చిన్నవాణ్ని పెళ్లాడితే... సమస్యలు వస్తాయా?

చిన్నవాణ్ని పెళ్లాడితే... సమస్యలు వస్తాయా?


నా వయసు 24. ఏడాదిన్నర క్రితం పెళ్లయ్యింది. ఈ మధ్య నెలసరి తప్పడంతో డాక్టర్ దగ్గరకు వెళ్లాను. గర్భం దాల్చానని, మూడో నెల అని చెప్పారు డాక్టర్. కానీ స్కాన్ చేసిన తర్వాత ముత్యాల గర్భం, వెంటనే తీయించేసుకుంటే మంచిది అన్నారు. బిడ్డను కనాలని ఎంతో ఆశపడుతున్న నాకు ఆ మాట చాలా బాధ కలిగించింది. ముత్యాలగర్భం అసలెందుకు వస్తుంది? అది అంత ప్రమాదకరమా? తీయించేసుకోవడం తప్ప మరో మార్గం లేదా?

- పి.రాగిణి, తూప్రాన్



పిండం గర్భాశయంలో పెరగకుండా చిన్న చిన్న ముత్యాల వంటి నీటి బుడగలుగా మాయ పెరుగుతూ పోవడాన్ని ముత్యాల గర్భం లేదా మోలార్ ప్రెగ్నెన్సీ అంటారు. కొందరి శరీర తత్వాన్ని బట్టి ఈ గర్భం చాలా త్వరగా పెరిగిపోతూ... గర్భాశయం బయటికి, ఇతర అవయవాలకి కూడా పాకడం జరుగుతుంది. దాన్ని అలానే వదిలేస్తే కడుపులో విపరీతమైన నొప్పి రావడంతో పాటు బ్లీడింగ్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. ఇందులో బిడ్డ పెరిగే అవకాశం లేదు కాబట్టి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా దీన్ని తీయించేసుకోవడం మంచిది. కొంతమందిలో అయితే దీన్ని ఒక్కసారే తీసేయడం వీలు కాదు. మొదట కొంత తీసి, తర్వాత మరోసారి తీయాల్సి వస్తుంది. మరికొంతమందికి అయితే తీసేసిన తర్వాత మళ్లీ గర్భాశయం లోపల పెరిగే అవకాశం ఉంటుంది. అందుకని ముత్యాల గర్భం తీసేసిన తర్వాత కనీసం ఆరు నెలల పాటు డాక్టర్ పర్యవేక్షణలో ఉండి... స్కానింగ్, బీహెచ్‌సీజీ బ్లడ్ టెస్ట్ వంటి పరీక్షలన్నీ క్రమం తప్పకుండా చేయించుకుంటూ చికిత్స తీసుకోవాలి. అలాగే ముత్యాల గర్భం పెరిగేటప్పుడు గర్భాశయం బాగా సాగి మెత్తగా అయిపోతుంది. దాంతో తీసేటప్పుడు అధిక రక్తస్రావం కావడం, గర్భాశయానికి చిల్లు పడటం వంటి సమస్యలు తలెత్తవచ్చు. అంతే కాదు, ఇరవై ఎనిమిది శాతం మందిలో ఈ గర్భం ఒక్కసారి వస్తే, మరోసారి వచ్చే అవకాశాలూ ఉన్నాయి. కాబట్టి ముత్యాల గర్భం అని తెలియగానే ముందు నుంచే డాక్టర్ పర్యవేక్షణలో ఉండి, స్కానింగ్ ద్వారా గర్భం ఎలా పెరుగుతుందో నిర్ధారించుకోవడం మంచిది. 0.5 శాతం మందిలో కొరియోపార్శినోమా అనే క్యాన్సర్ వచ్చే అవకాశాలూ ఉంటాయి. అందుకే ఓసారి ముత్యాల గర్భం వచ్చిన తర్వాత మళ్లీ సంవత్సరం వరకు గర్భం రాకుండా చూసుకోవడం మంచిది.ముత్యాల గర్భం రావడానికి కారణాలు పూర్తిగా నిర్ధారణ కాలేదు. పిండం ఏర్పడే సమయంలో నిర్వీర్యమైన అండంలో శుక్ర కణం ఫలదీకరణ చెందడం వల్ల... లేదా అండంలో రెండు శుక్రకణాలు ఫలదీకరణ చెందడం వల్ల ఇది రావొచ్చని అంచనా. అలాగే జన్యుపరమైన లోపాల వల్ల కూడా పిండం పెరగకుండా సంపూర్ణ ముత్యాల గర్భం ఏర్పడుతుంది. కొందరిలో బిడ్డతో పాటు మాయ కూడా ముత్యాల లాగా పెరుగుతుంది. కానీ బిడ్డ సరిగ్గా ఎదగకపోవడం, అవయవ లోపాలతో ఉండటం వంటివి జరుగుతాయి. దీన్ని అసంపూర్ణ ముత్యాల గర్భం అంటారు. మన దేశంలో ప్రతి నాలుగొందల మందిలో ఒకరికి ముత్యాల గర్భం రావొచ్చు. టీనేజీలో గర్భం దాల్చిన వారిలో, నలభయ్యేళ్లు పైబడిన వారిలో ఎక్కువగా రావొచ్చు. పర్యావరణ మార్పులు, ఏబీ బ్లడ్ గ్రూప్, మాంస కృత్తుల లోపం, విటమిన్ ఎ లోపం, వ్యాధి నిరోధక వ్యవస్థలో మార్పుల వల్ల కూడా ముత్యాల గర్భం ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయి.



 నా వయసు 22. మేనమావను పెళ్లి చేసుకున్నాను. పెళ్లయిన ఏడు నెలలకే గర్భం దాల్చాను. ఎనిమిదో నెల వచ్చాక హఠాత్తుగా నొప్పులు వస్తే ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఏదో ఇంజెక్షన్ చేసి... హైబీపీ వచ్చిందని, పరిస్థితి ప్రమాదకరమని చెప్పారు. అంతలోనే బిడ్డ కడుపులోనే చనిపోయిందని చెప్పి ఆపరేషన్ చేసి తీసేశారు. ఇలా ఎందుకు జరిగింది అంటే బీపీ వల్ల అంటున్నారు. అదేదో గుర్రపు వాతమని కూడా చెబుతున్నారు. నాకేమీ అర్థం కావడం లేదు. అసలు నాకేమయ్యిందో మీరేమైనా అంచనా వేయగలరా? బీపీ వల్లే బిడ్డ  చనిపోతుందా

- శ్రీదేవి, రంపచోడవరం



కొంతమందికి గర్భం దాల్చిన తర్వాత... వారి శరీర తత్వాన్ని బట్టి, బరువును బట్టి, హార్మోన్లలో మార్పులు, జన్యుపరమైన కారణాలు, రక్తనాళాలు సంకోచించడం వంటి పలు కారణాల వల్ల బీపీ పెరుగుతుంది. బీపీ ఎక్కువగా పెరిగేసరికి రక్తనాళాలు ఇంకా సంకోచించి... కిడ్నీ, మెదడు వంటి కీలకమైన అవయవాలకు రక్త ప్రసరణ తగ్గి, ఆ అవయవాలు దెబ్బతింటాయి. దానివల్ల యూరిన్‌లో ఆల్బుమిన్ పోవడం, ఫిట్స్ రావడం, ఒళ్లంతా నీరు చేరడం, కోమాలోకి వెళ్లిపోవడం వంటివి జరగవచ్చు. దీనినే ఎక్లాంప్సియా లేక గుర్రపువాతం అంటారు. బీపీ పెరిగేకొద్దీ కొందరిలో కిడ్నీలు దెబ్బతినడం, కళ్లు కనిపించకపోవడం, లివర్ పనితీరు దెబ్బతినడం, ప్లేట్‌లెట్స్ తగ్గిపోయి రక్తస్రావం జరగడం వంటి సమస్యలు తలెత్తి ప్రాణాపాయ స్థితి కూడా ఏర్పడ వచ్చు. రక్తనాళాలు సంకోచించడం వల్ల గర్భాశయంలోని శిశువుకి రక్త ప్రసరణ తగ్గిపోయి బిడ్డ బరువు పెరగకపోవడం, ఉమ్మనీరు తగ్గిపోవడం, బిడ్డ కడుపులోనే చనిపోవడం వంటివి జరగవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో గర్భంలోని శిశువును బయటకు తీస్తేనే గానీ తల్లి పరిస్థితి మెరుగు పడదు. మీరు చెప్పినదాన్ని బట్టి చూస్తే మీ విషయంలో ఇదే జరిగింది. రక్తనాళాలు సంకోచించడం వల్ల గర్భాశయంలోని శిశువుకి రక్త ప్రసరణ తగ్గిపోయి బిడ్డ బరువు పెరగకపోవడం, ఉమ్మనీరు తగ్గిపోవడం, బిడ్డ కడుపులోనే చనిపోవడం వంటివి జరగవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో గర్భంలోని శిశువును బయటకు తీస్తేనే గానీ తల్లి పరిస్థితి మెరుగు పడదు.



నా వయసు 31. మావారికి 32. పెళై్ల ఆరేళ్లు అయ్యింది. ఇంతవరకూ పిల్లలు పుట్టలేదు. నాకు ఎప్పుడూ పెరుగులాంటి చిక్కటి వైట్ డిశ్చార్జి అవుతూనే ఉంటుంది. కలయిక సమయంలో కూడా విపరీతమైన కడుపునొప్పి వస్తూ ఉంటుంది. ఎన్ని మందులు వాడినా ఫలితం లేదు. నాకేదైనా సమస్య ఉందేమో, ఇక పిల్లలు పుట్టరేమో అనిపిస్తోంది. మరెవరినైనా పెళ్లి చేసుకొమ్మంటే మావారు వినడం లేదు. పిల్లలు లేకపోయినా నాతోనే ఉంటానంటున్నారు. ఆయన్ని తండ్రిని చేసే మార్గం ఉంటే

- ఆర్.దేవిక, వెల్తూరు



పెరుగులాంటి చిక్కని వైట్ డిశ్చార్జి అంటే చాలావరకు అది ఫంగల్ ఇన్ఫెక్షనే అయి ఉండవచ్చు. ఇన్‌ఫెక్షన్ ఉన్నప్పుడు కలయిక సమయంలో నొప్పి ఉండొచ్చు. మందులు వాడినా తగ్గట్లేదు అంటున్నారు కాబట్టి... మీరిద్దరూ కూడా నెల రోజుల పాటు యాంటి ఫంగల్ మందులు వాడుతూ, కలయికకు దూరంగా ఉండండి. తెలుపు అవ్వడం తగ్గాక కలవండి. మీరు స్పెక్యులమ్ ఎగ్జామ్, వెజైనల్ స్వాబ్ కల్చర్, షుగర్ టెస్ట్, సీబీపీ వంటి పరీక్షలు చేయించుకుంటే... ఇన్ఫెక్షన్ ఎటువంటిదో తెలుస్తుంది. దాన్ని బట్టి తగిన మందులు వాడవచ్చు. కొందరిలో రక్తహీనత, మధుమేహం వంటి వాటి వల్ల కూడా మాటిమాటికీ ఇన్ఫెక్షన్ వస్తూ ఉంటుంది. మీకు అవేమైనా ఉంటే వాటికి కూడా చికిత్స తీసుకోండి. కారణం తెలియకుండా ఎక్కువగా యాంటీ బయొటిక్స్ వాడటం వల్ల యోనిలో ఉండే ల్యాక్టోబాసిలీ అనే మంచి బ్యాక్టీరియా నశిస్తుంది. రోగాలను తెచ్చే క్రిములు, బ్యాక్టీరియా, ఫంగస్‌ను అరికట్టే లక్షణాలు దీనికి ఉంటాయి. అది నాశనం కావడం వల్ల ఫంగల్ ఇన్ఫెక్షన్లు రావొచ్చు. చికిత్సలో భాగంగా ల్యాక్టోబాసిలీ ఉండే మందులు, క్రీములు, వెజైనల్ వాష్‌ను వాడాల్సి ఉంటుంది. మీవారికి కూడా షుగర్ టెస్టులవీ చేయించండి. ఆయనకు షుగర్ ఉన్నా కూడా ఒకరి నుంచి ఒకరికి మాటి మాటికీ ఇన్ఫెక్షన్లు సోకుతూ ఉంటాయి. ఓసారి పూర్తిగా చికిత్స తీసుకున్న తర్వాత, పిల్లల గురించి మీకే సమస్యలు ఉన్నాయో వాటి విషయమై డాక్టర్‌ను సంప్రదించండి. అవసరమైన పరీక్షలు చేసి, తర్వాత ఏం చేయాలో చెబుతారు. అసలు డాక్టర్‌నే కలవకుండా, ఏ రకమైన చికిత్సా తీసుకోకుండా... మీకు మీరే పిల్లలు పుట్టరని నిర్ధారించేసుకుంటే ఎలా?!



నా వయసు 23. నేనో అబ్బాయిని ప్రేమించాను. కానీ తర్వాత తెలిసింది తను నాకంటే ఏడాదిన్నర చిన్నవాడని. దాంతో నేను దూరమైపోవాలనుకున్నాను. కానీ తనకేమీ అభ్యంతరం లేదని, నాతోనే కలిసి బతకాలనుకుంటున్నానని ఆ అబ్బాయి అంటున్నాడు. అయితే విషయం తెలిసి మా ఇంట్లోవాళ్లు, వాళ్ల ఇంట్లోవాళ్లు కూడా కోప్పడ్డారు. మేం మాత్రం ఒకరినొకరు కావాలనుకుంటున్నాం. జీవితంలో సెటిలయ్యాక ఒక్కటవ్వాలనుకుంటున్నాం. మేం పెళ్లి చేసుకోవచ్చా? లేక మావాళ్లు అన్నట్టు ఏవైనా సమస్యలు వస్తాయా?

ఓ సోదరి, ధవళేశ్వరం



 మీ ఇద్దరి మనసులూ కలిసి, ఒకరికొకరు నచ్చిన తర్వాత... వయసు పెద్ద సమస్య కాదు. అంతకంటే చిన్నవాళ్లను చేసుకున్న వాళ్లు కూడా ఉన్నారు. కాబట్టి తను ఏడాదిన్నర చిన్నవాడని ఆలోచించాల్సిన అవసరం లేదు. జీవితంలో సెటిలయ్యాక పెళ్లి అంటున్నారు కాబట్టి ఇంకా సమయం ఉంది కదా! ఈ లోపల పరిస్థితులు ఎలా ఉంటాయో చూడండి. మీ పెద్దవాళ్లను మెల్లగా ఒప్పించడానికి ప్రయత్నం చేయండి. అంతవరకు మీ ఆలోచనల్లో ఏ మార్పూ రాకుండా ఉంటే, మీ ప్రేమ అప్పటి కూడా ఇంతే దృఢంగా ఉంటే... నిరభ్యంతరంగా పెళ్లి చేసుకోవచ్చు. ఏడాదిన్నర చిన్నవాణ్ని చేసుకున్నంత మాత్రాన శారీరకంగా, ఆరోగ్యపరంగా ఎటువంటి సమస్యలూ రావు. కాబట్టి హ్యాపీగా పెళ్లి చేసుకోండి. ఆల్ ద బెస్ట్.



డా వేనాటి శోభ

లీలా హాస్పిటల్

మోతీనగర్, హైదరాబాద్

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top