఈ వ్యవహారం పోలీసులకు చేరింది. ఇన్స్పెక్టర్ కాశియప్పన్ నేతృత్వంలో బృందం రంగంలోకి దిగింది. ఆ ఫోన్ కాల్ ఉసిలం పట్టి నుంచి వచ్చినట్టు గుర్తించారు. ఈ సమయంలో జిలానీ స్నేహితుడు ఖలీల్ తనే ఫేస్బుక్ , వాట్సాప్లలో రియాజ్ ఫొటో ఉంచి అదృశ్యం గురించి వివరించాడు. వాట్సాప్, ఫేస్బుక్లలో ఈ సమాచారం విస్తరించింది.
చివరకు రియాజ్ ఐనావరంలోని ఓ ఆశ్రమంలో ఉన్నట్టు తేలింది. ఆడుకుంటూ రియాజ్ చాలా దూరం వెళ్లడం, అక్కడున్న సెక్యూరిటీ ఒకరు విచారించి, చివరకు ఆశ్రమంలో చేర్పించినట్టు తేలింది. సోషల్ మీడియా పుణ్యమా తమ వాడు తమకు దక్కడంతో జిలానీ కుటుంబం ఆనందంలో మునిగింది.
సంబంధిత వార్తలు