మెగా ఫ్యామిలీ సెంటిమెంట్!

పవన్ కల్యాణ్-అల్లు అర్జున్-రామ్ చరణ్ - Sakshi


సినిమా రంగం సెంటిమెంట్లకు నిలయం. ఆ సెంటిమెంట్ ఒకటని చెప్పలేం. అనేక రకాల సెంటిమెంట్లు రాజ్యమేలుతున్నాయి. వారాలు - తేదీలు - నెలలు-పండుగలు-కాంబినేషన్లు.....ఇలా అనేక సెంటిమెంట్లు ఎక్కువ మంది నమ్ముతారు. ముఖ్యంగా టాలీవుడ్లో హీరోలు ఎక్కవగా సెంటిమెంట్లను ఫాలో అవుతారని చెబుతుంటారు. అందరికీ ఉన్నట్లే మెగా ఫ్యామిలికి చెందిన హీరోలకు కూడా సెంటిమెంట్లపై నమ్మకం ఉందని అంటున్నారు. వారిలో  ఎవరితోనైనా  ఓ హీరోయిన్ జతగా నటించిన చిత్రం  హిట్ కొడితే, మిగిలినవారి సినిమాలలో కూడా ఆ హీరోయిన్‌కు అవకాశం దక్కడం ఖాయం. నాజూకు భామ శృతి హాసన్ ఇటీవల అటువంటి అవకాశాలను  కొట్టేసింది. వరుస పెట్టి ఆ స్టార్ హీరోల సరసన నటించింది. ఇంకా నటిస్తోంది. ఆ రకంగా  శృతి మెగా హీరోలకి లక్కీ గర్ల్గా మారింది.



ఈ బ్యూటీ  పవర్స్టార్ పవన్ కల్యాణ్తో గబ్బర్ సింగ్, మెగా పవర్స్టార్ రామ్ చరణ్ తేజతో ఎవడు, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్తో రేసు గుర్రం చిత్రాలలో నటించింది. ఈ సినిమాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేశాయి. ఈ మూడు సినిమాలు సూపర్ హిట్ అవడంతో ప్రస్తుతం మెగా అభిమానులు మరోసారి శృతి హాసన్తో మెగా హీరోలు రోమాన్స్ చేస్తే  చూడాలని కోరుకుంటున్నారు. దాంతో మెగా హీరోలు కూడా శృతితో సినిమా చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నట్లు టాలీవుడ్ టాక్.



 రామ్ చరణ్ త్వరలో శ్రీను వైట్ల దర్శకత్వంలో ఓ  సినిమా చేయబోతున్నాడు. ఆ సినిమాలో హీరోయిన్గా శృతి హాసన్ని ఎంపిక చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో శృతిని హీరోయిన్గా తీసుకోవలసిందిగా శ్రీను వైట్లని రామ్చరణ్ కోరినట్లు సమాచారం‌. అందుకు శ్రీను వైట్ల కూడా ఓకే అని గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం శ్రీను వైట్ల ఆగడు, రామ్ చరణ్ గోవిందుడు అందరివాడేలే సినిమా షూటింగ్స్లో బిజీగా ఉన్నారు. ఆ రెండు సినిమాలు పూర్తి అయిన తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో  ఓ మూవీ సెట్స్ పైకి  వెళ్ళే అవకాశం ఉంది.

- శిసూర్య

Read latest Features News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top