ఇక నో తాగుడు.. నో ఊగుడు!!

ఇక నో తాగుడు.. నో ఊగుడు!! - Sakshi


ఒకటే తాగడం.. ఆపై ఊగడం.. ఆ తర్వాత గోల చేయడం.. ఇలాంటివేవీ ఇక మీదట కనపడవు. అవును.. సంపూర్ణ మద్యనిషేధం దిశగా కేరళ రాష్ట్రం వడివడిగా అడుగులు వేస్తోంది. పదేళ్లలో అక్కడ పూర్తిగా మద్యనిషేధం అమలుచేయాలని ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఫైవ్ స్టార్ కాని హోటళ్లలో ఉన్న 300 బార్లలో మద్యం అమ్మకాలను పూర్తిగా నిషేధిస్తున్నట్లు ముఖ్యమంత్రి ఊమెన్ చాందీ ప్రకటించారు. వాటి లైసెన్సులను రద్దుచేశారు.



మద్యం మన సమాజానికే తీరని ముప్పుగా ఉందని, దీనివల్ల తీవ్ర దుష్ప్రభావాలు తలెత్తుతాయని చాందీ అన్నారు. రాష్ట్రంలో సంపూర్ణ మద్యనిషేధానికి అందరూ సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు. దేశంలోనే అత్యధికంగా మద్యం వినియోగించే రాష్ట్రాల్లో కేరళ ప్రథమస్థానంలో ఉంది. అక్కడ తలసరి మద్యం వినియోగం ఏడాదికి 8.3 లీటర్లుంది. దీంతో ఈ మహమ్మారిని అరికట్టేందుకు ముందుగా కేవలం ఫైవ్ స్టార్ హోటళ్లలో మాత్రమే మద్యం అమ్మాలని నిర్దేశించారు. తర్వాత దశలవారీగా మొత్తం మద్య నిషేధం అమలుచేస్తారు. త్వరలోనే ఆదివారాలను డ్రైడేలుగా ప్రకటించాలని కూడా కేరళ సర్కారు యోచిస్తోంది.



గతంలో ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ హయాంలో సంపూర్ణ మద్యనిషేధం విధించి అమలుచేశారు. అయితే ఆ తర్వాతి కాలంలో వచ్చిన చంద్రబాబు నాయుడు సర్కారు మళ్లీ నిషేధాన్ని ఎత్తేసి మద్యం అమ్మకాలకు గేట్లు బార్లా ఎత్తేశారు. అప్పుడే రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో బెల్టుషాపులు కూడా విచ్చలవిడిగా మొదలయ్యాయి. చిన్న చిన్న హోటళ్లు, బడ్డీ కొట్లలో కూడా మద్యం అమ్మకాలు కొనసాగాయి.

Read latest Features News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top