మహారాష్ట్రపై సంచలన ప్రకటన!
మహారాష్ట్ర రాజకీయాలు గంటకో మలుపు తిరుగుతున్నాయి. ప్రభుత్వ ఏర్పాటుపై ఇంకా సందిగ్ధత కొనసాగుతూనే ఉంది. ప్రభుత్వ ఏర్పాటు విషయంలో శివసేన మద్దతు తీసుకోవాలో, ఎన్సీపీ మద్దతు తీసుకోవాలో బీజేపీ తేల్చుకోలేకపోతోంది. ఈ పరిస్థితులలో శివసేనతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేద్దామని కాంగ్రెస్ పార్టీ ఓ ప్రతిపాదన చేసిందని ఎన్సీపీ నేత అజిత్ పవార్ సంచలన ప్రకటన చేశారు.
శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్ సర్కార్ ఏర్పాటుకు కలిసి రావాలంటూ ఓ కాంగ్రెస్ నేత తమ దగ్గరకు వచ్చి ప్రతిపాదించారని అజిత్ పవార్ చెప్పారు. అయితే తాము ఈ ప్రతిపాదనను తిరస్కరించినట్లు ఆయన తెలిపారు. తాము బిజెపి ప్రభుత్వంలో చేరే ప్రసక్తి లేదని, కావాలంటే బిజెపికి బయటి నుంచే మద్దతు ఇస్తామని పవార్ చెబుతున్నారు.
మరాఠీ నేత, కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ఇల్లు వేదికగా మహారాష్ట్ర మంత్రాంగం జరుగుతోంది. ఎవరితో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయాలనే అంశంపై బీజేపీ మంతనాలు జరుపుతోంది. ఉద్దవ్ ఠాక్రే తీరుపై అసంతృప్తితో రగిలిపోతున్న కొందరు బీజేపీ నేతలు ఇతర అవకాశాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని కోరుతున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో మహాడైలామాకు తెరదించేందుకు పార్టీ అధ్యక్షుడు అమిత్షా ఢిల్లీలో కేంద్రమంత్రి నితిన్ గడ్కరీని కలిసారు. మరోవైపు రాజ్నాధ్సింగ్ ఈ సాయంత్రం ముంబై వెళుతున్నారు. ఈ రాత్రికి ఒక నిర్ణయం వెలువడే అవకాశం ఉంది.
**