పక్కలో ఉగ్ర బల్లెం

పక్కలో ఉగ్ర బల్లెం


‘ఉగ్ర’బల్లెం మన పక్కలోనే పొంచి ఉంది. ఆదమరచిన క్షణాల్లో అదను చూసి వెన్నుపోట్లు పొడుస్తోంది. మన దేశమ్మీద ‘ఉగ్ర’దాడులకు తెగబడుతున్నది ముష్కర మూకల ముఠాలే కాదు, పొరుగు సైన్యమే సరి‘హద్దు’మీరి మరీ మన గడ్డ మీదకు చొరబడుతోంది. మన సైనికులను అతి కిరాతకంగా హింసించి, తలలను తెగనరికి పొట్టన పెట్టుకుంటోంది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని పదే పదే ఉల్లంఘిస్తోంది. నియంత్రణ రేఖ వద్ద సరిహద్దుల పొడవునా అడపా దడపా తూటాల వర్షం కురిపిస్తూ నెత్తుటి కళ్లాపు చల్లుతోంది. శాంతి కోరుకునే మన దేశం సహనం, సంయమనం ప్రదర్శిస్తున్న కొద్దీ పొరుగు దేశం మరింతగా రెచ్చిపోతోంది. పొరుగు దేశం ఇదే పంథాను కొనసాగిస్తే ఏదో ఒకరోజు మన దేశానికీ సహనం నశించక తప్పదు. అదే జరిగితే యుద్ధం అనివార్యమవక తప్పదు.



ధూర్త దేశం... ‘ఉగ్ర’ సైన్యం

స్వాతంత్య్రం వచ్చిన తర్వాత అవిభక్త భారత భూభాగం నుంచి విడివడినప్పటి నుంచి పాకిస్థాన్‌ ధూర్త దేశంగానే మనుగడ సాగిస్తోంది. భారత్‌తో జరిగిన యుద్ధాలతో చావుదెబ్బలు తిన్న తర్వాత పాకిస్థాన్‌ సైన్యం ఉగ్రవాద సంస్థలకు తీసిపోని రీతిలో ఘాతుకాలకు తెగబడుతోంది. భారత్‌తో నేరుగా యుద్ధానికి తలపడితే ఓటమి తప్పదన్న ఎరుకతోనే దొంగచాటు దాడులకు పాల్పడుతోంది. పాక్‌ గూఢచర్య సంస్థ ఇంటర్‌ సర్వీస్‌ ఇంటెలిజెన్స్‌ (ఐఎస్‌ఐ) కూడా ఉగ్రవాద సంస్థలకు సర్వం సమకూరుస్తూ, వాటిని భారత్‌పై దాడులకు ప్రేరేపిస్తోంది. లష్కరే తోయిబా, లష్కరే ఒమర్, అల్‌ కాయిదా, జైషే మహమ్మద్, జమాత్‌ ఉద్‌ దావా వంటి ఉగ్రవాద సంస్థలకు ఆర్థికసాయం, ఆయుధ సాయం కల్పిస్తున్న పాక్‌ సైన్యం, ఐఎస్‌ఐ సంస్థలేనన్నది బహిరంగ రహస్యం. ఉగ్రవాద సంస్థలకు పాకిస్థాన్‌ సురక్షిత స్థావరంగా ఉంటోంది. పాక్‌లో తలదాచుకుంటూ దాదాపు 43 ఉగ్రవాద సంస్థలు క్రియాశీలంగా పనిచేస్తున్నట్లు ఒక అంచనా. అంతర్జాతీయ వేదికలపై ఉగ్రవాదానికి తాను వ్యతిరేకమని చెప్పుకొనే పాకిస్థాన్, ఆచరణలో మాత్రం ఎప్పటికప్పుడు ఉగ్రవాద సంస్థలకు అన్ని విధాలా అండదండలు అందిస్తూ వస్తోంది. ‘ఉగ్ర’ మూకలను భారత్‌ మీదకు మాత్రమే కాదు, అఫ్ఘానిస్థాన్, బంగ్లాదేశ్‌ వంటి దేశాల మీదకూ ఎగదోస్తోంది.



ప్రపంచవ్యాప్త పరిస్థితి

ఉగ్రవాదం ఏ ఒకటి రెండు దేశాలకు మాత్రమో పరిమితమైన సమస్య కాదు. ఇది ప్రపంచమంతటికీ ఆందోళన కలిగిస్తున్న బెడద. ఉగ్రవాదుల దాడుల కారణంగా అత్యధిక మరణాలు సంభవించిన మొదటి పది దేశాల్లో భారత్‌ కూడా ఉండటం ఆందోళనకరం. గ్లోబల్‌ టెర్రరిజం ఇండెక్స్‌ (జీటీఐ) గత ఏడాది 2015 నాటి గణాంకాలను వెల్లడించింది. వాటి ఆధారంగా ఉగ్రవాదుల దాడుల కారణంగా అత్యధిక మరణాలు సంభవించిన మొదటి పది దేశాల వివరాలు...



పాక్‌ సైన్యం పాపాల చిట్టా

భారత సైన్యంపై దారుణాలకు తెగబడటం పాకిస్థాన్‌ సైన్యానికీ, ఉగ్రవాద సంస్థలకు కొత్త కాదు. కార్గిల్‌ యుద్ధంలో పట్టుబడిన కెప్టెన్‌ సౌరభ్‌ కాలియాను పాక్‌ సైన్యం చిత్రహింసలు పెట్టి దారుణంగా చంపింది. ఛిద్రమైన అతడి మృతదేహాన్ని భారత్‌కు పంపింది.



కార్గిల్‌ యుద్ధం ముగిసిన మరుసటి ఏడాదే... 2000 ఫిబ్రవరిలో పాక్‌ ఉగ్రవాది ఇల్యాస్‌ కశ్మీరీ నేతృత్వంలోని ‘ఉగ్ర’మూక సరిహద్దులు దాటి వచ్చి నౌషేరా సెక్టార్‌లో భారత సైన్యంపై దాడికి తెగబడింది. ఆ దాడిలో ఉగ్రవాదులు ఏడుగురు సైనికులను చంపేయడమే కాక, మృతులలో ఒకరైన భావుసాహెబ్‌ మారుతి తలను నరికి పాకిస్థాన్‌కు తీసుకుపోయారు.



సరిహద్దుల వద్ద గస్తీ తిరుగుతున్న గూర్ఖా రైఫిల్స్‌ సిపాయి ఒకరు 2008లో దారి తప్పి కేల్‌ సెక్టార్‌ వద్ద పాకిస్థానీ బోర్డర్‌ యాక్షన్‌ టీమ్‌ (బీఏటీ) దళాల చేతికి చిక్కాడు. బీఏటీ దళాలు అతడిని తలనరికి దారుణంగా చంపాయి. కొద్దిరోజుల తర్వాత భారత భూభాగంలో ఆ సిపాయి తలలేని మొండెం మాత్రమే దొరికింది.



పాక్‌ బీఏటీ బలగాలు 2013 జనవరిలో భారత భూభాగంలోకి చొరబడి దాడికి తెగబడ్డాయి. ఆ దాడిలో బీఏటీ ముష్కరులు లాన్స్‌ నాయక్‌ హేమ్‌రాజ్‌ను చిత్రవధ చేయగా, మరో లాన్స్‌ నాయక్‌ సుధాకర్‌ సింగ్‌ తలను తెగనరికారు.



గత ఏడాది అక్టోబర్‌ 28న మచిల్‌ సెక్టార్‌ వద్ద నియంత్రణ రేఖకు చేరువలో పాక్‌ మీదుగా చొరబడ్డ ఉగ్రవాదులు భారత జవాను ఒకరిని దారుణంగా చంపి, అతడి మృతదేహాన్ని ఛిద్రం చేశారు.



అంతులేని అకృత్యాలు

పాకిస్థాన్‌ సైన్యం, గూఢచర్య సంస్థ ఐఎస్‌ఐ, వాటి కనుసన్నల్లో పనిచేసే ఉగ్రవాద మూకలు భారత భూభాగంలో అంతులేని అకృత్యాలను కొనసాగిస్తున్నాయి. నియంత్రణ రేఖ (ఎల్‌ఓసీ) వద్ద, అంతర్జాతీయ సరిహద్దుల వద్ద పాక్‌ సైన్యం మరీ బరితెగింపు చర్యలకు పాల్పడుతోంది. అదను చిక్కినప్పుడల్లా సరిహద్దులు దాటి చొరబాట్లకు తెగబడుతోంది. ఎలాంటి కవ్వింపు చర్యలు లేకపోయినా గత ఏడాది 228 సార్లు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. ఇటీవల మరింత బరితెగించి, సరిహద్దులు దాటి మరీ భారత భూభాగంలోకి చొరబడి జమ్మూ కశ్మీర్‌లోని పూంచ్‌ జిల్లా కృష్ణాఘాటి సెక్టార్‌ వద్ద గస్తీ తిరుగుతున్న ఇద్దరు జవాన్లను తలలు నరికి అత్యంత కిరాతకంగా చంపింది.



పాక్‌ ఘాతుకానికి బీఎస్‌ఎఫ్‌ హెడ్‌ కానిస్టేబుల్‌ ప్రేమ్‌ సాగర్, ఆర్మీ నాయబ్‌ సుబేదార్‌ పరమ్‌జీత్‌ సింగ్‌ బలైపోయారు. ఈ సంఘటనపై యావత్‌ భారతదేశం ఆగ్రహంతో రగిలిపోయింది. దేశం కోసం తన తండ్రి చేసిన త్యాగానికి బదులుగా యాభై మంది పాక్‌ సైనికుల తలలు తెగనరికి తేవాలని బీఎస్‌ఎఫ్‌ హెడ్‌కానిస్టేబుల్‌ ప్రేమ్‌సాగర్‌ కూతురు సరోజ్‌ ఆక్రోశంతో చేసిన వ్యాఖ్యలు దేశప్రజల మనసులను కలచివేశాయి. ఈ సంఘటన మరువక ముందే దక్షిణ కశ్మీర్‌ జిల్లాలో సెలవులో ఉన్న ఆర్మీ అధికారి లెఫ్టినెంట్‌ ఉమర్‌ ఫయాజ్‌ను పాక్‌ ఉగ్రవాదులు కిడ్నాప్‌ చేసి, దారుణంగా చంపారు.



మన దేశంలో ‘ఉగ్ర’ ఘాతుకాలు

ఉగ్రవాద దాడులు మనదేశంలో మూడు దశాబ్దాలకు పైగా జరుగుతూనే ఉన్నాయి. రక్షణ బలగాలు, ఇంటెలిజెన్స్‌ వర్గాలు ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా ఉగ్రవాదులు అదను చూసి పంజా విసురుతూనే ఉన్నారు. మొట్టమొదటి సారిగా మనదేశంలో 1984 ఆగస్టు 2న చెన్నైలోని మీనంబాకం విమానాశ్రయంలో ‘ఉగ్ర’దాడి జరిగింది. తమిళ ఈలం ఆర్మీ (టీఈఏ) పాల్పడిన ఆ దాడిలో 33 మంది బలయ్యారు. పాక్‌ ప్రోద్బలం వల్ల 1993 మార్చి 12న ముంబైలో దేశంలోనే అత్యంత విధ్వంసకరమైన పేలుళ్లు జరిగాయి. ఒకేరోజులో ముంబై నగరంలో జరిగిన ఆ వరుస పేలుళ్లలో 257 మంది మరణించగా, 717 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఆ సంఘటనపై ఇరవయ్యేళ్ల సుదీర్ఘ న్యాయ విచారణ తర్వాత 2013లో సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. మాఫియా డాన్‌ దావూద్‌ ఇబ్రహీం, అతడి అనుచరులు టైగర్‌ మెమన్, యాకూబ్‌ మెమన్‌ సహా పదిమంది నిందితులకు శిక్ష విధించింది.



 యాకూబ్‌ మెమన్‌కు ఉరిశిక్ష విధించగా, మిగిలిన పదిమందికి యావజ్జీవ శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. అయితే, దావూద్‌ ఇబ్రహీం, టైగర్‌ మెమన్‌లు ఇప్పటికీ పట్టుబడలేదు. వారిద్దరికీ పాకిస్థాన్‌ ఆశ్రయం కల్పిస్తోందనేది బహిరంగ రహస్యం. అదను దొరికనప్పుడల్లా అడపా దడపా దాడులకు తెగబడుతూ వస్తున్న ఉగ్రవాదులు 2008 నవంబర్‌ 26న మరోసారి ముంబైలో వరుస దాడులకు తెగబడ్డారు.



 పాకిస్థానీ ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబాకు చెందిన పదిమంది ఉగ్రవాదులు జలమార్గంలో ముంబైలోకి చొరబడి ఛత్రపతి శివాజీ టెర్మినస్, తాజ్‌ హోటల్, ఓబెరాయ్‌ ట్రైడెంట్‌ హోటల్, నారిమన్‌ హౌస్‌ వంటి కీలక ప్రదేశాలపై దాడులు జరిపారు. ఆ దాడుల్లో పలువురు విదేశీయులు సహా 166 మంది మరణించగా, 308 మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతులలో ఏడుగురు పోలీసులు కూడా ఉన్నారు. పోలీసుల ఎదురుదాడిలో తొమ్మిది మంది ఉగ్రవాదులు మరణించగా, అజ్మల్‌ కసబ్‌ అనే ఉగ్రవాది ఒక్కడే ప్రాణాలతో పట్టుబడ్డాడు. కోర్టు అతడికి ఉరిశిక్ష విధించింది.



మనదేశంలో ‘ఉగ్ర’సంస్థలు

గడచిన రెండు దశాబ్దాల కాలంలో భారత్‌లోను, దక్షిణాసియాలోని ఇరుగు పొరుగు దేశాల్లోను దాదాపు 180 ఉగ్రవాద సంస్థలు క్రియాశీలంగా ఉన్నాయి. వీటిలో కొన్ని సంస్థలు అంతర్జాతీయ స్థాయిలో తమ కార్యకలాపాలు సాగిస్తున్నాయి. భారత ప్రభుత్వం 38 ఉగ్రవాద సంస్థలపై నిషేధం విధించింది. వీటిలో కొన్ని సంస్థలపై అమెరికా, యూరోపియన్‌ యూనియన్‌ కూడా నిషేధం విధించాయి. ఈ సంస్థలు ఎక్కువగా పాకిస్థాన్, బంగ్లాదేశ్, భారత్, నేపాల్‌ వంటి దేశాలలో తలదాచుకుంటూ ధ్వంసరచన సాగిస్తున్నాయి. ఎన్ని అంతర్జాతీయ నిషేధాలు, ఆంక్షలు అమలులో ఉన్నా, ఉగ్రవాద సంస్థలు రకరకాల పేర్లతో ఎప్పటికప్పుడు భీభత్సకాండను సృష్టిస్తూనే ఉన్నాయి. అమాయకుల ఉసురు పోసుకుంటూనే ఉన్నాయి.



దక్షిణాదిలోనూ దాడులు

పొరుగుదేశం ప్రోద్బలంతో చెలరేగుతున్న ఉగ్రవాదులు దక్షిణాదిలోనూ అడపా తడపా దాడులు సాగిస్తూనే ఉన్నారు. హైదరాబాద్‌లోని మక్కా మసీదులో 2007 మే 18న ఉగ్రవాదులు అమర్చిన బాంబులు పేలడంతో నలుగురు పోలీసులు సహా 13 మంది మరణించారు. అదే ఏడాది ఆగస్టు 25న హైదరాబాద్‌లోని లుంబినీ పార్కులోను, గోకుల్‌ చాట్‌ సెంటర్‌లోను ఉగ్రవాదులు బాంబు పేలుళ్లకు పాల్పడ్డారు. ఆ పేలుళ్లలో 44 మంది మరణించగా, మరో 52 మంది తీవ్రంగా గాయపడ్డారు. బెంగళూరులో 2008 జూలై 25న జరిగిన బాంబు పేలుళ్లలో ఇద్దరు మరణించారు.



 హైదరాబాద్‌లోని దిల్‌సుఖ్‌నగర్‌ ప్రాంతంలో 2013 ఫిబ్రవరి 21న జరిగిన బాంబు పేలుళ్లలో 18 మంది మరణించగా, 131 మంది గాయపడ్డారు. ఈ సంఘటనకు సంబంధించి ఇండియన్‌ ముజాహిదీన్‌ సహ వ్యవస్థాపకుడు యాసీన్‌ భత్కల్, పాక్‌ జాతీయుడు జియా ఉర్‌ రెహమాన్, అసదుల్లా అక్తర్, తహసీన్‌ అక్తర్‌లకు ఉరిశిక్ష పడింది. చెన్నై సెంట్రల్‌ రైల్వే స్టేషన్‌లో 2014 మే 1న ఉగ్రవాదులు అమర్చిన బాంబు పేలడంతో ఒక మహిళ మరణించగా, 14 మంది గాయపడ్డారు. దేశవ్యాప్తంగా 2005 నుంచి చూసుకుంటే, ఇప్పటి వరకు జరిగిన ఉగ్రవాద దాడుల్లో 700 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా, మూడువేల మందికి పైగా ప్రజలు గాయాలపాలయ్యారు. గాయపడిన వారిలో కొందరు శాశ్వత వికలాంగులుగా మిగిలారు.



కీలక స్థావరాలపైనా ‘ఉగ్ర’నేత్రం

మనదేశంలోని కట్టుదిట్టమైన భద్రత గల కీలక స్థావరాలపైనా ఉగ్రవాదులు కన్నేశారు. ఢిల్లీలోని ఎర్రకోటపై 2000 డిసెంబర్‌ 22న ఆరుగురు లష్కరే తోయిబా ఉగ్రవాదులు దాడికి తెగబడ్డారు. ఆ దాడిలో ఇద్దరు సిపాయిలు, ఒక పౌరుడు మరణించగా, మరో 14 మంది గాయపడ్డారు. ఈ సంఘటనకు సంబంధించి ప్రధాన నిందితుడు మహ్మద్‌ ఆరిఫ్‌కు ఢిల్లీ హైకోర్టు ఉరిశిక్ష విధించింది. మిగిలిన ఆరుగురు నిందితులకు ఏడేళ్ల చొప్పున జైలు శిక్ష విధించింది. ఎర్రకోటపై దాడి చేసిన ఏడాదిలోగానే... పాక్‌ ఉగ్రవాదులు 2001 అక్టోబర్‌ 1న జమ్మూ కశ్మీర్‌ అసెంబ్లీపై దాడి చేశారు. అదే ఏడాది డిసెంబర్‌ 13న ఉభయ సభలు కొలువు తీరిన వేళ ఏకంగా పార్లమెంటు భవనంపైన దాడికి పాల్పడి దేశ సార్వభౌమత్వానికే సవాలు విసిరారు. జమ్మూ కశ్మీర్‌ అసెంబ్లీపై జరిగిన దాడిలో 38 మంది మరణించగా, పార్లమెంటుపై జరిగిన దాడిలో ఆరుగురు పోలీసులు, ఐదుగురు ఉగ్రవాదులు మరణించారు. మరో ముగ్గురు పౌరులు మరణించారు. పార్లమెంటుపై దాడికి సంబంధించి జైషే మహ్మద్‌ ఉగ్రవాది అఫ్జల్‌ గురుకు ఉరిశిక్ష పడింది.



ప్రపంచవ్యాప్త పరిస్థితి

ఉగ్రవాదం ఏ ఒకటి రెండు దేశాలకు మాత్రమో పరిమితమైన సమస్య కాదు. ఇది ప్రపంచమంతటికీ ఆందోళన కలిగిస్తున్న బెడద. ఉగ్రవాదుల దాడుల కారణంగా అత్యధిక మరణాలు సంభవించిన మొదటి పది దేశాల్లో భారత్‌ కూడా ఉండటం ఆందోళనకరం. గ్లోబల్‌ టెర్రరిజం ఇండెక్స్‌ (జీటీఐ) గత ఏడాది 2015 నాటి గణాంకాలను వెల్లడించింది. వాటి ఆధారంగా ఉగ్రవాదుల దాడుల కారణంగా అత్యధిక మరణాలు సంభవించిన మొదటి పది దేశాల వివరాలు...



అత్యంత ప్రమాదకర ‘ఉగ్ర’సంస్థలు

అత్యంత ప్రమాదకరమైన ఉగ్రవాద సంస్థల్లో ఐసిస్‌ మొదటి స్థానంలో నిలుస్తోంది. జీటీఐ లెక్కల ప్రకారం 2015లో ఐసిస్‌ ఉగ్రవాదులు 6,141 మందిని పొట్టన పెట్టుకున్నారు. బోకోహరామ్‌ ఉగ్రవాదుల చేతిలో 5,478 మంది, అఫ్ఘాన్‌ తాలిబన్ల చేతిలో 4,502 మంది, ‘అల్‌కాయిదా’ చేతిలో 1,620 మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు.

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top