నా జన్మ ధన్యమై పోయింది


స్నేహశీలత: డాక్టర్ వైఎస్సార్ గుల్బర్గాలో ఎంబిబిఎస్ చేస్తున్నప్పుడు నేను ఒక సంవత్సరం జూనియర్. వైఎస్సార్‌తో పాటు కెవిపి రామచందర్‌రావు, మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి బాబాయ్ నల్లారి హరినాథ్‌రెడ్డి, జమ్మూకాశ్మీర్ ప్రస్తుత సీఎం మహబూబా ముఫ్తీ సోదరి... ఇలా పలువురు ప్రముఖులు క్లాస్‌మేట్స్.  వైఎస్సార్ జూనియర్స్, సీనియర్స్ అనే తేడా లేకుండా అందరితో కలుపుగోలుగా ఉండేవారు. కళాశాల పక్కనే ఉన్న క్యాంటీన్‌లో మేమందరం కలుసుకొనే వాళ్ళం. ఆయన కొత్తవారందరినీ పలకరించేవారు. మా కళాశాలలో పశ్చిమబెంగాల్, గుజరాత్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, కేరళ తదితర రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు అభ్యసించే వారు.



డాక్టర్ వైఎస్సార్, వారందరితోనూ మాట్లాడి, తనకు తాను పరిచయం చేసుకొంటూ, సాన్నిహిత్యం పెంచుకున్నారు. 1970లో జరిగిన విద్యార్థి సంఘం ఎన్నికల్లో డాక్టర్ వైఎస్సార్ 70 శాతం ఓట్లతో మాణిక్‌రావుపై గెలుపొందారు. ఎన్నికలు ఎంతో టఫ్‌గా జరిగినా వైఎస్సార్‌కు అన్ని రాష్ట్రాల విద్యార్థులూ మద్దతు పలికారు. కాలేజీ ఎన్నికల అనంతరం వైఎస్సార్, ప్రత్యర్థి వారినీ పలకరిస్తూ, అందరినీ కలుపుకొనిపోయారు. ఎన్నికల వరకే ప్రత్యర్థులని, ఆ తర్వాత అందరం ఒక్కటేనని చెప్పే వారు.

 

నిరాడంబరత్వం : వైఎస్సార్ అప్పట్లోనే ధనవంతుడు. కానీ ఎప్పుడూ ధనవంతుడిలా ఫీల్ కాలేదు. జావా మోటర్‌బైక్‌పై కాలేజీకి వచ్చేవారు. నిరుపేద విద్యార్థులకు తోచినంత సహాయం చేసేవారు. ఆర్థికంగానూ ఎందరో విద్యార్థులను ఆదుకొన్నారు.  కళాశాలలో చెప్పే నోట్స్‌ను అర్ధరాత్రి వరకు ఉండి రాసుకొని, కంఠస్థం చేసేవారు. అటు క్రీడల్లోనూ తన ప్రతిభను కనబర్చారు.  రాజకీయాల్లోకి వచ్చాక అప్పటి ముఖ్యమంత్రి అంజయ్య కేబినెట్‌లో డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశాఖ మంత్రిగా పని చేశారు. అప్పట్లో ఆయన గుల్బర్గా క్లాస్‌మేట్స్ అందరినీ పిలిచి విందు ఇచ్చారు. ఆ తర్వాత అంచెలంచెలుగా వైఎస్సార్ ఎదిగారు. 2004లో ఆయన ముఖ్యమంత్రి కావాలని దేవుణ్ణి కోరుకున్నారు. ఆయన ముఖ్యమంత్రి అయ్యాక 2005లో బాన్సువాడకు వచ్చారు. పల్లెబాటలో భాగంగా ఇక్కడకు వచ్చినప్పుడు నేను కలిశాను. ఆత్మీయ ఆలింగనం చేసుకున్నాం.

- వైఎస్సార్ క్లాస్ మేట్ డాక్టర్ బాబు షిండే, బాన్సువాడ, నిజామాబాద్

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top