జలపాతంలో పడి బీటెక్ విద్యార్థి మృత్యువాత


వాజేడు: స్నేహితులతో కలసి విహార యాత్రకు వెళ్లిన ఓ ఇంజినీరింగ్ విద్యార్థిని మృత్యువు కాటేసింది. ఖమ్మం జిల్లా వాజేడులో బుధవారం ఈ ఘటన జరిగింది. వరంగల్‌లోని ఎస్ఆర్ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్న కస్కర్ల నవీన్ (21) ముగ్గురు స్నేహితులతో కలిసి బొగట జలపాతం వద్దకు విహారానికి వెళ్లాడు.



సాయంత్రం 5గంటల సమయంలో స్నేహితులంతా కలసి జలపాతంలో స్నానాలు చేస్తుండగా నవీన్ కాలుజారి ప్రవాహంలో పడిపోయాడు. అతడిని రక్షించేందుకు స్నేహితులు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. సమాచారం అందుకున్న వాజేడు పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని నవీన్ మృతదేహాన్ని వెలికితీశారు. ప్రస్తుతం నవీన్ మిత్రులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.




 

Read also in:
Back to Top