కాలేజి బస్సు ఢీకొని బీటెక్ విద్యార్థిని మృతి

కాలేజి బస్సు ఢీకొని బీటెక్ విద్యార్థిని మృతి - Sakshi


హైదరాబాద్: నగరంలోని దుండిగల్ పీఎస్ పరిధిలోని బహదూర్‌పల్లి చౌరస్తా వద్ద మంగళవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో సీఎంఆర్ కాలేజీ విద్యార్థిని రాజేశ్వరి (18) మృతిచెందింది. తాను చదువుతున్న కాలేజీకి చెందిన బస్సే.. ఆమెను ఢీకొనడంతో మరణించడం అత్యంత విషాదకరం. చింతల్ గణేశ్ నగర్‌ ప్రాంతానికి చెందిన రాజేశ్వరి మైసమ్మగూడలోని మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ మొదటి సంవత్సరం చదువుతోంది. అదే కాలేజీలో రెండో సంవత్సరం చదువుతున్న తన సోదరుడితో కలసి స్కూటీ పై కాలేజీకి వెళ్తుండగా బహదూర్‌పల్లి చౌరస్తా వద్ద అదుపుతప్పి జారిపడ్డారు.


కిందపడ్డ విద్యార్థినిపై నుంచి వెనకాలే వస్తున్న అదే కాలేజీకి చెందిన బస్సు వెళ్లడంతో ఆమె అక్కడికక్కడే మృతిచెందింది. దీంతో కాలేజీ విద్యార్థులు ఘటనా స్థలానికి భారీగా చేరుకున్నారు. విద్యార్థిని మృతితో ఆ ప్రాంతమంతా విషాదం నెలకొంది. కాలేజీ యాజమాన్యం మంగళవారం కళాశాలకు సెలవు ప్రకటించింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. కాగా మృతురాలి కుటుంబ సభ్యులు కాలేజీ ఎదుట ఆందోళన నిర్వహించారు. కళాశాల అద్దాలు, ఫర్నీచర్ ధ్వంసం చేశారు. దీంతో కాలేజీ యాజమాన్యం విద్యార్థిని కుటుంబానికి రూ.7 లక్షల నష్టపరిహారం ఇచ్చేందుకు సమ్మతించింది.

 





 

Read also in:
Back to Top