ఇట్లు.. ఇలియాస్ -జ్యోత్స్న

ఇట్లు.. ఇలియాస్ -జ్యోత్స్న


ఆకాశవాణిలో అనౌన్సర్లుగా ప్రారంభమైన ఇలియాస్, జ్యోత్స్నల జీవితం దాంపత్యబంధంగా మారింది. మతాలు వేరైనా తమ మనసులనొక్కటి చేసింది రేడియోనే అంటున్న ఈ దంపతులు... రిటైర్ అయ్యాక కూడా ఇప్పటికీ సీరియళ్లకు డబ్బింగ్ చేయిస్తూ, లైఫ్‌ను బిజీగా గడుపుతున్నారు. ప్రముఖ రేడియో కళాకారిణి శారదా శ్రీనివాసన్‌తో వారి సంభాషణ... నాటి జ్ఞాపకాలను గుర్తు చేస్తూ సాగింది. ఆ ముచ్చట్లు ఈ వారం ‘రేడియో తరంగాలు’లో మీ కోసం..



1972 బ్యాచ్...



ఇలియాస్: అప్పట్లో నేను ఐఏఎస్, ఐపీఎస్‌కు అప్పియర్ అవ్వాలనుకునేవాణ్ణి. కానీ ఉద్యోగావసరం నన్ను రేడియోలోకి లాగింది. అందులో అడుగుపెట్టాక కూడా ఎప్పటికైనా వెళ్లిపోవాలి అనుకునేవాణ్ణి కానీ ఇలా శాశ్వతంగా ఆకాశవాణిలో పని చేసి రిటైర్ అవుతానని ఎప్పుడూ అనుకోలేదు.



జోత్స్న: నేనూ ఇలియాస్ బ్యాచ్‌మేట్స్. నేను 2008లో, ఇలియాస్ 2000లో పదవీ విరమణ చేశాం. ఇద్దరం కలసి ఎన్నో కార్యక్రమాలు చేశాం. ఆకాశవాణికి వచ్చే వరకు రచనపై మాకు ఆసక్తిలేదు.

 

వారసత్వంగా...




జ్యోత్స్న: అమ్మ ‘రేడియో భానుమతి’ నుంచి వారసత్వంగా ఇందులోకి వచ్చాను. కాబట్టే ఇక్కడ త్వరగా ఒదిగిపోగలిగాను. అప్పట్లో బాలానందం కార్యక్రమానికి తరచూ వెళ్లేదాన్ని. దూరదర్శన్‌లో వార్తలు కూడా చదివాను. దాని కోసం డి.వెంకట్రామయ్య గారి దగ్గర శిక్షణ తీసుకున్నాను. నాటకాలపై నాకు ఎక్కువ ఆసక్తి. రంగనాయకమ్మగారు రాసిన ‘స్వీట్‌హోం’ కథ నచ్చి ఆమె దగ్గర నాటకం వేయడానికి అనుమతి తీసుకొని అందులో ‘విమల’ పాత్రలో నటించాను. ఇలా రేడియో నా జీవితంలో ముఖ్య భూమిక పోషించింది.

 

మా ఇద్దరి పేర్ల్లే ‘మధూలత’...



ఇలియాస్:  నేను ‘రేడియో క్లబ్’ అనే కార్యక్రమం చేశాను. అందులో శ్రోతలకు మెంబర్‌షిప్ ఉండేది. అంటే వారి నంబర్లు తీసుకొని మేమే ఫోన్ చేసేవాళ్లం.ఆ కార్యక్రమం మాకూ శ్రోతలకు మధ్య బాంధవ్యాన్ని పెంచింది. 1975లో చిన్న చిన్న ముచ్చట్లు పెట్టుకునే కార్యక్రమం చేస్తే బాగుంటుందనిపించింది. అలా నేను, జోత్స్న కలసి ‘పూలజల్లు’ అనే అయిదు నిమిషాల కార్యక్రమం ఏడాదిన్నర పాటు చేశాం. దాంట్లో మా ఇద్దరి పేర్లు ‘మధూలత’. అందులో రోజుకో అంశంపై ముచ్చటించే వాళ్లం. రెండేళ్ల క్రితం నేను ఆస్పత్రికి వెళ్లినప్పుడు మా పేర్లు విని ఓ అమ్మాయి మీరు పూలజల్లులోని మధూలత కదా అని అడిగింది. ఎప్పటి మధూలత అనిపించింది కానీ చాలా ఆనందం కలిగింది.

 

రచనా ప్రస్థానం...



ఇలియాస్: నేను రాయడం రేడియోకు వచ్చాకే మొదలెట్టాను. ఏ కథ గురించి అయినా జోత్స్నతో చర్చించాకే నిర్ణయం తీసుకుంటా. అలా ఇద్దరం కలసి ఎన్నో పత్రికలకు, మ్యాగజీన్‌లకు ఇలియాస్ జ్యోత్స్న పేరుతో కథానికలు రాశాం . తర్వాత సీరియల్స్ రాయడమూ ప్రారంభించాం.



1988-89లో ఎయిడ్స్ మనం దేశంలో వ్యాపించసాగింది. అప్పుడు రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థవారు ప్రజల్లో అవగాహన కల్పించేలా కార్యక్రమం చేయాలని మాకు చెప్పారు. అప్పుడు హెచ్.ఐ.వి వైరస్‌ను గుర్తించిన సైంటిస్ట్ రాబర్ట్ గాల్లోను హైదరాబాద్‌లోని సీసీఎంబీలో కలసి ఇంటర్వ్యూ చేసి ‘మీ నేస్తం’ పేరుతో ప్రాయోజిత కార్యక్రమం నిర్వహించాం.



మొదటిసారి రికార్డింగులడిగారు...



నేను మీతో (శారదా శ్రీనివాసన్) కలసి చేసిన ‘మెదియా’ నాటకం శ్రోతలందరికీ ఎంతగానో నచ్చింది. ఎంతోమంది స్టూడియోకు వచ్చి రికార్డింగ్స్ అడిగి మరీ తీసుకెళ్లారు. అలాగే ‘లైఫ్ టానిక్’ లో మృత్యు దేవతగా మీరు (శారదా శ్రీనివాసన్) చేసిన పాత్ర అద్భుతం. అది విన్నాక అందరూ మృత్యుదేవతను సైతం ఇష్టపడ్డారు (నవ్వుతూ).



టీవీ రంగప్రవేశం...



ఇలియాస్: ‘కోడలా కోడలా కొడుకు పెళ్లామా’ కథతో సీరియల్స్ ప్రస్థానం ప్రారంభించా. అది 100 ఎపిసోడ్లు నడిచింది. ‘అలౌకిక’ సీరియల్ తీశా! అది విజయవంతం అయింది. తర్వాత ‘అన్వేషిత’ సీరియల్ చేశాను. అది ఎంతలా ప్రేక్షకాదరణ పొందిందో అందరికీ తెలుసు. ఆ సీరియల్‌కు 8 నంది అవార్డులు వచ్చాయి. అలాగే నేను తీసిన పొగమంచు, చిరుదివ్వెలు (బాలల చిత్రం), శ్వేత గులాబీలు లాంటి వాటికీ నందులు అందుకున్నాను.



ఇంట్లోనే స్టూడియో...



(జ్యోత్స్న) మైక్రోఫోన్ మీదున్న ప్రేమ తగ్గకే ఇంట్లో స్టూడియో ఏర్పాటు చేసుకున్నాం. మొబైల్ కంపెనీలకు కంటెంట్ తయారు చేసిస్తాం. మా దగ్గర కొంతమంది డబ్బింగ్ ఆర్టిస్టులున్నారు. కొన్ని చానళ్లకు హిందీ నుంచి తెలుగు సీరియళ్లకు స్క్రిప్ట్ రాసి ఇంట్లోనే డబ్బింగ్ చేసి ఇస్తాం. రిటైర్ అయ్యాకే ఇంకా ఎక్కువ బిజీ అయ్యాం. అయినా ఈ హైదరాబాద్ ట్రాఫిక్‌లో తిరగడమంటే మామూలు విషయమా... ప్రస్తుతం మా చేతుల్లో ఉన్న  కొన్ని డబ్బింగ్ సీరియళ్లతో బిజీబిజీగా ఉన్నాం.

 

నాన్నగారి వల్లే...



జ్యోత్స్న:  నాన్నే మా పెళ్లి జరిపించారు. ఆయన బ్రహ్మసమాజ సిద్ధాంతాలను  పాటించేవారు. ఆ తర్వాత మా కూతురు స్వప్న (టీవీ యాంకర్)కూ బ్రహ్మసమాజం పద్ధతిలోనే దగ్గరుండి వివాహం  చేయించారు. మా అమ్మను ఆయనెప్పుడూ కట్టడి చేయలేదు. అలా మా పెళ్ల్లయ్యాక మా అమ్మ(భానుమతి), అత్తయ్య (షాహీన్ ఫాతీమా) చాలా సన్నిహితంగా ఉండేవారు. ఉదాహరణకు వరలక్ష్మీ పూజ వచ్చిందంటే మా అత్తయ్యే అమ్మకు పండ్లు, పూలు, మట్టి కుందులు పంపించేవారు. మనల్ని అర్థం చేసుకోదని  సమాజాన్ని తిడుతుంటాం కానీ నిజాయితీ ఉంటే తప్పకుండా మన పనిని స్వీకరిస్తుంది. సమాజానికి విశాల హృదయం ఉంది. మా ఇద్దరి మీద ప్రేమతోనే అందరూ మా ఇంటికి వస్తారు.

 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top