ఇద్దరు మిత్రులు...

ఇద్దరు మిత్రులు...


నువ్వు రాసిన కవితలు గుబాళిస్తోంటే

నువ్వు తాగిన ఖాళీ సీసాల కంపు నాకెందుకు!




అన్నాడు కాళోజీ. ఎమర్జెన్సీ టైమ్‌లో ఇందిరాగాంధీ ఇరవై సూత్రాల కార్యక్రమాన్ని సమర్థిస్తూ శ్రీశ్రీ పాట రాశాడు. ఆ నేరం చాలదా సాహితీ క్రీడాంగణంలో ఫుట్‌బాల్ అయ్యేందుకు? అందరూ తలో కాలూ వేస్తున్నారు. నిప్పులు చిమ్ముకుంటూ నింగికెగసిన శ్రీశ్రీని నెత్తురు కక్కుకుంటూ నేల రాల్చాలని ప్రయత్నిస్తున్నారు.  వ్యక్తిగత లోపాలు ఎత్తి చూపుతూ రెండు శ్రీలను ధరించినవాడు మహాకవి అవునోకాదో కాని రెండు పెగ్గులను బిగించినవాడు నిశ్చయంగా తాగుబోతే అని డయాగ్నస్ చేశారు.  అటువంటి నిస్సహాయ నిస్త్రాణ పరిస్థితుల్లో ‘నిన్ను నిన్నుగా ప్రేమించుటకు’ అన్నట్లుగా శ్రీశ్రీకి తోడున్నవాడు కాళోజీ. వీరిద్దరి అనుబంధం ఇప్పటిదా? కవిసమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ నేపథ్యంగా ముడిపడినది. ఆ  వైనం ఆసక్తికరం.



నిజాం స్టేట్‌లో ఉర్దూ అధికార భాష. తెలుగు బడులను నిరసించారు.  మెడ్రాస్ స్టేట్‌లో తెలుగు బడులపై నిర్బంధం లేదు. ఈ నేపథ్యంలో ఇరుప్రాంతాలకు సాహిత్య వారధులు ఏర్పడ్డాయి. హైద్రాబాద్‌లో, ఆ తర్వాత కొన్నేళ్లకు హనుమకొండలో,  ఆ తర్వాత వరంగల్లులో, ఆపైన కాళోజీ స్వగ్రామం మడికొండలో ఆంధ్రభాషా నిలయాలను స్థాపించుకున్నారు.  మహామహుల రాకపోకలు జరుగుతున్నాయి. సురవరం వారి ‘ఆంధ్రుల సాంఘిక చరిత్ర’ నదిలా రెండు ప్రాంతాల్లో సౌభ్రాతృత్వాన్ని పంచుతోంది. ఈ నేపథ్యంలో విశ్వనాథ వరంగల్ వచ్చేవారు.



మడికొండకూ వచ్చేవారు. ‘ఈసారి వరంగల్ పోయినప్పుడు గార్లపాటి రాఘవరెడ్డిగారనే మంచి కవి పరిచయం, కాళోజీగారి ఆతిథ్యం మరచిపోలేని విషయాలు’ అని వానమామలై వరదాచార్యులవారి ‘మణిమాల’ కావ్యానికి రాసిన పీఠికలో విశ్వనాథ అన్నారు. అయితే అదే ముందుమాటలో ‘వానమామలై తెలంగాణకు చెందిన కవులలో ప్రసిద్ధుడు’ అని కూడా అన్నారు. ఈ మాటకు కాళోజీకి కోపం వచ్చింది.



నన్నయ నుంచి విశ్వనాథ వరకూ అందరం ఒక్కటే అందరూ మనవాళ్లే అనుకుంటూ ఉంటే తెలుగు ఆణిముత్యమైన వానమామలై  వరదాచార్యులను ‘తెలంగాణకు చెందిన’ అని విడదీస్తరా? ‘తెలంగాణ వాదా’నికి బీజం వేసింది తాము మాత్రమే ఆంధ్రులం అనుకుంటున్న ఇలాంటివారు కాదా? అని అప్పట్లోనే ప్రశ్నించారు. మరో సందర్భంలో విశ్వనాథను ఆహ్వానించిన వరంగల్ మిత్రులు రామాయణ కల్పవృక్షాన్ని కవిగారితో చదివిద్దాం అనుకున్నారు. ఏ ఘట్టం? అని చర్చ వచ్చింది. ఏదైనా ఒక్కలాగే ఉంటది, ఆయన్నే ఎంచుకోమందాం అన్నాడు కాళోజీ. ఈ వైనాన్ని విశ్వనాథ చెవిలో వేశారు అభిమానులు. ఏదైనా ఒక్కలాగే ఉంటుందంటాడా అని ఆయన మనసులో పడింది.



విశ్వనాథ తన ‘ఆంధ్ర ప్రశస్తి’ని  తొలితరం చరిత్రపరిశోధకుడు  మల్లంపల్లి సోమశేఖరశర్మకు అంకితం చేస్తూ  ‘డిగ్రీలు లేని పాండిత్యంబు వన్నెకురాని ఈ పాడు కాలమున బుట్టినట్టి...’ అని గౌరవాన్ని ప్రకటించుకున్నారు. అయితే అదే విశ్వనాథ ఆ తర్వాత  ‘పులుల సత్యాగ్రహం’ రచనలో  ‘మాకు తెలిసిన వాడొకడున్నాడు. వాడు మెట్రికో ఇంటరో పాసయ్యాడో, ఫెయిలయ్యాడో. ఆ చదువు చదివే సరికి వానికి అర ఎకరం భూమి పోయింది. తర్వాత ఉద్యోగం లేదు.



ఏం చేయాలో తోచక చరిత్ర పరిశోధన మొదలు పెట్టాడు. మహా పండితుడు-చరిత్ర పరిశోధకుడు అని పెద్దపేరు సంపాదించాడు’ అని మల్లంపల్లిని ఉద్దేశించి రాశారు. ఈ  వెక్కిరింపుకు ఏమన్న అర్థమున్నదా ? అని విశ్వనాథను కాళోజీ ముఖం మీదనే అడిగాడు. విశ్వనాథ కవిత్వం తనవంటి తెలుగువారిక్కూడా అర్థం కాని సంస్కృతభూయిష్టం అని కాళోజీ అనేవాడు. కాళోజీదీ కవిత్వమా? అనుకునే కొందరు సాంప్రదాయవాదులు విశ్వనాథ అభిమానుల్లో ఉండేవారు.



అయితే శ్రీశ్రీ దృష్టిలో కాళోజీకి ఉన్నతమైన స్థానం ఉంది.  కాళోజీ ఎవడు?  నిజాంను ఎదిరించిన వాడు. వేమనలా అందరికీ అర్థమయ్యే కవిత్వాన్ని రాసినవాడు. ఈ నేపథ్యంలో 1953లో మహబూబ్‌నగర్ జిల్లా అలంపూర్‌లో ఆంధ్ర సారస్వత పరిషత్ వార్షికోత్సవాలు జరిగాయి.  కాళోజీ సహాధ్యాయి దేవులపల్లి రామానుజరావు, మిత్రుడు పులిజాల హనుమంతరావు దీని నిర్వాహకులు. భారత ఉపరాష్ట్రపతి డా.సర్వేపల్లి రాధాకృష్ణన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. విశ్వనాథ ప్రభృత ప్రముఖులూ ముఖ్యఅతిథులుగా విచ్చేశారు. ఈ సందర్భంగా తొలి తెలంగాణ రచయితల సంఘం (తెరస) సమావేశాలూ జరిగాయి. మహాకవి శ్రీశ్రీ తదితరులు ‘తెరస’ ఆహ్వానంపై వచ్చారు.



అయితే కాళోజీ సమావేశాలకు రాలేదు. సాంప్రదాయ-ఆధునిక తరాల మధ్య (కాంగ్రెస్ అనుకూలురు కమ్యూనిస్ట్ అనుకూలురు) వైరుధ్యాలు నెలకొన్న వాతావరణంలో  తన మిత్రులయిన నిర్వాహకులకు ఇబ్బంది కలగకూడదని కాళోజీ అభిమతం. ఈ సమావేశాల్లో కాళోజీ ‘నా గొడవ’ పుస్తకాన్ని ఆవిష్కరింపజేయాలని దాశరధి కృష్ణమాచార్య, బిరుదురాజు రామరాజు, డి.రామలింగం వంటి మిత్రులు ప్రయత్నించారు. వట్టికోట ఆళ్వారుస్వామి  దేశోద్ధారక గ్రంథమాల తరఫున ‘నా గొడవ’ను ప్రచురించారు. అయితే ఆవిష్కరణకు నిర్వాహకులు సహకరించలేదు.



ఎవరి వేదికలు, ఎవరి క్యాంపులు వారివి. రాత్రి భోజనాలైన తర్వాత 11 గంటల వేళ యువరచయితలు ఒక క్యాంపులో శ్రీశ్రీతో ‘నా గొడవ’ ఆవిష్కరింపజేశారు.  ఈ సందర్భంగా శ్రీశ్రీ  కాళోజీని  ఫ్రెంచ్ కవి, నవలాకారుడు లూయీ అరగాన్‌తో పోల్చాడు. 



ఆ మరుసటి రోజు ‘కాళోజీ మన లూయీస్ అరగాన్’ అన్న శ్రీశ్రీ వ్యాఖ్యతో వార్తలు వచ్చాయి. ఈ అరగాన్ ఎవడు? కాళోజీ సందేహం! శ్రీశ్రీకి ఉత్తరం రాశాడు కాళోజీ. ‘తక్కిన వాళ్లందరూ యుద్ధంలో పారిపోతున్నపుడు లూయీస్ అరగాన్ ప్రజల తరఫున నిలుచున్నాడు ’ అని శ్రీశ్రీ వివరణ ఇచ్చాడు. గురజాడ వారసుడైన శ్రీశ్రీని రష్యన్ కవి మయకోవిస్కీతో, ఇంగ్లండ్‌కు చెందిన జేమ్స్‌జాయిస్‌తో పోలుస్తారు. అరగాన్‌తో కూడా!  శ్రీశ్రీ పోలికలో ఔచిత్యం ఉంది! కాళోజీతో మమేకత ఉంది!

 

ఈ సందర్భంగా శ్రీశ్రీ  కాళోజీని  ఫ్రెంచ్ కవి, నవలాకారుడు లూయీ అరగాన్‌తో పోల్చాడు. ఈ అరగాన్ ఎవడు? కాళోజీ సందేహం!

 - పున్నా కృష్ణమూర్తి, ఫ్రీలాన్స్ జర్నలిస్ట్, రచయిత, 7680950863

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top