రాళ్లుతున్నాయి

రాళ్లుతున్నాయి


జక్కన్నక్కూడా అంతుబట్టేది కాదేమో!

డాక్టర్‌లు, సైంటిస్టులైతే బోల్తా కొట్టేశారు.

రాళ్లలో నీళ్లు, రాళ్లలో కప్పల్దాకా విన్నాం.

ఇదిగో ఇప్పుడు నీళ్లలో రాళ్లు.

కన్నీళ్లు... ‘రాళ్లు’తున్నాయి.

మాయ చేయడానికి ఏ రాయి అయితేనేం?!


 


ఏడాదిగా అందరి దృష్టిలో పడిన తుళ్లూరుకు పొరుగున ఉంది రాయపూడి గ్రామం. కృష్ణాతీరం. రేగడి నేలలు. పంట వేస్తే బ్యాంకులో డబ్బు వేసుకున్నట్లే. రైతుకు మినిమమ్ గ్యారంటీ. రాయపూడి జామతోటలూ అలాంటివే. అందులో ఓ జామతోటలో కోటయ్య కుటుంబం నివసిస్తోంది. కోటయ్యకు భార్య సులోచనమ్మ, ముగ్గురు పిల్లలు. పెద్దమ్మాయి నవనీతకు పద్నాలుగేళ్లు. ఊళ్లో ఉన్న ప్రాథమిక పాఠశాలలో ఐదవ తరగతి వరకు చదువుకున్న నవనీత అంతటితో బడి మానేసి ఇంటి పనులు అలవాటు చేసుకుంది. చిన్న పిల్లలు బడికి పోతున్నారు. అత్యంత సాధారణమైన జీవితం వారిది. అలాంటి కుటుంబం ఒక్కసారిగా ఊరందరి దృష్టిలో పడింది.


  


‘‘లక్ష్మక్కా! మనసేం బాగా లేదే. ఓ సారి జామతోటకెళ్లొద్దాం. రారాదూ!’’ బతిమాలుతోంది పుష్పలత. ‘‘జామతోటకెందుకే’’ లక్ష్మి గొంతులో భయం. ‘‘ప్రశ్న చెప్పించుకుందామని’’ నసిగింది పుష్ప.‘‘ప్రశ్న చెప్తారా! ఎవరు చెప్తున్నారు?’’ లక్ష్మికి అయోమయం వీడ లేదు. ‘‘ఆ... నిజమే... నీకు తెలీదులే... నువ్వీమధ్య ఊళ్లో లేకపోతివి మరి. జామతోటల్లో ఉండే కోటయ్య కూతురు నవనీతకు అమ్మోరు పూనుతోందట. మన కష్టం ఏంటో మన ముఖం చూసి చెప్పేస్తోందట. చేతబడి చేసినా, దెయ్యం పట్టినా ఇట్టే కనిపెట్టేస్తోంది. పౌర్ణమి నాడు చాలా మంది వెళ్లారు. మా ఆయన... ‘దెయ్యం లేదు, చేతబడి లేదు... నోర్మూసుకో’ అని కసురుకున్నాడు’’ అన్నది పుష్పలత బుంగమూతి పెట్టి. ‘‘సర్లే... సర్లే... ముఖం అలా పెట్టకు. రేపొద్దున పోదాం’’ అనునయించింది లక్ష్మి.


  


నవనీత పరధ్యానంగా కూర్చుని ఉంది. పక్కనే పసుపు, కుంకుమ, కొబ్బరికాయలు, కర్పూరం, తమలపాకులు, అరటికాయలు. కళ్లు మూసుకుంటోంది. కొద్ది క్షణాల్లోనే కళ్లను విప్పార్చి తెరిచి చేత్తో తడుముకుంటోంది. వెంటనే నిస్సత్తువగా తలను పక్కకు వాలుస్తోంది.‘‘పుష్పా! ఏమైందా అమ్మాయికి’’ తల పక్కకు వాల్చి పుష్పలత చెవిలో గుసగుసగా అడిగింది లక్ష్మి. ‘‘ష్! అరవకక్కా, ఆ అమ్మాయికి కళ్లు గిర్రున తిరుగుతాయి... అప్పుడు కళ్ల నుంచి రాళ్లు వస్తాయి. వెంటనే పూనకం వస్తుంది. మనం చప్పుడు చేయకూడదు’’ నోటి మీద వేలినుంచి లోగొంతుకతో చెప్పింది పుష్పలత.


 

ఆమె అన్నట్లే పది నిమిషాలకు నవనీత ఒక్కసారిగా ‘‘అమ్మా!’’ అంటూ కంటి మీద చేయి పెట్టుకుంది నవనీత. కొద్దిక్షణాల పెనుగులాట తర్వాత ఆమె కంటి మీద నుంచి చేతిని తీసి, అరచేతిలో చూసుకున్నది. రెండు మిల్లీమీటర్ల వ్యాసంతో చిన్న రాయి. బియ్యంలో ఉండే రాళ్లలాగ ఉందా రాయి. కోటయ్య వచ్చి ఆ రాయిని తీసుకుని జాగ్రత్తగా పక్కనే ఉన్న పళ్లెంలో పెట్టాడు. ఆ పళ్లెంలో అప్పటికే ఆరు రాళ్లున్నాయి. ‘‘కళ్లు మూసుకుని ధ్యానం చేసుకోమ్మా’’ అని నవనీతను సరిగా కూర్చోబెట్టి, భార్యను పిలిచాడు. సులోచన వచ్చి నవనీత పక్కనే ఆమెకు ఆసరాగా కూర్చుంది. పుష్పలత ఇక ఆగలేకపోయింది. ‘‘ఇక ప్రశ్న అడగొచ్చా’’ అన్నది ఉద్వేగంగా.


 

కళ్లతోనే బదులిచ్చింది సులోచన. నవనీత ఎదురుగా కూర్చుంది పుష్పలత. ‘‘పూజ వస్తువులు పెట్టి పూజించుకో’’ సులోచన మెల్లగానే అన్నప్పటికీ గొంతులో ఆదేశమే ధ్వనిస్తోంది. పుష్పలత ఉత్సాహంగా తాను తెచ్చిన పూజ సామగ్రితో పళ్లెంలో ఉన్న ఒక సాలగ్రామ రూపానికి పూజ చేసింది. కొబ్బరికాయ కొట్టడానికి రాయి వంటిది ఉందేమోనని చుట్టూ చూసింది. ‘‘ఆ గోడ పక్కన రాయి ఉంది. అక్కడ కొట్టి తీసుకురా’’ అంటూ కొబ్బరికాయ కొట్టాల్సిన ప్రదేశాన్ని చూపించింది సులోచన పుష్ప వెళ్లి ఆ రాయి మీద కొబ్బరికాయ కొట్టి తెచ్చి పళ్లెంలో పెట్టి భక్తిగా కళ్లు మూసుకుంది. అప్పుడు నోరు విప్పింది నవనీత. ‘‘నీకు ఇంట్లో శాంతి లేదు. సంతోషం లేదు. ఇల్లు ఉంది. పొలం ఉంది. డబ్బు ఉంది. అయినా సంతోషం అనేదే లేని జీవితం గడుపుతున్నావు’’ ఏదో లోకంలో ఉండి మాట్లాడుతున్నట్లు ఉంది నవనీత గొంతు. ఆ మాటలు వినగానే పుష్పలత కళ్లలో నీళ్లు గిర్రున తిరిగాయి. ఏమి అడగాలో కూడా తెలియని అయోమయంతో బేలగా మారిపోయింది. లక్ష్మి పుష్ప భుజం చుట్టూ చేయి వేసి... ‘‘ఎందుకలా అవుతోంది’’ అన్నది మెల్లగా నవనీతతో. ‘‘అంతా ఇంట్లో వాళ్లే... ’’ అంటూ పూనకంలోనే పక్కకు వాలిపోయింది నవనీత.


 

‘‘నిన్ను చానా గట్టి పీడ తగులుకుంది. ఐదు వారాలు పూజలో కూర్చోమ్మా. అమ్మోరు దారి చూపకపోదు’’ అన్నది సులోచన. అలాగేనన్నట్లు తలూపి  అక్కడి నుంచి లేచింది పుష్పలత. ‘‘అక్కా... మనూర్లో కొత్తగా హాస్పిటల్ పెట్టిన డాక్టర్ వచ్చి అదేమైనా జబ్బేమోనని చూసాట్ట. ఎంత పరీక్ష చేసినా ఆయనకేమీ పాలుపోక సైన్స్‌లో ఇలాంటిది చూడనేలేదన్నాట్ట. అంతా మహిమ కాకపోతే మరేంటి’’ తన నమ్మకాన్ని తానే బలపరుచుకుంటోంది పుష్పలత. ‘‘అక్కా నిజంగానే నా పీడ వదులుతుందంటావా? ఇక్కడికి వచ్చిన వాళ్లందరికీ రెండు- మూడు వారాల్లోనే అమ్మోరు పలుకుతోంది. నాకు నాలుగు వారాలైనా ఏమీ చెప్పలేదు’’ బేలగా లక్ష్మిని అడిగింది పుష్పలత. ఆమె కళ్లు నీటి కుండల్లా ఉన్నాయి. ‘‘ఇంకెంత ఒక్క వారమే కదా! ఓపిక పట్టు. అయినా నీకొచ్చిన కష్టమేంటే. మనశ్శాంతి లేదని బాధపడతావు. తిండికి కరువా, బట్టకు కరువా? పొలం పోయి నడుం విరిగేలా పనులు చేస్తే కానీ జరగని పరిస్థితి ఉందా? అసలు నిన్ను ఇంట్లో ఎవరు కష్టపెడుతున్నారు చెప్పు’’ మందలింపుగా అన్నది లక్ష్మి.‘‘మా ఆయన నన్ను ఇంట్లో నోరెత్తనివ్వడు తెలుసా?’’ నిష్టూరంగా అన్నది పుష్పలత.‘‘...’’ ఏదో మాట్టాడబోయి అంతలోని విరమించున్నది లక్ష్మి. ‘‘సర్లే! ఒక్కవారం ఓపిక పట్టు. నాకు ఇంట్లో పనుంది వెళ్తా’’ అని లేచింది లక్ష్మి.


  


లక్ష్మి ఇంటికి పుష్పలీల ఆదుర్దాగా వచ్చింది. ‘‘అక్కా! ఏం జరిగిందో తెలుసా?’’ అంటూ వరండాలో స్తంభానికి ఆనుకుని కూలబడింది.వంట చేసుకుంటున్న లక్ష్మి కంగారుగా బయటకొచ్చి ‘‘ఏమైందే పుష్పా! అలా ఒగరుస్తున్నావ్’’ అడిగింది ఆందోళనగా.‘‘ఆ కోటయ్య కూతురు నవనీత లేదూ... అదేనక్కా... పూనకం వచ్చే నవనీత... దెయ్యాలు పోగొట్టే నవనీత... మనం వెళ్లట్లేదూ... జామతోటలో... అంతా ఒట్టి మోసమేనట... ’’ వాక్యమంతా పలికే స్థిమితం లేక అంతా ఒక్కసారే చెప్పేయాలని పదాలకు పొంతన లేకుండా చెప్తోంది పుష్పలత. ‘‘నిన్న తోటకి దెయ్యాల్లేవని చెప్పే టీచర్లొచ్చార్ట. వాళ్ల ముందు అంతా బయటపడిపోయింది. మనం మొద్దుల్లాగ వాళ్లేం చెబితే అదే నమ్మాం’’ చెప్పుకుపోతోంది.‘‘ముందీ నీళ్లు తాగు. నీ ఆదుర్దా నువ్వూను’’ అంటూ కసురుతూ నీళ్లిచ్చింది లక్ష్మి. మంచినీళ్లు తాగి, ‘‘నిన్న ఏమైందంటే...’’ అంటూ అంతా పూస గుచ్చింది.


 

‘‘నిన్న మధ్యాహ్నం టీచర్లు నవనీత ఎదురుగా కూర్చుని రాళ్లెలా వస్తాయో చూపించమన్నారు. ‘చూస్తూ కూర్చుంటే రాళ్లు బయటకు రావు. అమ్మాయి తన పనిలో తానున్నప్పుడు వస్తాయి’ - అన్నాట్ట కోటయ్య. కొంతసేపటికి నవనీత ముఖం కడుక్కుని, పౌడర్ రాసుకుని, బొట్టు, కాటుక పెట్టుకుని... తల దువ్వుకుంటూ ‘అబ్బా!’ అంటూ రాళ్లను చూపించింది. అప్పుడు టీచర్లు... ఆ అమ్మాయి చేతిని తెరిచి చూపించమన్నార్ట. మోసం బయటపడింది. ఎంత మోసం’’ గుండెల మీద చేయి వేసుకుంటూ అన్నది పుష్పలత.


 

‘‘నాకు ముందు నుంచి అనుమానమే. నీ ఏడుపు చూళ్లేక వచ్చా. అయినా అంతటితో వదిలేశారా వాళ్లను. పోలీసులకు పట్టిస్తే పోయేది. ఊరందరినీ ఎంతగా మోసం చేశారు?’’ ఆవేశపడుతోంది లక్ష్మి.  ‘‘ఇలా మోసం చేయడం తప్పని, ఇంకా ఇలాగే చేస్తే పోలీసులకు పట్టిస్తామని, ఈ పనులు మానుకోమని కోటయ్యకు, సులోచనకు గడ్డి పెట్టారు. ఇంకో సంగతక్కా... నవనీత ఏం చెప్పాలో కూడా సులోచనే చెవిలో చెప్పేదట. ఊళ్లో ఎవరికే కష్టం ఉందో తెలిసే ఉంటుంది కదా’’ అంటూ ఆలోచనలో పడింది పుష్పలత. మోసపోయాననే ఉడుకుమోత్తనంతోపాటు, మోసం బట్టబయలైనందుకు సంతోషంగానూ ఉంది ఆమె ముఖం.

గమనిక: పేర్లు మార్చడమైంది


 


 


గంటల్లోనే ఛేదించాం!

నేనప్పుడు అదే గ్రామంలోని గురుకుల పాఠశాలలో పని చేస్తున్నాను. స్కూలు పిల్లల ద్వారా విషయం తెలిసింది. పిల్లల మాటల మీద కేసు టేకప్ చేయలేం. మూడు వారాలపాటు గమనించాను. అదే గ్రామంలో ఫ్యాన్సీ షాప్ నడిపే మిత్రుడు రామ్మూర్తిని, మరికొందరిని అడిగి నిర్ధారించుకున్నాను. తర్వాత ఓ రోజు స్నేహితులం నలుగురం కోటయ్య ఉండే జామతోటకు వెళ్లాం. అదే రోజు నాలుగైదు గంటల్లోనే ఏం జరుగుతోందో, ఎలా జరుగుతోందో మాకు అవగాహనకు వచ్చింది. ఆ రోజుతోనే ఆ మోసానికి అడ్డుకట్ట పడింది.


 - బి. సాంబశివరావు, కోశాధికారి, మానవ వికాస వేదిక


 


రాళ్లెలా వచ్చాయి!

కళ్ల నుంచి రాళ్లు రావడం అనేది పూర్తిగా అబద్ధం. నవనీత గోళ్లలో, చేతి వేళ్ల మధ్య రాళ్లను దాచి ఉంచేది. ఉన్నట్లుంది కన్ను పట్టుకుని బాధ నటిస్తూ రాయిని తీసేది. కోటయ్య ఇదంతా దైవత్వమేననే ప్రచారం చేశాడు. గట్టిగా నిలదీసే సరికి తండ్రే అలా చేయమన్నాడని నవనీత ఒప్పుకుంది. ఇలా ఎందుకు చేశావని అడిగితే కోటయ్య నీళ్లు నమిలాడు. సులోచన మాత్రం ‘ఆడపిల్ల పెళ్లికొచ్చింది. మేమిక్కడ తోటల్లో ఉంటాం. పిల్ల మీద ఎవరి కన్ను పడినా బతుకు బుగ్గిపాల్చేస్తారు...’ అంటూ నసిగింది. మొదట విశ్వాసాన్ని రక్షణ కవచం కోసం ఏర్పరుచుకున్నారు. క్రమంగా పాపులారిటీ పెరగడం, డబ్బు రావడంతో వారిలో స్వార్థం చోటుచేసుకున్నది.

 - వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top