ప్రపంచంలోనే ఓ అద్వితీయ ఘట్టం!
ఎడిన్బర్గ్: ప్రజాస్వామ్య విలువలకు బ్రిటన్ పట్టం కడుతోంది. ప్రజల అభిప్రాయాలకు విలువ ఇస్తూ ఒక దేశంలో రెఫరెండం(ప్రజాభిప్రాయం) నిర్వహించడం సామాన్యమైన విషయం ఏమీ కాదు. బ్రిటన్తో 307 ఏళ్ల అనుబంధాన్ని కొనసాగించడమా? లేక స్వతంత్ర దేశంగా తొలి అడుగులు వేయడమా? అని స్కాట్లాండ్ ప్రజలు ఈ నెల 18న అంటే రేపు గురువారం నిర్ణయించుకోనున్నారు. యూరప్, ముఖ్యంగా బ్రిటన్ ఆర్థిక వ్యవస్థ దశ, దిశ ఈ రిఫరెండంతో తేలనుంది. స్వాతంత్య్ర అనుకూల, వ్యతిరేక వర్గాలు ముమ్మరంగా ప్రచారం చేశాయి. ప్రజాభిప్రాయ సేకరణ ప్రచారం చివరి రోజు బుధవారం స్కాట్లాండ్ ఫస్ట్ మంత్రి అలెక్స్ సాల్మండ్ను తూర్పు కిల్బ్రైడ్లోని ఓ షాపింగ్ సెంటర్ వద్దకు వచ్చిన అభిమానులు, మీడియా ప్రతినిధులు చుట్టుముట్టారు. ఫలితం రేపు తేలిపోతుంది.
కలిసుందామనే బ్రిటన్ నేతల భావోద్వేగ అభ్యర్థన ఫలిస్తుందా? లేక కలి‘విడి’గా ఉందామనే స్కాట్లాండ్ వాసుల ఆలోచన గెలుస్తుందా? అని యావత్ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఈ రెఫరెండంలో ‘స్కాట్లాండ్ స్వతంత్ర దేశంగా ఉండాలా?’ అన్న ఏకైక ప్రశ్నకు ‘ఉండాలి(ఎస్)’ లేదా ‘వద్దు(నో)’ అంటూ దాదాపు 43 లక్షల మంది స్కాట్లాండ్ ప్రజలు ఏకవాక్య సమాధానం ఇవ్వాలి. అందుకే ఈ రెఫరెండం ప్రచారం కూడా ‘ఎస్’ గ్రూప్, ‘నో’ గ్రూప్లుగా జరిగింది. ఎస్, నో బ్యానర్లు పట్టుకొని ప్రచారం నిర్వహించారు. 16 ఏళ్లు పైబడిన స్కాట్లాండ్ పౌరులు ఈ రెఫరెండంలో పాల్గొనేందుకు అర్హులు.
మొదట్లో స్కాట్లాండ్ స్వాతంత్య్రానికి అంతగా మద్దతు లభించలేదు. దాంతో ఈ రెఫరెండాన్ని పెద్దగా ఎవరూ పట్టించుకోలేదు. కానీ క్రమంగా స్వాతంత్య్రం వైపు స్కాట్లాండ్ ప్రజలు మొగ్గు చూపడం మొదలుపెట్టారు. ఒపీనియన్ పోల్స్లోనూ అనుకూల, వ్యతిరేక వర్గాల మధ్య ఓట్ల తేడా చాలా తక్కువగా ఉండటంతో ప్రజాభిప్రాయం ఏవిధంగా ఉంటుందన్నదానిపై ఉత్కంఠ నెలకొంది. ఏది ఏమైనా స్కాట్లాండ్ స్వాతంత్య్ర్రంగా ఉండాలా? లేదా? అన్నదానిపై నిర్ణయం రేపు జరిగిపోతుంది.
**