సీతమ్మవారి పుట్టిల్లు
నేపాల్ రాజధాని ఖట్మండూలో ఈ నెల 26, 27 తేదీలలో జరుగనున్న ‘సార్క్’ దేశాల 18వ సమావేశంలో పాల్గొనేందుకు భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 25న జనక్పూర్ మీదుగా వెళ్లనుండడంతో ఆ ఆధ్యాత్మిక, చారిత్రక పట్టణంలోని ఆలయాలన్నీ దివ్యాలంకరణలతో శోభిల్లనున్నాయి. ప్రధానంగా జనక్పూర్లోని జానకీ మందిరాన్ని మోడీ సందర్శించనున్నారని తెలియడంతో స్థానిక అధికార యంత్రాంగం, జానకీ మందిరం ఆలయ కార్యనిర్వాహకులు ఆలయాన్ని, పరిసరాలను తీర్చిదిద్దుతున్నారు.
జనక్పూర్నే జనక్పూర్థామ్ అని పిలుస్తారు. ఖట్మండూకు నైరుతి దిశగా 123 కి.మీ. దూరంలో ఈ పట్టణం నెలకొని ఉంది. హిందువులు ఈ పట్టణాన్ని సీతమ్మవారి జన్మస్థలంగా విశ్వసిస్తారు. ఇందుకు సంబంధించిన స్థల పురాణం రామాయణంలో ఉంది. జనకుడు విదేహ రాజ్యాన్ని (ప్రస్తుత నేపాల్ అందులో భాగమే) పాలిస్తున్నప్పుడు, సీతమ్మవారు పసికందుగా అక్కడి పొలాల్లో దొరుకుతుంది. జనకుడు ఆమెను తెచ్చుకుని, పెంచి పెద్దచేస్తాడు. విదేహ యువరాణిగా ప్రకటిస్తాడు. అక్కడే సీతమ్మవారికి శ్రీ రాముడితో వివాహం జరుగుతుంది. నాటి నుంచి జనక్పూర్ ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా భాసిల్లుతోంది.