అవేమీ పట్టించుకోని సమంత!
వరుస పెట్టి హిట్లు కొడుతూ సమంత టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రేంజ్కి ఎదిగిపోయింది. మళ్లీ ఒక్కసారిగా జోరు తగ్గడంపై పరిశ్రమలో ఈ బ్యూటీపై రకరకాల వార్తలు హల్చల్ చేస్తున్నాయి. అయితే సమ్ము మాత్రం వీటిని ఏ మాత్రం పట్టించుకోకుండా కోలీవుడ్పై ఫుల్గా దృష్టిపెట్టింది. పరిశ్రమలో నాలుగు కాలాలు నిలబడే విషయంలో ఒకప్పటి తారల పరిస్థితికీ, నేటి హీరోయిన్ల స్థితికి చాలా వ్యత్యాసం ఉంది. నాటి తారలు ఏళ్లకు ఏళ్లు, ఒక్కొక్కరు దశాబ్ధం పాటు కూడా వెండి తెరను ఏలారు. ఇప్పటి హీరోయిన్లకు స్టార్ స్టేటస్ కేవలం మూడునాళ్ళ ముచ్చటగానే మిగిలిపోతోంది. ఫిల్మ్ కెరీర్ విషయంలో హీరోలు చేసినంత లాంగ్ రన్ హీరోయిన్లు చేయలేకపోతున్నారు. త్రిష, నయనతార, అనుష్క వంటి వారిని వదిలివేస్తే, మిగిలిన వారి పరిస్థితి రెండేళ్లు, మూడేళ్లకు మించడంలేదు.
ఇప్పుడు సమంత పరిస్థితి కూడా అలానే ఉంది. వరుస పెట్టి సినిమాలు చేసిన ఈ ముద్దుగుమ్మ జోరు సడన్గా తగ్గింది. 'ఏం మాయ చేసావే'లో ఈ బ్యూటీ టైటిల్కి తగట్టుగానే కుర్రాళ్ళు అందరినీ ఏదో మాయ చేసేసింది. ఈ చిత్రం విజయం తరువాత సమ్ము ఇక వెను తిరిగింది లేదు. వరుస పెట్టి హిట్లు కొట్టింది. సమంత ఉంటే చాలు హిట్ అని పేరు కూడా తెచ్చుకుంది. కాల్షీట్లు ఖాళీ లేక కొన్ని ముఖ్యమైన మూవీలను సైతం వదిలేసుకుంది. అయితే ఇటీవల టాలీవుడ్లో సమ్ము జోరు కాస్త తగ్గినట్లుగా కనిపిస్తోంది. ప్రస్తుతం త్రివిక్రమ్, బన్నీ కాంబినేషన్లో రూపొందుతున్న మూవీలో మాత్రమే ఈ బొమ్మ హీరోయిన్గా నటిస్తున్నట్లు తెలుస్తోంది. దీని తరువాత సమంత తెలుగులో ఏ సినిమా ఒప్పుకున్నట్లుగా కనిపించడంలేదు.
అయితే సమంత కోలీవుడ్లో మాత్రం ఊపులోనే ఉంది. ఇప్పటికే అక్కడ మూడు చిత్రాలలో నటించడానికి అంగీకరించింది. దాంతో సమ్ము టాలీవుడ్ని లైట్ తీసుకుందని ఫిల్మ్ నగర్ సమాచారం.
**