నమో కృష్ణవేణి

నమో కృష్ణవేణి - Sakshi


కృష్ణా తరంగాల సారంగ రాగాలు పుష్కరాలు. బృహస్పతి కన్యారాశిలో ప్రవేశిస్తే కృష్ణా పుష్కరాలు. మహాబలేశ్వర్‌లో పుట్టి, సహ్యాద్రి మీద తుళ్లుతూ, తూలుతూ, వయ్యారాలు పోతూ, ఎగసిపడుతూ, మనసును విశాలంగా చేసుకుంటూ సాగుతుంది కృష్ణమ్మ గమనం. మధ్యలో ఎన్నో నదీనదాలను, ఉపనదులను తనలో ఐక్యం చేసుకుంటుంది. మధ్యమధ్యలో సిగపాయల మందారాలను చూపుతుంది. దారిలో పర్వతాలను, కొండలను, అడవులను, జనజీవన స్రవంతిని అందరినీ పరవశింపజేస్తూ, పులకింపజేస్తూ కొన్ని వందల మైళ్లు ప్రయాణించి... అలసిసొలసి,


‘ఇక ప్రయాణం చాలు’ అంటూ అత్తవారింటికి చేరి, తన భర్త సాగరుడి ఒడిలో హంసలదీవిలో మనోహరంగా సేదతీరుతుంది. కృష్ణమ్మ గమనం మనోహరం... కృష్ణమ్మ రూపం సౌందర్యం... గలగల పారే కృష్ణమ్మ ధ్వనులు... ఎగసిపడే కృష్ణమ్మ అందాలు... తుళ్లుతూ పలకరించే కృష్ణమ్మ పరవళ్లు... ఇవన్నీ ఈ పుష్కరాలలో తనివితీరా ఆస్వాదిద్దాం రండి. కృష్ణమ్మలో మునిగి తరించడానికి ఆ తల్లి ప్రయాణిస్తున్న మార్గంలో ఎన్నో ఘాట్లు! కృష్ణా పుష్కర స్నానానికి వచ్చే వారి కోసం తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల్లోని ఆ ఘాట్ల సమాచారాన్ని సాక్షి ఇలా మీకు అందిస్తోంది. స్నానం ఆచరించండి... ఆ తల్లి ఒడిలో పునీతులు కండి...




1. కృష్ణ ఘాట్ (మాగనూరు మండలం)

నీటిస్థాయి : ప్రస్తుతం కృష్ణా నది ఘాట్ల మెట్ల మీదుగా ప్రవహిస్తోంది.

ఆలయాలు : కృష్ణా, భీమా నదుల సంగమం, దత్త మందిరం, శ్రీ క్షీరలింగేశ్వర ఆలయం, వెంకటేశ్వర ఆలయాలు

రవాణా సౌకర్యాలు : హైదరాబాద్ నుంచి కృష్ణ గ్రామానికి 182 కిలోమీటర్ల్ల దూరం ఉంటుంది.  బస్సుద్వారా అయితే మహబూబ్‌నగర్, మక్తల్ మీదుగా కృష్ణకు చేరుకోవచ్చు. రైలు ద్వారా నాంపల్లి, సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ల నుంచి బెంగళూర్‌కు వెళ్లే ప్రతి రైలు కృష్ణ మీదుగా వెళ్తుంది, వికారాబాద్, వాడి జంక్షన్, యాద్గిర్ పట్టణాల మీదుగా కృష్ణకు చేరుకోవచ్చు. కర్ణాటక నుంచి కేవలం ఆరు కిలోమీటర్ల దూరంలో ఉంది.

వసతులు :  యాత్రినివాస్, వివేకానంద ఆశ్రమం ఉన్నాయి.

 

 

2.    పస్పుల ఘాట్  (మక్తల్)


 నీటిస్థాయి :  కృష్ణానది నీటిమట్టం 30 అడుగుల లోతు ఉంది.

ఆలయాలు : దత్తస్వామి దేవాలయం

రవాణా సౌకర్యాలు : హైదరాబాద్ నుంచి పస్పుల వరకు 185 కిలోమీటర్ల దూరం ఉంది. హైదరాబాద్ నుంచి మహబూబ్‌నగర్, దేవరకద్ర, మక్తల్ రోడ్డుమార్గం గుండా చేరుకోవాలి. మక్తల్ నుంచి ఖానాపూర్, కర్ని, చిట్యాల మీదుగా పస్పుల గ్రామం చేరుకోవచ్చు. మక్తల్ నుంచి 19 కిలోమీటర్ల దూరం ఉంటుంది.

 వసతులు : తాత్కాలికంగా షెడ్లు ఏర్పాటు చేస్తున్నారు.

 

 

3. నందిమల్ల ఘాట్ (ఆత్మకూర్)


నీటిస్థాయి : నీటి ప్రవాహం లేదు

పుణ్యక్షేత్రాలు: చింతల మునిరంగస్వామి, భ్రమరాంబికా మల్లికార్జునస్వామి ఆలయం

సౌకర్యాలు- వసతులు: పార్కింగ్ స్థలం, మరుగుదొడ్లు, తాగునీటి వసతులు కల్పిస్తున్నారు.

రవాణా :  ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు ప్రధాన ఎడమ విభాగంలో నిర్మిస్తున్న పుష్కరఘాట్‌కు హైదరాబాద్ నుంచి జడ్చర్ల, కొత్తకోట మీదుగా ఆత్మకూర్‌కు 165 కి.మీ ప్రయాణించాల్సి ఉంటుంది. ఇక్కడి నుంచి పుష్కరఘాట్‌కు 12 కి.మీ ప్రయాణించాలి. రాయచూరు నుంచి 40 కి.మీ ప్రయాణించి ధరూర్ చేరుకున్న అనంతరం అక్కడి నుంచి 10 కి.మీ దూరంలో జూరాల ప్రాజెక్టుకు ప్రయాణం చేయాలి. కర్నూలు నుంచి వచ్చే భక్తులు ఎర్రవల్లి చౌరస్తా వద్ద దిగాలి. అక్కడినుంచి గద్వాల మీదుగా నందిమల్లకు చేరుకోవచ్చు.

 

4. రంగాపూర్ ఘాట్ (పెబ్బేరు)

నీటిస్థాయి : ప్రస్తుతం ఘాట్ మొదటి మెట్టు వద్ద కృష్ణానది నీళ్లు ప్రవహిస్తున్నాయి. కృష్ణానది బ్యాక్ వాటర్ వస్తే ఐదో లైన్ వరకు నీరు వచ్చే అవకాశం ఉంది.

ఆలయాలు : రంగనాయకస్వామి, అభయాంజనేయ స్వామి ఆలయాలు

రవాణా సౌకర్యాలు : హైదరాబాద్ నుంచి వచ్చే భక్తులు 44వ నంబర్ జాతీయ రహదారిపై 150 కి.మీ ప్రయాణం చేస్తే పెబ్బేరు పట్టణానికి చేరుకుంటారు. అక్కడి నుంచి కర్నూలుకు వెళ్లే దారిలో 5 కి.మీ దూరం ప్రయాణం చేస్తే రంగాపూర్ పుష్కరఘాట్‌కు చేరుకోవచ్చు. మహబూబ్‌నగర్ పట్టణం నుంచి వచ్చే భక్తులు కూడా 85 కి.మీ. ప్రయాణం చేసి పెబ్బేరు పట్టణానికి చేరుకోవాలి. ఇక్కడినుంచి కర్నూలు వెళ్లే దారిలో 5 కి.మీ. ప్రయాణించి రంగాపూర్ పుష్కరఘాట్‌కు చేరుకోవచ్చు.  

సౌకర్యాలు : ఘాట్ వద్ద తాత్కాలిక షెడ్లు ఏర్పాటు చేస్తున్నారు. భోజనాల కోసం పెబ్బేరులో హోటళ్లు ఉన్నాయి.

 

5. బీచుపల్లి ఘాట్ (ఇటిక్యాల)

నీటిస్థాయి :  పుష్కరఘాట్లను ఆనుకుని ప్రస్తుతం నదిలో నీటి ప్రవాహం.

ఆలయాలు : ఆంజనేయస్వామి దేవాలయం, శివాలయం, కోదండరామా  లయం, హయగ్రీవ సరస్వతి జ్ఞానమందిరం

రవాణా సౌకర్యం : హైదరాబాద్ నుంచి బీచుపల్లికి 166 కిలోమీటర్ల దూరం ఉంది.  హైదరాబాద్ నుంచి 44వ నంబరు జాతీయ రహదారిపై నేరుగా బీచుపల్లి పుణ్యక్షేత్రానికి చేరుకోవచ్చు. కర్నూలు నుంచి బీచుపల్లికి 44 కిలోమీటర్ల దూరం ఉంది. 44వ నంబరు జాతీయ రహదారిపై నేరుగా అక్కడికి చేరుకోవచ్చు. కర్ణాటక రాష్ట్రంలోని రాయచూర్ నుంచి బీచుపల్లికి 60 కిలోమీటర్ల దూరం ఉంది. రాయచూర్ నుంచి భక్తులు బీచుపల్లి పుణ్యక్షేత్రానికి గద్వాల, ఎర్రవల్లిచౌరస్తా మీదుగా చేరుకోవచ్చు.

రైలుమార్గం :  హైదరాబాద్ నుంచి రైలు మార్గంలో గద్వాలకు చేరుకుని గద్వాల నుంచి ఎర్రవల్లిచౌరస్తా మీదుగా బీచుపల్లికి చేరుకోవచ్చు. గద్వాల నుంచి బీచుపల్లికి 16 కిలోమీటర్ల దూరం ఉంది.

వసతులు :  ఎర్రవల్లిచౌరస్తా వద్దనే భక్తుల వాహనాలను పార్కింగ్‌చేసి అక్కడి నుంచి ప్రభుత్వం ఏర్పాటు చేసే ఆటోల ద్వారా బీచుపల్లి పుష్కరఘాట్ వద్దకు భక్తులను తరలిస్తారు.  

 

6. నదీ అగ్రహారం ఘాట్ (గద్వాల)

నీటిస్థాయి : ఘాట్‌కు 3.3 మీటర్ల దూరంలో నీటి ప్రవాహం ఉంది.

పుణ్యక్షేత్రాలు : స్పటిక లింగేశ్వరాలయం, కల్యాణ వెంకటేశ్వరస్వామి రామాలయం, ఆంజనేయస్వామి, నవగ్రహ మండపం, సాక్షేశ్వరస్వామి ఆలయాలు ఉన్నాయి. అదే విధంగా అహోబిల మఠం ఉంది.

 సౌకర్యాలు - వసతులు :  ఘాట్ల దగ్గర ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పుష్కర భక్తుల కోసం ఉచిత అన్నదానాలను, నీటి సౌకర్యాన్ని వివిధ స్వచ్ఛంద సంస్థలు అందిస్తున్నాయి.  గద్వాలలో విడిది చేయడానికి అవసరమైన లాడ్జింగ్‌లు, భోజన వసతి ఉన్నాయి.

బస్సు మార్గం : గద్వాల పట్టణం మీదుగా ఘాట్‌కు వెళ్లాల్సి ఉంటుంది. హైదరాబాద్ నుంచి కర్నూలు వెళ్లే బస్సులలో జాతీయ రహదారి గుండా 180 కిలోమీటర్లు ప్రయాణించి ఎర్రవల్లి చౌరస్తాలో దిగాలి. అక్కడినుంచి 16 కిలోమీటర్ల దూరంలో గద్వాల  ఉంది. కర్నూలు వచ్చే భక్తులు హైదరాబాద్ వెళ్లే బస్సులలో 45 కిలోమీటర్లు జాతీయ రహదారి గుండా ప్రయాణించి ఎర్రవల్లిచౌరస్తా వద్ద దిగాలి. అక్కడినుంచి 16 కిలోమీటర్ల దూరం ప్రయాణించి గద్వాలకు చేరుకోవచ్చు. కర్ణాటక రాష్ట్రంలో రాయచూర్ జిల్లా నుంచి నందిన్నె, ధరూర్ మీదుగా 50 కిలోమీటర్లు ప్రయాణించి గద్వాలకు చేరుకోవచ్చు. రైలు మార్గం :  గద్వాల రైల్వేస్టేషన్ నుంచి 5 కిలోమీటర్ల దూరంలో నదీ అగ్రహారం ఘాట్ ఉంది.  సికింద్రాబాద్, హైదరాబాద్‌ల నుంచి రైలు మార్గంలో ప్రయాణించే భక్తులు షాద్‌నగర్, జడ్చర్ల, మహబూబ్‌నగర్‌ల మీదుగా గద్వాలకు చేరుకోవచ్చు.

 

7. క్యాతూర్ ఘాట్ (అలంపూర్)

నీటిస్థాయి : ఘాట్ వద్ద 10మీటర్ల దూరంలో ప్రవాహం ఉంది.

ఆలయాలు : కుళ్లాయప్ప ఆలయాలు, శివాలయం, ఆంజనేయస్వామి ఆలయం

వసతులు :  తాత్కాలిక షెడ్లు నిర్మిస్తున్నారు. అలంపూర్ చౌరస్తాలో భోజన వసతులు ఉంటాయి.

రవాణా :  హైదరాబాద్ నుంచి అలంపూర్ చౌరస్తా (కర్నూలు జాతీయ రహదారి) వరకు 200 కిలోమీటర్ల దూరం ఉంటుంది. చౌరస్తా నుంచి అలంపూర్‌కు 15 కిలోమీటర్లు ఉంటుంది. అలంపూర్ నుంచి క్యాతూర్ ఘాట్‌కు 18 కిలోమీటర్ల దూరం ఉంటుంది. కర్నూలు నుంచి అలంపూర్ చౌరస్తా వరకు 10కిలోమీటర్ల దూరం ఉంటుంది. అక్కడినుంచి అలంపూర్, గొందిమల్ల ఘాట్‌కు 23 కిలోమీటర్ల దూరం ఉంటుంది.

రైలుసౌకర్యం : హైదరాబాద్ నుంచి కర్నూలుకు వెళ్లే రైలు జోగుళాంబ, బాలబ్రహ్మేశ్వర రైల్వేహాల్ట్ వద్ద దిగాల్సి ఉంటుంది. అక్కడినుంచి గొందిమళ్ల ఘాట్ 18 కిలోమీటర్ల దూరం ఉంటుంది. అక్కడి నుంచి ఆర్టీసీ బస్సులు, ప్రైవేటు వాహనాల ద్వారా ఘాట్‌లు, పుణ్య క్షేత్రాలకు చేరుకోవచ్చు.

 

8. గొందిమళ్ల  ఘాట్ (అలంపూర్)

నీటిస్థాయి : ఘాట్‌కు 5 మీటర్ల దూరంలో నీటి ప్రవాహం ఉంది.

పుణ్యక్షేత్రాలు : ఝుకారేశ్వరి మాత ఆలయం,   శ్రీజోగుళాంబ ఆలయం, నవగ్రహ బ్రహ్మా ఆలయాలు, సంగమేశ్వర ఆలయం, సూర్యనారాయణ స్వామి, శ్రీయోగనరసింహ స్వామి, పాపనాశిని తీర్థం

వసతులు : ఘాట్ వద్ద తాత్కాలిక మరుగుదొడ్లు, మూత్రశాలలు, పార్కింగ్, విద్యుత్ వంటి సౌకర్యాలు కల్పిస్తున్నారు.

రవాణా సౌకర్యాలు : హైదరాబాద్ నుంచి అలంపూర్ చౌరస్తా (కర్నూల్ జాతీయ రహదారి) వరకు 200 కిలోమీటర్ల దూరం ఉంటుంది. చౌరస్తా నుంచి అలంపూర్‌కు 15 కిలోమీటర్లు ఉంటుంది. అలంపూర్ నుంచి గొందిమళ్ల ఘాట్‌కు 8 కిలోమీటర్ల దూరం ఉంటుంది. బస్సుద్వారా చేరుకోవచ్చు.  కర్నూలు నుంచి అలంపూర్ చౌరస్తా వరకు 10కిలోమీటర్ల దూరం ఉంటుంది. అక్కడినుంచి అలంపూర్, గొందిమల్ల ఘాట్‌కు 23 కిలోమీటర్ల దూరం ఉంటుంది.

రైలుసౌకర్యం : హైదరాబాద్ నుంచి కర్నూల్‌కు వెళ్లే రైలు జోగుళాంబ, బాలబ్రహ్మేశ్వర రైల్వేహాల్ట్ వద్ద దిగాల్సి ఉంటుంది. అక్కడినుంచి గొందిమల్ల ఘాట్ 15కిలోమీటర్ల దూరం ఉంటుంది. అక్కడి నుంచి ఆర్టీసీ బస్సులు, ప్రైవేటు వాహనాల ద్వారాఘాట్‌లు, పుణ్యక్షేత్రాలకు చేరుకోవచ్చు.

 

9. సోమశిల ఘాట్ (కొల్లాపూర్) (వీఐపీ, జనరల్ ఘాట్లు)


నీటిస్థాయి : ఇది శ్రీశైల బ్యాక్ వాటర్ వద్ద ఏర్పాటుచేశారు. ప్రస్తుతం కృష్ణానది నీళ్లు లోతట్టులో ఉన్నాయి. నదీనీటి మట్టం పెరుగుతోంది. మరో 60 అడుగులకు పైగా నీరు పెరిగితే ఘాట్ల వద్దకు నీళ్లు చేరుకుంటాయి.

ఆలయాలు : ద్వాదశ జ్యోతిర్లింగాలయం (దీనినే లలితాంబికా సోమేశ్వరాలయం)

రవాణాసౌకర్యాలు : సోమశిలకు చేరుకోవాలంటే కొల్లాపూర్ నుంచే వెళ్లాలి. హైదరాబాద్ నుంచి కొల్లాపూర్‌కు 200 కిలో మీటర్ల దూరం ఉంటుంది. హైదరాబాద్ నుంచి జడ్చర్ల, నాగర్‌కర్నూల్ మీదుగా కొల్లాపూర్ చేరుకోవచ్చు. మరోదారిలో వనపర్తి, పెబ్బేర్ నుంచి కూడా కొల్లాపూర్ రావచ్చు. వనపర్తి నుంచి కొల్లాపూర్‌కు 50 కిలోమీటర్లు, పెబ్బేరు నుంచి కొల్లాపూర్‌కు 50 కిలోమీటర్ల దూరం ఉంది. పెబ్బేరు రోడ్డు ఇంకా నిర్మాణ దశలో ఉంది. వనపర్తి రోడ్డు కంటే నాగర్‌కర్నూల్ నుంచి కొల్లాపూర్ చేరుకునేందుకు రోడ్డు బాగా ఉంటుంది.

వసతులు : సోమశిలకు విచ్చేసే భక్తులు బస చేసేందుకు కొల్లాపూర్‌లో ఒక చిన్నపాటి లాడ్జింగ్ మాత్రమే ఉంది. అద్దె గదులు కూడా దొరకవు. ప్రభుత్వం విడిది సౌకర్యాలు ఏర్పాటుచేసే యోచనలో ఉంది. ఇక్కడికి ఉదయం వచ్చి రాత్రి వెళ్లడమే మంచిది. లేదంటే నాగర్‌కర్నూల్, వనపర్తిలో బసచేసేందుకు లాడ్జీలు, విడిదిగృహాలు ఉంటాయి.

 

10. పాతాళగంగ ఘాట్ (మన్ననూరు)

నీటిస్థాయి : ప్రస్తుతం మెట్ల వద్ద కొంత నీరు  నిలిచి ఉంది. నీటి ప్రవాహం లేదు.

ఆలయాలు : శ్రీఉమామహేశ్వర క్షేత్రం, మద్దిమడుగు పబ్బతి ఆంజనేయస్వామి ఆలయం, చెంచులక్ష్మి మ్యూజియం, వ్యూపాయింట్, మల్లెలతీర్థం జలపాతం, కదలీవనం, అక్కమహాదేవిగృహాలు, శ్రీశైలం మల్లికార్జునస్వామి ఆలయాలు.

సౌకర్యాలు : ఇక్కడ సేదతీరేందుకు తాత్కాలిక టెంట్లు ఏర్పాటుచేస్తున్నారు.

రవాణాసౌకర్యాలు : హైదరాబాద్ నుంచి పాతాళగంగ 190 కి.మీ దూరం ఉంటుంది. ఆమనగల్లు, కల్వకుర్తి, డిండి, మన్ననూరు మీదుగా ప్రయాణించవచ్చు. పాతాళగంగ పుష్కరఘాట్ నుంచి 18 కి.మీ వెళ్లితే శ్రీశైలం మల్లికార్జునస్వామి ఆలయం వస్తుంది. మహబూబ్‌నగర్ నుంచి పాతాళగంగ 167 కిలోమీటర్ల దూరం ఉంటుంది. మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, అచ్చంపేట, మన్ననూరు మీదుగా చేరుకోవాలి.

 

11. సంగమేశ్వరం ఘాట్ (కొత్తపల్లి) 

ఇక్కడ రెండు ఘాట్లు ఏర్పాటు చేస్తున్నారు.

నీటిస్థాయి: ప్రస్తుతం ఆలయానికి 15 అడుగుల దూరంలో కృష్ణా నది ప్రవహిస్తోంది. ఘాట్ వద్ద నీళ్లు అందుబాటులో లేవు.

ఆలయాలు: సంగమేశ్వరస్వామి ఆలయం, కొలనుభారతి(ఘాట్‌కు 18 కిలోమీటర్ల దూరంలో ఉంది. )

సౌకర్యాలు: పిండ ప్రదాన సౌకర్యం, మరుగుదొడ్లు, మంచినీరు, తాత్కాలిక టెంట్లు ఏర్పాటు చేస్తున్నారు. సంగమేశ్వరానికి 5 కిలోమీటర్ల దూరంలోని కపిలేశ్వరం వద్ద ఒకటి, కపిలేశ్వరం-సంగమేశ్వరం మధ్య మరొకటి వాహన పార్కింగ్ సౌకర్యం ఏర్పాటు చేస్తున్నారు.

రవాణా సౌకర్యం: కర్నూలు నుంచి 120 కిలోమీటర్ల దూరంలో ఉంది. నందికొట్కూరు, ఆత్మకూరు, నందికుంట్ల, కొత్తపల్లి, శివపురం, కపిలేశ్వరం.

 

12 పాతాళగంగ ఘాట్  (శ్రీశైలం )

నీటి స్థాయి: ప్రస్తుతం వినియోగంలో ఉన్న పుష్కర ఘాట్ వద్ద నీళ్లు మోకాళ్ల వరకు ఉన్నాయి. కొత్తగా నిర్మిస్తున్న పుష్కర ఘాట్‌కు ఇంకా నీరు అందలేదు. నదిలో నీటి ప్రవాహం లేదు.

ఆలయాలు: శ్రీశైలం, ట్రైబల్ మ్యూజియం, శివాజీ స్ఫూర్తి కేంద్రం, సాక్షి గణపతి, హఠకేశ్వరి, పాలధార.. పంచధార.. శిఖరేశ్వరం. వీటితో పాటు బోటు మార్గంలో రెండు గంటలు ప్రయాణిస్తే అక్కమహాదేవి గుహలను సందర్శించచ్చు. అక్కమహాదేవి గుహల నుంచి నడక మార్గంలో 5 కిలోమీటర్లు ప్రయాణిస్తే కదలీవనం వస్తుంది.

సౌకర్యాలు : దుస్తులు మార్చుకొనే గదులు, మరుగుదొడ్లు, క్లాక్‌రూం, హోల్డింగ్ ప్లేసెస్ ఏర్పాటు చేస్తున్నారు. పుష్కర నగర్ (క్లాక్‌రూం, మరుగుదొడ్లు, ఉచిత వైద్య శిబిరం, భోజన వసతి, తాత్కాలిక వసతి, సాంస్కృతిక కార్యక్రమాలు)లను ఏర్పాటు చేస్తున్నారు. శ్రీశైలం నుంచి పాతాళగంగ చేరుకునేందుకు సెట్విన్ బస్సులను ఏర్పాటు చేస్తున్నారు. ఉచిత అన్నదాన శిబిరాలను సత్రాలు, స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో ఏర్పాటవుతున్నాయి.

 రవాణా సౌకర్యం:  కర్నూలు నుంచి 180 కిలోమీటర్ల దూరంలో ఉంది. నందికొట్కూరు, ఆత్మకూరు. ఇక్కడి నుంచి 70 కిలోమీటర్ల ఘాట్ రోడ్డు ప్రయాణిస్తూ దోర్నాల చెక్‌పోస్టు చేరుకోవచ్చు. ఇక్కడి నుంచి మరో 50 కిలోమీటర్ల ఘాట్ ప్రయాణంలో శ్రీశైలం చేరుకోవచ్చు  ప్రకాశం జిల్లా 190 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఒంగోలు, చీమకుర్తి, పొదిలి, మార్కాపురం, దోర్నాల మీదుగా శ్రీశైలం చేరుకోవచ్చు.  గుంటూరు-విజయవాడ  నుంచి 230 కిలోమీటర్లు. నరసరావుపేట, వినుగొండ, త్రిపురాంతకం, దోర్నాల మీదుగా శ్రీశైలం చేరుకోవచ్చు.

 

13 లింగాలగట్టు ఘాట్ (శ్రీశైలం )

నీటి స్థాయి: ప్రస్తుతం ఘాట్‌ల వద్ద నీళ్లు లేవు. సమీపంలోని నిల్వ ఉన్న నీటిలో స్నానాలు చేయాల్సి ఉంటుంది.

ఆలయాలు: శ్రీశైలం, ట్రైబల్ మ్యూజియం, శివాజీ స్ఫూర్తి కేంద్రం, సాక్షి గణపతి, హఠకేశ్వరి, పాలధార.. పంచధార.. శిఖరేశ్వరం. వీటితో పాటు బోటు మార్గంలో రెండు గంటలు ప్రయాణిస్తే అక్కమహాదేవి గుహలను సందర్శించచ్చు. అక్కమహాదేవి గుహల నుంచి నడక మార్గంలో 5 కిలోమీటర్లు ప్రయాణిస్తే కదలీవనం వస్తుంది.

సౌకర్యాలు : దుస్తులు మార్చుకొనే గదులు, మరుగుదొడ్లు, క్లోక్‌రూం, హోల్డింగ్ ప్లేసెస్ ఏర్పాటు చేస్తున్నారు. 3 పుష్కర నగర్(క్లోక్‌రూం, మరుగుదొడ్లు, ఉచిత వైద్య శిబిరం, భోజన వసతి, తాత్కాలిక వసతి, సాంస్కృతిక కార్యక్రమాలు)లను ఏర్పాటు చేస్తున్నారు. శ్రీశైలం నుంచి పాతాళగంగ చేరుకునేందుకు సెట్విన్ బస్సులను ఏర్పాటు చేస్తున్నారు. ఉచిత అన్నదాన శిబిరాలు సత్రాలు, స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో ఏర్పాటవుతున్నాయి.

రవాణా సౌకర్యం:  కర్నూలు నుంచి 200 కిలోమీటర్ల దూరంలో ఉంది. నందికొట్కూరు, ఆత్మకూరు. ఇక్కడి నుంచి 70 కిలోమీటర్ల ఘాట్ రోడ్డు ప్రయాణిస్తూ దోర్నాల చెక్‌పోస్టు చేరుకోవచ్చు. ఇక్కడి నుంచి మరో 50 కిలోమీటర్ల ఘాట్ ప్రయాణంలో శ్రీశైలం చేరుకోవచ్చు  ప్రకాశం జిల్లా 210 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఒంగోలు, చీమకుర్తి, పొదిలి, మార్కాపురం, దోర్నాల మీదుగా శ్రీశైలం చేరుకోవచ్చు  గుంటూరు-విజయవాడ  నుంచి 250 కిలోమీటర్లు. నరసరావుపేట, వినుగొండ, త్రిపురాంతకం, దోర్నాల మీదుగా శ్రీశైలం చేరుకోవచ్చు.

 

13 లింగాలగట్టు ఘాట్ (శ్రీశైలం )

నీటి స్థాయి: ప్రస్తుతం ఘాట్‌ల వద్ద నీళ్లు లేవు. సమీపంలోని నిల్వ ఉన్న నీటిలో స్నానాలు చేయాల్సి ఉంటుంది.

ఆలయాలు: శ్రీశైలం, ట్రైబల్ మ్యూజియం, శివాజీ స్ఫూర్తి కేంద్రం, సాక్షి గణపతి, హఠకేశ్వరి, పాలధార.. పంచధార.. శిఖరేశ్వరం. వీటితో పాటు బోటు మార్గంలో రెండు గంటలు ప్రయాణిస్తే అక్కమహాదేవి గుహలను సందర్శించచ్చు. అక్కమహాదేవి గుహల నుంచి నడక మార్గంలో 5 కిలోమీటర్లు ప్రయాణిస్తే కదలీవనం వస్తుంది.

సౌకర్యాలు : దుస్తులు మార్చుకొనే గదులు, మరుగుదొడ్లు, క్లోక్‌రూం, హోల్డింగ్ ప్లేసెస్ ఏర్పాటు చేస్తున్నారు. 3 పుష్కర నగర్(క్లోక్‌రూం, మరుగుదొడ్లు, ఉచిత వైద్య శిబిరం, భోజన వసతి, తాత్కాలిక వసతి, సాంస్కృతిక కార్యక్రమాలు)లను ఏర్పాటు చేస్తున్నారు. శ్రీశైలం నుంచి పాతాళగంగ చేరుకునేందుకు సెట్విన్ బస్సులను ఏర్పాటు చేస్తున్నారు. ఉచిత అన్నదాన శిబిరాలు సత్రాలు, స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో ఏర్పాటవుతున్నాయి.

రవాణా సౌకర్యం:  కర్నూలు నుంచి 200 కిలోమీటర్ల దూరంలో ఉంది. నందికొట్కూరు, ఆత్మకూరు. ఇక్కడి నుంచి 70 కిలోమీటర్ల ఘాట్ రోడ్డు ప్రయాణిస్తూ దోర్నాల చెక్‌పోస్టు చేరుకోవచ్చు. ఇక్కడి నుంచి మరో 50 కిలోమీటర్ల ఘాట్ ప్రయాణంలో శ్రీశైలం చేరుకోవచ్చు  ప్రకాశం జిల్లా 210 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఒంగోలు, చీమకుర్తి, పొదిలి, మార్కాపురం, దోర్నాల మీదుగా శ్రీశైలం చేరుకోవచ్చు  గుంటూరు-విజయవాడ  నుంచి 250 కిలోమీటర్లు. నరసరావుపేట, వినుగొండ, త్రిపురాంతకం, దోర్నాల మీదుగా శ్రీశైలం చేరుకోవచ్చు.

 

 

14. నాగార్జున సాగర్ ఘాట్ (గుంటూరు)

నీటి స్థాయి: ప్రస్తుతం ఘాట్‌లకు పది అడుగుల దూరంలో నీరు ఉన్నాయి.

ఆలయాలు: కృష్ణవేణి ఘాట్ వద్ద అయ్యప్పస్వామి దేవాలయం, అమరలింగేశ్వరస్వామి దేవాలయం, ఎత్తిపోతల వద్ద దత్తాత్రేయ స్వామి, అనుపులో శ్రీరంగనాధ స్వామి దేవాలయాలు ఉన్నాయి.

సౌకర్యాలు: పుష్కర నగర్‌లు నిర్మిస్తున్నారు. కృష్ణవేణి ఘాట్‌లో పిండప్రదానం షెడ్‌లను ఏర్పాటు చేస్తున్నారు. ఘాట్‌ల నిర్మాణ పనులు 80శాతం పూర్తయ్యాయి.

రవాణా సౌకర్యం: హైదరాబాద్ నుంచి 150 కిలోమీటర్లు. మాచర్ల నుంచి 30 కిలోమీటర్లు దూరంలో ఉంది. ఆర్టీసీ బస్సు సౌకర్యం ఉంది. శ్రీశైలం నుంచి లాంచీల ద్వార ప్రయాణం చేయవచ్చు.

 

 

15. సాగర్ శివాలయం ఘాట్ (నాగార్జున సాగర్)

నీటిస్థాయి : ఈ ఘాట్ సాగర్ డ్యాం దిగువన కృష్ణా నది తీరంలో ఉంది. ప్రస్తుతం సాగర్ డ్యాం నుంచి వచ్చే  లీకేజీ నీటిని ఘాట్‌లోకి మళ్లిస్తే భక్తులు స్నానాలు చేసే అవకాశం ఉంది.

పుణ్యక్షేత్రాలు : శృంగేరి మఠాధిపతులు ఏర్పాటు చేసిన శివాలయం, ఏలేశ్వరాలయం, సురికి వీరాంజనేయస్వామి ఆలయం, రామాలయం, మార్కండేయ మల్లికార్జునస్వామి ఆలయం, రమాసహిత సత్యనారాయణ స్వామి ఆలయం,

సౌకర్యాలు-వసతులు : పార్కింగ్ స్థలం, మరుగుదొడ్లు, తాగునీటి వసతులు కల్పిస్తున్నారు. పర్యాటక అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నడుస్తున్న విజయ విహార్ అతిథి గృహంతోపాటు హోటళ్లు ఉన్నాయి.

రవాణా : హైదరాబాద్ నుంచి సాగర్‌కు మాల్.. మల్లేపల్లి, పెద్దవూర మీదుగా నేరుగా బస్సుల ద్వారా సాగర్‌లోని పుష్కర ఘాట్ సమీపానికి చేరుకోవచ్చు. హైదరాబాద్ నుంచి 150 కి.మీలు ఉంటుంది   నల్లగొండ నుంచి హాలియా మీదుగా సాగర్‌కు చేరుకోవచ్చు. 60 కిలో మీటర్లు ఉంటుంది. వరంగల్ నుంచి జనగాం, భువనగిరి, రామన్నపేట, నార్కట్‌పల్లి, నల్లగొండ, హాలియా మీదుగా సాగర్ వరకు 237 కిలో మీటర్లు ఉంటుంది. ఖమ్మం నుంచి మిర్యాలగూడ, హాలియా మీదుగా సాగర్ వరకు 155 కిలో మీటర్లు ఉంటుంది  భక్తుల వాహనాలు, బస్సులు సాగర్‌కు 15 కిలో మీటర్ల దూరాన గల సమ్మక్క-సారక్క ఆలయ సమీపంలో నిలిపివేస్తారు. అక్కడ నుంచి స్పెషల్ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించారు.

 

16. సత్రశాల ఘాట్

నీటిస్థాయి: ప్రస్తుతం ఘాట్‌లకు 15 అడుగుల దూరంలో నీరు ఉన్నాయి.

ఆలయాలు: ప్రముఖ శైవ క్షేత్రం, శ్రీగంగా బ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి దేవాలయం,

సౌకర్యాలు: ఇక్కడ అన్ని కులాలకు సంబంధించిన సత్రాలు ఉన్నాయి. వీటితోపాటు పుష్కర నగర్ ఏర్పాటుచేశారు.

రవాణా సౌకర్యం: మాచర్ల నుంచి పాలువాయి జంక్షన్ మీదుగా సత్రశాలకు చేరుకోవచ్చు. గురజాల నుంచి రెంటచింతల మీదుగా సత్రశాలకు చేరుకోవచ్చు. బస్సు సౌకర్యం ఉంది.

 

 17. దైద ఘాట్

నీటి స్థాయి: ప్రస్తుతం పది అడుగుల దూరంలో నీరు ఉన్నాయి.

ఆలయాలు: ప్రముఖ శైవక్షేత్రమైన అమరలింగేశ్వరస్వామి దేవస్థానం ఉంది.

సౌకర్యాలు: ఇప్పటి వరకు 80శాతం పనులు పూర్తయ్యాయి. రోడ్ల నిర్మాణ పనులు చేపట్టారు.

రవాణా సౌకర్యం: గురజాల నుంచి పులిపాడు మీదుగా దైద పుష్కర ఘాట్‌కు చేరుకోవచ్చు. దాచేపల్లి నుంచి నడికుడి మీదుగా పులిపాడు నుంచి దైద పుష్కర ఘాట్‌కు చేరుకోవచ్చు. బస్సు సౌకర్యం ఉంది.

 

18. ఇర్కిగూడెం ఘాట్

నీటిస్థాయి : ప్రస్తుతం నీటి ప్రవాహం లేదు. ఘాట్‌కు ఏడు అడుగుల దూరంలో నీరు నిలిచి ఉంది.

పుణ్యక్షేత్రాలు : పార్వతీ దేవాలయం నిర్మాణంలో ఉంది. పుష్కరాల సమయం వరకు పూర్తి కానుంది.

సౌకర్యాలు-వసతులు : పార్కింగ్ స్థలం, మరుగుదొడ్లు, తాగునీటి వసతులు కల్పిస్తున్నారు.

రవాణా : మిర్యాలగూడ నుంచి ఆర్టీసీ బస్సు సౌకర్యం ఉంది.

 

19. పొందుగల ఘాట్

నీటి స్థాయి: ప్రస్తుతం ఎనిమిది అడుగుల దూరంలో నీరు  ఉన్నాయి.

ఆలయాలు: ఆంజనేయస్వామి దేవస్థానం ఉంది. దాచేపల్లి మండలంలో ఐదు పుష్కర ఘాట్‌లు ఉన్నాయి. 50శాతం పనులు మాత్రమే పూర్తయ్యాయి.

సౌకర్యాలు: పొందుగల ఘాట్ వద్ద పుష్కర నగర్‌ఏర్పాటు తోపాటు, ట్రాఫిక్‌కు ఇబ్బంది కలుగకుండా లింకు రోడ్లు ఏర్పాటు చేశారు.

రవాణా సౌకర్యం:  హైదరాబాద్ నుంచి మిర్యాల గూడ మీదుగా పొందుగల పుష్కర ఘాట్‌కు చేరుకోవచ్చు. గుంటూరు నుంచి దాచేపల్లి మీదుగా పొందుగల పుష్కర ఘాట్‌కు చేరుకోవచ్చు.  బస్సు సౌకర్యంతోపాటు, నడికుడి జంక్షన్ వరకు హైదరాబాద్ నుంచి గుంటూరు నుంచి రైలు సౌకర్యం ఉంది.

 

 

20. వాడపల్లి శివాలయం ఘాట్

నీటిస్థాయి : ప్రస్తుతం నీటి ప్రవాహం లేదు. ఘాట్‌కు పది అడుగుల దూరంలో నీరు నిలిచి ఉంది.

పుణ్యక్షేత్రాలు : వాడపల్లి శ్రీ మీనాక్షి అగస్తేశ్వరస్వామి, శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయాలు

సౌకర్యాలు-వసతులు : పార్కింగ్ స్థలం, మరుగుదొడ్లు, తాగునీటి వసతులు కల్పిస్తున్నారు.

రవాణా : రైలు ద్వారా వచ్చే భక్తులు విష్ణుపురం రైల్వేస్టేషన్‌లో దిగాలి. వారిని ప్రత్యేక ఆర్టీసీ బస్సులు ఇండియా సిమెంట్స్ ఎదుట ఉన్న హోల్డింగ్ పాయింట్ వద్దకు చేరుస్తాయి  మిర్యాలగూడ నుంచి ప్రతి ఐదు నిమిషాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం ఉంది. ప్రైవేటు వాహనాల ద్వారా వచ్చే వారు పోలీస్‌లు నిర్దేశించిన పార్కింగ్‌ల వరకూ రావాలి. అక్కడ నుంచి ఆర్టీసీ బస్సు సౌకర్యం వాడపల్లి హోల్డింగ్ పాయింట్ వరకు ఉంటుంది. హోల్డింగ్ పాయింట్ నుంచి ఘాట్‌కు 2 కి.మీ.ల దూరం ఉంటుంది.

 

21. మహంకాళి ఘాట్

నీటిస్థాయి : ప్రస్తుతం నీటి ప్రవాహం లేదు. ఘాట్‌కు 20 అడుగుల దూరంలో నీరు నిలిచి ఉంది.

పుణ్యక్షేత్రాలు : ఆంజనేయస్వామి, మహంకాళి ఆలయాలు

సౌకర్యాలు-వసతులు : పార్కింగ్ స్థలం, మరుగుదొడ్లు, తాగునీటి వసతులు కల్పిస్తున్నారు.

 రవాణా : మిర్యాలగూడ, కోదాడ నుంచి ఆర్టీసీ బస్సు సౌకర్యం ఉంది. ఘాట్‌కు పది కిలోమీటర్ల దూరం హోల్డింగ్ పాయింట్ వరకు ప్రయాణికులను చేరవేస్తారు. అక్కడి నుంచి ఆర్టీసీ స్పెషల్ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించారు.

 

22. మట్టపల్లి ప్రహ్లాద ఘాట్

నీటిస్థాయి : ప్రస్తుతం నీటి ప్రవాహం లేదు. ఈ ఘాట్‌లోకి కనీసం 80 నుంచి 100 అడుగుల లోతుకు దిగాలి. ప్రస్తుతం ఈ ఘాట్‌కు పదడుగుల దూరంలో నీరు నిలిచి ఉంది.

పుణ్యక్షేత్రాలు: లక్ష్మీనరసింహ క్షేత్రం, పార్వతీ రామలింగేశ్వరాలయం, గోదాదేవి, ఆంజనేయస్వామి ఆలయాలు

సౌకర్యాలు-వసతులు : అన్నదాన సత్రాలు ఉన్నాయి. 25 కిలో మీటర్ల దూరంలో ఉన్న హుజూర్‌నగర్‌లో  లాడ్జీల సౌకర్యం కలదు. పార్కింగ్ స్థలం, మరుగుదొడ్లు, తాగునీటి వసతులు కల్పిస్తున్నారు.

రవాణా : ప్రహ్లాద ఘాట్‌కు చేరుకునేందుకు రోడ్డు సౌకర్యం మాత్రమే ఉంది. హుజూర్‌నగర్ నుంచి మఠంపల్లి మీదుగా మట్టపల్లి ఊరు బయట వరకు రోడ్డు సౌకర్యం కలదు.

 

23. వేదాద్రి ఘాట్ (పంచారామ నరసింహ క్షేత్రం) జగ్గయ్యపేట మండలం

నీటి స్థాయి :  పది నుంచి 15 అడుగుల మేర నీరు ఉంది.

ఆలయం : యోగానంద లక్ష్మీనృసింహస్వామి ఆలయం

సౌకర్యాలు: పుష్కర భక్తులు సేదతీరేందుకు తాత్కాలిక షెడ్లు ఏర్పాటు చేస్తున్నారు.

రవాణా సౌకర్యం : హైదరాబాద్ నుంచి వచ్చే భక్తులు జగ్గయ్యపేట లేదా చిల్లకల్లు నుంచి వేదాద్రి చేరుకోవాల్సి ఉంటుంది. చిల్లకల్లు నుంచి 12 కి.మీ, కొణకంచి అడ్డరోడ్డు నుంచి 18 కి.మీ దూరం. బస్సులు, ఆటోలు ఉంటాయి.

 

24. ముక్త్యాల ఘాట్ ( కృష్ణానది ఉత్తర వాహినిగా ప్రవహిస్తోంది) జగ్గయ్యపేట మండలం

నీటిస్థాయి : 15 నుంచి 20 అడుగుల మేర ఉంది.

ఆలయం: భవానీ ముక్తేశ్వరస్వామి దేవాలయం

సౌకర్యాలు: తాత్కాలిక షెడ్లు, దుస్తులు మార్చుకొనేందుకు గదులున్నాయి.

రవాణా సౌకర్యం: హైదరాబాద్ నుంచి 220 కి.మీ దూరం. జగ్గయ్యపేట నుంచి పది కిలోమీటర్లు. బస్సు సౌకర్యం తక్కువ. ఆటోలపైనే ఆధారపడి ప్రయాణం చేయాల్సి ఉంటుంది.

 

25. ధరణి కోట ఘాట్ (అమరావతి)

నీటి  స్థాయి: పుష్కర ఘాట్ నుంచి 150 అడుగుల వరకు నీరు లేదు.

ఆలయాలు: అమరలింగేశ్వరస్వామి దేవస్థానం ఉంది. ధ్యానబుద్ధ విగ్రహం ఉంది.

సౌకర్యాలు: ఈఘాట్ మొత్తం 1.3 కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. గుంటూరు జిల్లాలోనే అతి పెద్ద ఘాట్. రోజుకు రెండున్నర లక్షల మంది భక్తులు వస్తారనే అంచనాతో, అందుకు తగ్గట్లుగా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మూడు పుష్కర నగర్‌లు ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే సత్తెనపల్లి, విజయవాడ, గుంటూరు రోడ్లను విస్తరించారు. ట్యాంక్ బండ్ తరహాలో టూరిజం వారు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక్కడ పిండప్రదానం షెడ్లు నిర్మిస్తున్నారు. అమరావతిలోకి వెళ్లకుండా రింగ్ రోడ్డు ఏర్పాటు చేశారు. హైమాస్ లైట్లతో ప్రత్యేక లైటింగ్ ఏర్పాటు చేశారు.

రవాణా సౌకర్యం: గుంటూరు 35 కిలో మీటర్లు, విజయవాడ నుంచి 35 కిలోమీటర్లు, సత్తెనపల్లి 50 కిలోమీటర్లు ఉంటుంది. గుంటూరు వరకు రైలు సౌకర్యం ఉంది. విజయవాడ నుంచి అమరావతి వెళ్ళే యాత్రికులు తాడేపల్లి కరకట్ట మీదుగా రాయపూడి అడ్డరోడ్డు నుంచి అమరావతి చేరుకునే వీలుంది. బస్సు సౌకర్యం అధికంగా ఉంది.

 

26. హరిశ్చంద్రాపురం ఘాట్ (తుళ్ళూరు మం.)

నీటి స్థాయి: ప్రస్తుతం కృష్ణా నదిలో నీటి ప్రవాహం ఎక్కువగా ఉంది. దీనికి 10 కిలోమీటర్ల ముందు ప్రకాశం బ్యారేజ్ వాటర్ స్టోరేజ్ ఉండంతో నీరు ఎప్పుడు అందుబాటులో ఉంటుంది.

ఆలయాలు-ఇక్కడ అమరావతి మండలంలోని వైకుంఠపురం వెంకటేశ్వరస్వామి దేవాలయంకు అనుబంధంగా ఉన్న అలివేలు మంగ అమ్మవారి దేవాలయం ఉంది

 సౌకర్యాలు: పుష్కర ఘాట్లను నిర్మించి అక్కడ షెడ్లు ఏర్పాటు చేస్తున్నారు. 150 మీటర్ల ఘాట్‌ను రూ 1.50 కోట్లతో నిర్మిస్తున్నారు.

రవాణా సౌకర్యం: విజయవాడ నగరం నుంచి కృష్ణానదీ కరకట్ట మీదుగా 25 కిలోమీటర్లు  గుంటూరు నగరం నుంచి తుళ్ళూరు మీదుగా హరిశ్చంద్రాపురానికి 46 కిలోమీటర్ల దూరం, ఆర్టీసీ బస్సు సౌకర్యం ఉంది.

 

27. పవిత్ర సంగమం ఘాట్  (ఇబ్రహీంపట్నం మండలం)

నీటి స్థాయి:  పోలవరం కుడి ప్రధాన కాల్వ నుంచి గోదావరి నీటిని కృష్ణమ్మకు కలిపే బుదమేరు డైవర్షన్ కెనాల్ వద్ద కొత్తగా 250 మీటర్ల పొడవైన ఘాట్ ఏర్పాటు చేశారు.  

సౌకర్యాలు: స్నానాలకు ప్రత్యేక ప్లాట్‌ఫారంలు ఏర్పాటు చేస్తున్నారు.

రవాణా సౌకర్యాలు: ఇబ్రహీంపట్నం సర్కిల్ నుంచి పవిత్రసంగమం వరకు  1.6 కి.మీ. పొడవైన 4 లైన్ల రోడ్డును నిర్మిస్తున్నారు. విజయవాడ హైదరా బాద్ రూట్ నుంచి వెళ్లే వారు ఈ మార్గంలో పవిత్ర సంగమానికి వెళ్లవచ్చు.

8 నమూనా దేవాలయాలు ఏర్పాటు: ఇక్కడ 25ఎకరాల స్థలంలో రాష్ట్రంలో ప్రముఖమైన 8 నమూనా దేవాలయాలు ఏర్పాటు చేస్తున్నారు. శ్రీశైలం మల్లికార్జునుడు, అనంతపురం జిల్లా కదిరి లక్ష్మీనరసింహస్వామి, కాణిపాకం వరసిద్ధి వినాయకుని ఆలయం, విజయవాడ ఇంద్రకీలాద్రిలో ఉన్న కనకదుర్గ ఆలయం, శ్రీకాకుళంలో ఉన్న కూర్మసిద్ది దేవాలయం, తూర్పుగోదావరి జిల్లా బిక్కఓలులో సుబ్రమణ్యేశ్వర ఆలయం, మచిలీపట్నంలో పాండురంగనాధ స్వామి ఆలయం, విజయనగరం జిల్లా రామతీర్ధంలో రామనాధస్వామి వారి ఆలయం, ఏర్పాటు చేస్తున్నారు.

 

28. తాళ్ళయ్యపాలెం ఘాట్ (తుళ్ళూరు మం.)

నీటిస్థాయి: కృష్ణా నది దిగువ ప్రాంతం కావటంతో నీరు పుష్కలంగా ఉంది. 25 నుంచి 35 అడుగుల లోతు ఉంటుంది

ఆలయాలు: శ్రీ శైవ క్షేత్రం ఉంది. 1,116 శివలింగాలు, పాదరస శివలింగం ఉన్న క్షేత్రం ఇది.

సౌకర్యాలు: పుష్కర ఘాట్లను 455 మీటర్ల పొడవునా రూ 4.5 కోట్లతో నిర్మిస్తున్నారు. అలాగే షెడ్లు ఎర్పాటు, తాత్కాలిక గదులు నిర్మిస్తున్నారు.

రవాణా సౌకర్యం: విజయవాడ నగరం నుంచి కరకట్ట మీదుగా 9 కిలోమీటర్లు. అలాగే మంగళగిరి నుంచి 21 కిలోమీటర్లు, గుంటూరు నుంచి 39 కిలోమీటర్లు. బస్సు సౌకర్యం ఉంది.

 

29. ఫెర్రీ ఘాట్

ఏరియా: పవిత్ర సంగమానికి అనుకుని హారతి పెవిలియన్ దాటిన తర్వాత 750 మీటర్ల పొడవైన ఫెర్రీఘాట్ నిర్మాణం చేశారు.

 నీటిస్థాయి: పోలవరం కుడి కాలువ నుంచి గోదావరి నీటిని కృష్ణమ్మకు కలిపే బుడమేరు డైవర్షన్ కెనాల్ వద్ద నుంచి నీటిని మళ్ళిస్తారు.

 రవాణా సౌకర్యాలు: ఇబ్రహీంపట్నం సర్కిల్ నుంచి పవిత్రసంగమం సుమారు 1.6 కి.మీ. పొడవైన 4లైన్ల రోడ్డును కొత్తగా నిర్మిస్తున్నారు.  విజయవాడ, హైరరాబాద్ నుంచి యాత్రీకులు ఇబ్రహీంపట్నం సర్కిల్‌కు చే రుకోవచ్చు.

 

30. మహాఘాట్ (విజయవాడ నగరం)

పున్నమి, భవానీఘాట్‌లు కలిపి మహాఘాట్‌గా నామకరణం చేశారు.

పున్నమి  ఘాట్: విజయ డైరీ ఇన్‌టేక్‌వెల్ నుంచి పున్నమి రెస్టారెంట్ గోడ వరకు విస్తరించిన ఈ ఘాట్ పొడవు 400 మీటర్లు.

 నీటిస్థాయి: మహాఘాట్  ప్రకాశం బ్యారేజి నుంచి ప్రత్యేక కాలువను తవ్వి నీటిని మళ్ళిస్తారు. షవర్ స్నానం చేసే విధంగా ఏర్పాట్లు చేశారు.

రవాణా సౌకర్యాలు: విజయవాడ రైల్వేస్టేషన్ నుంచి ప్రత్యేక సిటీ బస్సులు ఈ ఘాట్ వరకు నడుపుతారు.  

 

31. సీతానగరం పుష్కర ఘాట్ (తాడేపల్లి మం.)

నీటి స్థాయి: ప్రకాశం బ్యారేజ్ ప్రాంతం కావటంతో నీటి నిల్వ పర్వాలేదు. ప్రస్తుతం 6.3 మీటర్ల మేర నీటి నిల్వ ఉంది.

ఆలయాలు: సీతానగరంలో ఆంజనేయస్వామి దేవస్థానం, ప్రాచీన శివాలయాలు రెండు, ఉండవల్లిలో అనంతపద్మనాభస్వామి దేవాలయం ఉన్నాయి.

 సౌకర్యాలు: రూ 6.50 కోట్లతో 450 మీటర్ల వెడల్పుతో ఘాట్‌ను నిర్మిస్తున్నారు. గుంటూరు నుంచి 27 కిలోమీటర్లు, విజయవాడ నుంచి 3 కిలోమీటర్ల దూరంలో ఉంది. రెండు ప్రాంతాల నుంచి బస్సు సౌకర్యం ఉంది.

 

 

32. దుర్గా ఘాట్ (విజయవాడ నగరం)

ఏరియా: ప్రకాశం బ్యారేజి నుంచి కనకదుర్గ అమ్మవారి గాలిగోపురం వరకు ఇది విస్తరించి ఉంది. దీని పొడవు 325 మీటర్లు.  

నీటిస్థాయి: ప్రకాశం బ్యారేజి నుంచి కాలువ తవ్వి నీటిని మళ్ళిస్తారు.

సౌకర్యాలు: ఈ ఘాట్‌లో పుణ్యస్నానాలు ఆచరించే భక్తులు మునక వేసేందుకు 25 మీటర్ల వెడల్పు, ఉన్న చప్టాలు నిర్మించారు.

 

33. కృష్ణవేణి ఘాట్ (విజయవాడ నగరం)

నీటి స్థాయి: ఇక్కడ జల్లు స్నానం (షవర్‌బాత్) ఏర్పాటు చేశారు. ప్రకాశం బ్యారేజి నుంచి స్లూయిస్ ఏర్పాటు చేసి  10 మీటర్ల వెడల్పున ఒక ప్రత్యేక కాలువ తవ్వారు. ఈ కాల్వద్వారా బ్యారేజి నుంచి స్లూయిస్ ద్వారా  నిరంతరం నీటిని సరఫరా చేస్తారు. ఇక్కడ 4అడుగుల లోతున పరిశుభ్రమైన నీటిని నిరంతరం వదులుతారు.

సౌకర్యాలు: తాత్కాలిక టెంట్‌లు ఏర్పాటు చేస్తున్నారు.  

రవాణా సౌకర్యాలు: విజయవాడ రైల్వే స్టేషన్ నుంచి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు.

విస్తీర్ణం: రైల్వే బ్రిడ్జి నుంచి ప్రకాశం బ్యారేజ్ వరకు విస్తరించిన ఘాట్ ఇది. దీని పొడవు 750 మీటర్లు

 

34. పద్మావతి ఘాట్ (విజయవాడ నగరం)

నీటిస్థాయి: జల్లు స్నానం ఏర్పాటు చేశారు. ప్రకాశం బ్యారేజి నుంచి కాలువ తీసి నాలుగు అడుగుల లోతులో గుంట స్నానానికి ఏర్పాట్లు చేశారు. ఘాట్ పొడవు 1.1కి.మీ.

దేవాలయం:  ఇష్టకామ్యార్ధ నాగేశ్వరస్వామి ఆలయం.

సౌకర్యాలు: తాత్కాలిక టెంట్‌లు ఏర్పాటు చేస్తున్నారు.

రవాణ సౌకర్యాలు: విజయవాడ పండిట్ నెహ్రూ బస్టాండ్ దిగిన ప్రయాణికులు నడక మార్గంలో వెళ్ళవచ్చు. విజయవాడ రైల్వే స్టేషన్‌లో దిగిన యాత్రికులు సిటీ బస్సుఎక్కి పండిట్ నెహ్రూ బస్టాండ్ వద్ద దిగవచ్చు.

 

35. చిలుమూరు పుష్కర ఘాట్ (కొల్లూరు మండలం)


నీటి స్థాయి: కృష్ణా నదిలో ప్రస్తుతం నీరు లేదు. పుష్కరాలకు నీరు వదిలినప్పటికీ నీటి లభ్యత తక్కువ ఉంటుంది.

ఆలయాలు: ప్రాచీన ఉభయ రామలింగేశ్వరస్వామి దేవస్థానం ఉంది

సౌకర్యాలు: 20 మీటర్ల ఘాట్‌ను రూ.21 లక్షలతో నిర్మిస్తున్నారు.

రవాణా సౌకర్యం: గుంటూరు జిల్లా తెనాలి నుంచి 15 కిలోమీటర్ల దూరంలో ఉంది. బస్సు, ఆటోల సౌకర్యం ఉంది.

 

36. పెదకళేపల్లి ఘాట్ (దక్షిణ కాశీగా ప్రసిద్ధి) (మోపిదేవి మండలం)

నీటిస్థాయి:  నీరు పుష్కలంగా ఉంది. సుమారు 40 అడుగుల మేర ఉంది. ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా  ప్రమాదాలు జరగకుండా బారికేడ్లు ఏర్పాటు చేశారు.

ఆలయం : దుర్గా నాగేశ్వరస్వామి ఆలయం

సౌకర్యాలు:  ఘాట్ ఆధునీకరణ పనులు చేస్తున్నారు. భక్తులు సేదతీరేందుకు షెడ్లు ఏర్పాటు చేశారు.

రవాణా సౌకర్యం :  పెదకళేపల్లి నుంచి 2 కి.మీ మేర ఆటోల్లో ఘాట్‌కు చేరుకోవచ్చు.

 

37. పెనుమూడి ఘాట్ (రేపల్లె మండలం)

నీటి స్థాయి: కృష్ణా నది చివరి ప్రాంతం కావటంతో నీరు లేదు. పుష్కరాలకు బ్యారేజ్ విడుదల చేస్తే నీరు విడుదల చేస్తే ఐదు అడుగుల మేర ఉంటుంది.

ఆలయాలు: మోర్తట శ్రీ ముక్తేశ్వర స్వామి దేవాలయం

సౌకర్యాలు: 500 మీటర్ల ఘాట్‌ను ఆరు కోట్లతో నిర్మిస్తున్నారు.

రవాణా సౌకర్యం: రేపల్లె నుంచి పెనుమూడి మూడు కిలోమీటర్ల దూరంలో ఉంది. రేపల్లె నుంచి ఆటోలు, బస్సు సౌకర్యం ఉంది. గుంటూరు నుంచి 70 కిలోమీటర్ల దూరంలో ఉంది.

 

38.  కొత్తపేట ఘాట్ (అవనిగడ్డ మండలం)

నీటిస్థాయి : నీటి నిల్వలు 5 అడుగుల మేర మాత్రమే ఉంది.

ఆలయం: రెండు కి.మీ దూరంలో లక్ష్మీనరసింహస్వామి ఆలయం ఉంది.

సౌకర్యాలు: భక్తుల సౌకర్యార్థం ఘాట్‌ను ఆధునీకరించారు. షెడ్లు ఏర్పాటు చేశారు.

రవాణా సౌకర్యం: ఆటోలు, బస్సుల్లో ఘాట్ వద్దకు చేరుకొనే అవకాశం ఉంది.

 

39. శ్రీపాదక్షేత్రం ఘాట్ (త్రివేణి సంగమం) (నాగాయలంక)

నీటిస్థాయి : 30 అడుగుల మేర నీరు పుష్కలంగా ఉంది.

సౌకర్యాలు : భక్తులకు ఉపయోగపడేలా షెడ్లు ఏర్పాటు చేశారు.

రవాణా సౌకర్యం: విజయవాడ, మచిలీపట్నం నుంచి బస్సు సౌకర్యం ఉంది. నాగాయలంక ప్రధాన క్షేత్రం నుంచి ఘాట్‌కు అర కి.మీ ఉంటుంది. ఆటోలు, ద్విచక్రవాహనాలపై చేరుకోవచ్చు.

 

 

 40. సంగమ ప్రదేశం ఘాట్ (కోడూరు మండలం)

నీటిస్థాయి: నది, సముద్రం సంగమ ప్రదేశం

ఆలయాలు: హంసలదీవి దుర్గామల్లేశ్వర స్వామి దేవాలయం

సౌకర్యాలు: స్నానాలకు ఎర్పాటు చేశారు. ఘాట్ల నిర్మాణం లేదు.

రవాణా సౌకర్యం: అవనిగడ్డ నుంచి 25 కిలోమీటర్ల దూరం. బస్సు, ఆటోలు ఉన్నాయి.

 

 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top