ఏసీ గొడుగేసి..!

ఏసీ గొడుగేసి..! - Sakshi


ప్రస్తుతం మార్కెట్లో ఎన్నో రకాల గొడుగులు దొరుకుతున్నాయి. వివిధ రకాల డిజైన్లు, రంగుల్లో అందుబాటులోకి వచ్చాయి. వాటిని వర్షాకాలంలోనే కాక వేసవిలోనూ ఉపయోగిస్తుంటాం. వర్షాకాలంలో అయితే తడవకుండా ఉండేందుకు... వేసవిలో అయితే ఎండ తగలకుండా ఉపయోగిస్తాం. ఎండ తగలదు కానీ, ఉక్కపోతను మాత్రం తగ్గించలేం కదా. అలాంటి సమస్యకు ఇప్పుడు పరిష్కారం దొరికేసింది. ఎలా అంటారా? సౌదీలోని మక్కాకి చెందిన మహమ్మద్‌ హమీద్‌ అనే ఇంజనీర్‌ ఏసీ గొడుగును తయారు చేశాడు. అసలు ఇలాంటి గొడుగు రూపకల్పనకు కారణం మక్కాలోని వేడి వాతావరణం.



అక్కడికి వచ్చే భక్తులు వేడి తీవ్రతను తట్టుకోలేకపోవడం చూసి, ఈ గొడుగును తయారు చేశాడు. ఇది సౌరశక్తి లేదా రీచార్జిబుల్‌ బ్యాటరీతో పని చేస్తుంది. ఇందులో రెండు ఫ్యాన్లు, చల్లటి గాలి కోసం నీళ్లను స్ప్రింకిల్‌ చేయడానికి పంప్స్‌ను అమర్చాడు. బరువు కూడా కేవలం 610 గ్రాములే. ఈ ఏడాది హజ్‌ సీజన్‌ మొదలయ్యే లోపే మార్కెట్‌లోకి రానున్నాయనీ, ధర కూడా సాధారణంగానే ఉంటుందని చెబుతున్నాడు హమీద్‌. లగ్జరీకి మరో మెట్టుగా ఈ గొడుగును చెప్పుకోవచ్చు.

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top