బాలీవుడ్‌కీ బంగారం!

బాలీవుడ్‌కీ బంగారం! - Sakshi


గాసిప్

ఆదిత్య రాయ్ కపూర్, శ్రద్ధా కపూర్‌లు మరోసారి జోడీ కట్టబోతున్నారా? అవుననే అంటున్నాయి గుసగుసలు. మణిరత్నం రొమాంటిక్ డ్రామా ‘ఓకే కణ్మని’ (తెలుగులో ఓకే బంగారం)ను బాలీవుడ్‌లో రిమేక్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. మణిరత్నం దగ్గర అసిస్టెంట్‌గా  పనిచేసిన షాద్ ఆలి ఈ రీమేక్‌కు దర్శకత్వం వహించబోతున్నారట. ఈయన గతంలో మణిరత్నం  ‘అలైపాయుతె’ (తెలుగులో సఖీ) సినిమాను ‘సాథియా’ పేరుతో హిందీలో రిమేక్ చేశాడు.



‘ఓకే బంగారం’ రీమేక్ కోసం ఒరిజినల్‌లో నటించిన హీరోహీరోయిన్లు సల్మాన్ దుల్కర్, నిత్యా మీనన్‌లతో పాటు చాలామందినే అనుకున్నారు. ఏమైందో ఏమోగానీ... వారి పేరు మళ్లీ వినిపించలేదు. ఆలియాభట్, వరుణ్ ధావన్‌లను సంప్రదించారుగానీ... వారి బిజీ షెడ్యూల్స్ వల్ల ‘నో’ చెప్పేశారట. ఆ తరువాత ఆదిత్య, సోనాక్షి సిన్హాల జోడీని అనుకున్నా అది వర్కవుట్ కాలేదు. ఇప్పుడు తాజాగా  ‘ఆషికీ-2’ జంట శ్రద్ధా కపూర్, ఆదిత్యరాయ్ కపూర్‌ల పేరు జోరుగా వినిపిస్తుంది. అయితే ఆదిత్య, శ్రద్ధాల మధ్య విభేదాలు తలెత్తాయని... వారు మళ్లీ కలిసి నటించే ఛాన్సు లేదని కొందరు గట్టిగా ఛాలెంజ్ చేస్తున్నారు.



అయితే దీన్ని ఖండించేవారు కూడా లేకపోలేదు. ‘వారిద్దరు ప్రొఫెషనల్స్. వారి ప్రొఫెషనలిజం ముందు... విభేదాలు చాలా చిన్న విషయం. తప్పనిసరిగా కలిసి నటిస్తారు’ అనేవాళ్లు కూడా ఉన్నారు. ‘సాథియా’ విజయం సాధించడంలో  రెహమాన్ మ్యూజిక్ మ్యాజిక్ కీలకపాత్ర పోషించింది. మరి ‘ఓకే బంగారం’ రీ మేక్‌లోనూ రెహమాన్ మ్యూజిక్‌ను వాడుకుంటే... ఇక అంతా బంగారమే!

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top