రాష్ట్రానికి చంద్రబాబే శని

రాష్ట్రానికి చంద్రబాబే శని - Sakshi


- ప్రత్యేక హోదా సాధనలో విఫలం

- ప్యాకేజీ కాదు ప్రత్యేక హోదా కావాలి

- ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి

కురబలకోట :
రాష్ట్రానికి బాబు రూపంలో శని పట్టుకుందని రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి విమర్శించారు. ప్రత్యేక హోదా సాధన కోసం వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో అంగళ్లులో శనివారం జరిగిన బంద్‌లో పాల్గొన్న అనంతరం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడారు. ఎన్నికలకు ముందు నరేంద్ర మోదీ, చంద్రబాబు చెట్టాపట్టాల్ వేసుకుని ప్రత్యేక హోదా గురించి ప్రతి ఎన్నికల ప్రచా ర సభలో హోరెత్తించారన్నారు. కేంద్రంలో మోదీ, ఇక్కడ చంద్రబాబు అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర కావస్తున్నా ప్రత్యేక హోదా సాధనలో చంద్రబాబు ఘోరంగా విఫలమయ్యారన్నారు. ఇటీవల చంద్రబాబు హోదా కాదు ప్యాకేజీ అని కొత్తపల్లవి ఎత్తుకున్నారన్నారు.  



ఎన్నికలకు ముందు ప్రత్యేక హోదా సాధిస్తానని రాష్ట్రంలో ఉపాధి,ఉద్యోగావకాశాలు కల్పిస్తానని గొప్పలు చెప్పారన్నారు. అవన్నీ నేడు నీటి మీద రాతలుగా మారాయన్నారు. రాష్ర్టం అభివృద్ధి చెందాలంటే ప్రత్యే క ప్యాకేజీ కన్నా ప్రత్యేక హోదా అవసరమన్నారు. తన ప్రయోజనాల కోసం ప్రత్యేక హోదాపై పీఎం మోదీతో సీఎం బాబు గట్టిగా మాట్లాడలేక పోతున్నారన్నారు. రాష్ట్ర ప్రయోజనాలను ఢిల్లీలో తాకట్టు పెట్టడాన్ని జనం గమనిస్తున్నారన్నారు. తాడో పేడో తేల్చుకునే వరకు ప్రత్యేక హోదాపై వైఎస్సార్‌సీపీ పోరాడుతూనే ఉంటుందన్నారు. నాయకులు ఎవీ. గౌరీశంకర్ రెడ్డి, బైసాని చంధ్రశేఖర్ రెడ్డి, నులక మనోహర్ రెడ్డి, ఎంజి మల్లయ్య, పోరెడ్డి విశ్వారెడ్డి, బిజినేముల దస్తగిరి, కె.ఫజరుల్లా తదితరులు పాల్గొన్నారు.


Tags: 



 

Read also in:
Back to Top