ఒడిస్సీ ఒడిలో..
పూరీ జగన్నాథ ఆలయం, భువనేశ్వర్, కొణార్క్లోని సూర్యదేవాలయం.. రాళ్లను తొలచి గుహలుగా మలిచిన ఖండగిరి, ఉదయగిరి ప్రాంతాలు.. బీచ్లు.. ఒడిశా ఒడిలోని పర్యాటక సంపద టూరిస్ట్లను ఆహ్వానిస్తోంది. బంజారాహిల్స్లోని ఫార్చ్యూన్ పార్క్ వల్లభ హోటల్లో శుక్రవారం సాయంత్రం ఒడిశా ప్రభుత్వ పర్యాటక శాఖ రోడ్షో నిర్వహించింది. ఆకట్టుకునే హస్తకళలు, సంప్రదాయ గిరిజన తెగలు, రంగురంగుల ఫెయిర్స్, ఫెస్టివల్, ఆసక్తి కలిగించే క్యుసిన్, నృత్యాలు, సంగీతం గురించి వివరించింది. ఈ సందర్భంగా ఒడి స్సీ నృత్యం చేసి ఆకట్టుకున్న మన తెలుగు యువకుడు హర్ష్తో సిటీప్లస్ ముచ్చటించింది.
నేను పుట్టింది గుంటూరు. పెరిగింది,చదివింది పూరీ పట్టణంలో. జగన్నాథుని సన్నిధిలో ఒడిస్సీ నృత్యంలో అరంగేట్రం చేశాను. మా నాన్న చంద్రపాటి నాగవరప్రసాద్ రాష్ట్రీయ సంస్కృత సంస్థాన్లో అద్వైత వేదాంతం ప్రొఫెసర్. నన్ను బాగా ప్రోత్సహించేవారు. పాఠశాల స్థాయి నుంచే అనేక కార్యక్రమాల్లో నృత్య ప్రదర్శన చేసేవాడిని. ముంబైలోని అఖిల భారతీయ గాంధర్వ మహా విద్యాలయ నుంచి ఒడిస్సీలో డిగ్రీ పట్టా సాధించాను. తర్వాత హైదరాబాద్ చేరుకుని ఇక్ఫాయ్ వర్సిటీ నుంచి ఎంబీఏ పూర్తి చేశాను. ప్రస్తుతం టెక్ మహీంద్రాలో కన్సల్టెంట్గా చేస్తున్నా. ఉద్యోగం చేస్తూనే నృత్య ప్రదర్శనలిస్తున్నా. వారాంతాల్లో ప్రదర్శనలు ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నాను. ఈ మధ్యకాలంలో హైదరాబాద్లో ఈ నృత్యాన్ని ఆదరిస్తున్నారు.
- వీఎస్