ఏపీలోని 14 కాలేజీల్లో నిల్ అడ్మిషన్లు..


సాక్షి, హైదరాబాద్: ఏపీ ఎంసెట్ (ఇంజనీరింగ్) మూడో విడత కౌన్సెలింగ్ గురువారం పూర్తయింది. ఈ తుదివిడత కౌన్సెలింగ్‌లో 14 కాలేజీల్లో ఏ ఒక్కరూ చేరలేదు. రాష్ట్రంలో మొత్తం వందశాతం సీట్లు భర్తీ అయిన కాలేజీలు 47 ఉండగా, వందలోపు విద్యార్థులు చేరిన కాలేజీలు 107 ఉన్నాయి. తుది విడత కౌన్సెలింగ్‌లో కన్వీనర్ కోటాలో ఇంజనీరింగ్, ఫార్మసీ కలిపి ఇంకా 40,436 సీట్లు భర్తీ కాకుండా ఖాళీగా మిగిలిపోయాయి. ఈమేరకు రాష్ట్రంలో ఇంజనీరింగ్ కోర్సులో 36,642 సీట్లు, ఫార్మా డీ కోర్సులో మరో 3,794 సీట్లు ఖాళీ ఉన్నట్టు ఏపీ ఎంసెట్ కన్వీనర్ బి.ఉదయలక్ష్మి ఒక ప్రకటనలో తెలిపారు.



ఏపీ ఎంసెట్-2015 అడ్మిషన్లకు సంబంధించి తుదివిడత మంగళ, బుధవారాల్లో నిర్వహించిన కౌన్సెలింగ్ వివరాలను గురువారం వెబ్‌సైట్‌లో పెట్టారు. తుదివిడత కౌన్సెలింగ్‌లో సీట్లు పొందిన అభ్యర్థులు ఆగస్టు 4 లోపు ఆయా కాలేజీల్లో సర్టిఫికెట్లను అందజేసి చేరాలని కన్వీనర్ పేర్కొన్నారు.




 

Read also in:
Back to Top