మీ పిల్లలకూ ఇలాంటి సమస్య ఉందా?
అమెరికా లాంటి దేశాల్లో స్కూలు బస్సు డ్రైవర్ అంటే అనేకరకాలుగా శిక్షణ పొంది ఉంటాడు. అతడికి కేవలం డ్రైవింగ్ మాత్రమే కాదు.. మార్షల్ ఆర్ట్స్, ప్రాథమిక చికిత్స అందించడం, పిల్లల మనస్తత్వానికి సంబంధించిన విషయాలు ఇలా అనేక సంగతులు తెలిసి ఉండాలి. అలాంటి సుశిక్షితులను మాత్రమే స్కూళ్లు, కాలేజీల బస్సులకు డ్రైవర్లుగా నియమిస్తారు. అందువల్ల ఎలాంటి ఇబ్బందికర పరిస్థితి వచ్చినా వెంటనే వాళ్లు స్పందించడానికి సిద్ధంగా ఉంటారు.
కానీ మాసాయిపేట ప్రమాదం చూస్తే, అక్కడ స్కూలు బస్సుకు రోజూ వచ్చే డ్రైవర్ రాకపోవడంతో అందుబాటులో ఉన్న ట్రాక్టర్ డ్రైవర్ను పంపినట్లు తెలుస్తోంది. ఇలా ఏమాత్రం అనుభవం లేనివాళ్లు, కేవలం వాహనం నడపడం వస్తే సరిపోతుంది అనుకునేవాళ్లు కూడా స్కూలు బస్సులు, కాలేజి బస్సుల డ్రైవర్లుగా ఉంటున్న పరిస్థితులు మన దేశంలో చాలాచోట్ల కనిపిస్తున్నాయి. ఈ బస్సుల ఫిట్నెస్ కూడా అంతంతమాత్రమే. శుక్రవారం ఉదయమే కృష్ణాజిల్లా జగ్గయ్యపేట సమీపంలో ఓ బస్సు వెనక చక్రాలు ఊడిపోయాయి. ఆ సమయానికి బస్సులో 48 మంది పిల్లలున్నారు.
ఇక పిల్లలను తీసుకెళ్లే ఆటోల సంగతైతే చెప్పనే అక్కర్లేదు. రెండువైపులా బ్యాగులు తగిలించి, ముగ్గురు ప్రయాణికులు మాత్రమే కూర్చోవాల్సిన ఆటోలో కనీసం పది - పదిహేను మంది పిల్లలను కూర్చోబెట్టి తీసుకెళ్తుంటారు. ఇలా.. పిల్లల ప్రయాణం అంటేనే గుండెలు అరచేతిలో పెట్టుకోవాల్సి వస్తోంది. మీకు కూడా ఇలాంటి అనుభవాలు ఉన్నాయా? మీ పిల్లలు గానీ.. మీకు తెలిసిన పిల్లలు గానీ ఇలా ప్రమాదకరమైన పరిస్థితుల్లో స్కూళ్లు, కాలేజీలకు వెళ్తున్నారా?
అలా అయితే అందుకు ఎవరిది బాధ్యత అని మీరు భావిస్తున్నారో తెలియజేయండి. మీ వ్యాఖ్యలను సరైన వివరాలతో ఇవ్వండి. పిల్లల ప్రయాణం సురక్షితంగా ఉండాలంటే ఏం చేయాలో సూచనలివ్వండి.