గోదావరి గలగలలు...పచ్చందనాల సిరులు


గలగలపారే గోదావరి హొయలు.. పచ్చని పంటపొలాలు.. నలుదిశలా చాటే చారిత్రక వైభవం.. గిరులలోని తరుల సౌందర్యం.. గిరిపుత్రుల జీవనం.. జలపాతాల సోయగం.. కనులారా వీక్షించాలంటే తూర్పుకు పరుగులు తీసే గోదావరి వైపుగా మన అడుగులూ కదలాలి.

 

తూర్పుగోదావరి జిల్లాకు కాకినాడ ముఖ్యపట్టణం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ఈ జిల్లాలో గోదావరి జీవనవేదాన్ని కళ్లకు కడుతుంది. దేశంలోనే 2వ అతిపెద్ద కోస్తా తీరం ఈ జిల్లాలోనే ఉంది. ప్రకృతి మనోహర దృశ్యాలకు పరవశిస్తూ, చారిత్రక వైభవాలను తెలుసుకుంటూ ప్రకృతి ఒడిలో కొత్త ఉత్సాహాన్ని నింపుకోవడానికి బయల్దేరే పర్యాటకులు గోదావరి ఇసుకుతిన్నెలపై మరచిపోలేని అనుభూతులెన్నో మూట గట్టుకొని వెళ్లచ్చు. తూర్పుగోదావరి ప్రాంతంలో అతి ముఖ్యమైన 16 ప్రదేశాలను తిలకించడానికి కనీసం ఐదు పగళ్లు, నాలుగు రాత్రుళ్లు కేటాయించాలి. హైదరాబాద్ నుంచి 564 కి.మీ దూరంలో ఉన్న ఈ ప్రాంతానికి దేశంలోని అన్ని ప్రధాన నగరాల నుంచి రోడ్డు, రైలు మార్గాలు ఉన్నాయి.

 

మొదటి రోజు: దేశంలో ఎక్కడ నుంచైనా రాజమండ్రికి చేరుకొని, అక్కడి హోటల్ గదిలో విశ్రాంతి తీసుకొని, ఉదయం 10గం.కు.. రాజమండ్రిలోని కందుకూరి వీరేశలింగం పుట్టిన ప్రదేశానికి చేరుకొని అక్కడ వితంతు వివాహాలు జరిపిన పెద్ద హాలును సందర్శించాలి. ఆ తర్వాత సెంట్రల్ జైల్, గోదావరి నదీ తీరంలో స్నాన ఘట్టాలు, కడియపులంక నర్సరీ... చుట్టి రావచ్చు. చుట్టుపక్కల 25 నుంచి 30 కి.మీ. దూరంలో గల ఈ ప్రదేశాలన్నీ చూడటానికి కనీసం మూడు గంటలు పడుతుంది. మధ్యాహ్నపు భోజనానికి నదీ తీరంలో గల రెస్టారెంట్‌కి చేరుకుంటే రుచికరమైన శాకాహార/మాంసాహార భోజనం లభిస్తుంది. అక్కడ నుంచి మధ్యాహ్నం 2.00 గంటలకు బయల్దేరి 26 కి.మీ దూరంలోని బుద్ధుడు నడయాడిన ప్రాంతాలు కాపవరం, కోరుకొండను సందర్శించాలి. అక్కడ నుంచి 58 కిమీ దూరంలో కొడవలిలో బౌద్ధ ప్రాంతాలను దర్శించి రాత్రికి తిరిగి రాజమండ్రి చేరుకోవాలి.

 

రెండవ రోజు: ఉదయం 7 గంటలకు పట్టిసీమకు బోటులో బయల్దేరాలి. రాజమండ్రి నుంచి గోదావరి నది మీద బోటులో 40 కి.మీ ప్రయాణిస్తే పాపికొండలు చేరుతాం. పాపికొండల నడము ప్రవహించే నదీ సోయగం కళ్లారా చూడవలసిందే! ఇక్కడే పోలవరం డ్యామ్ ప్రాజెక్ట్ సైట్ ప్రాంతాలు, తూర్పు కనుమల అందాలు, గిరిజనుల గ్రామాలు సందర్శించి, వారి జీవనశైలులను తిలకించవచ్చు. ఇక పేరంటాలపల్లి శివాలయం, ఆశ్రమం సందర్శించి, దగ్గరలోని జలపాతాన్ని వీక్షించాక అటు నుంచి పాపికొండలలోని వన్యప్రాణి సంరక్షణ కేంద్రానికి వెళ్లాలి. బోటులోనే అల్పాహారం, మధ్యాహ్న భోజనం, సాయంకాలం స్నాక్స్, టీ లభిస్తాయి. సాయంత్రం దగ్గరలోని కొల్లూర్‌కు వెళ్లి, ఇసుకతిన్నెలమీద కట్టిన చిన్న చిన్న గుడిసెలలో ఆ రాత్రి విశ్రాంతి తీసుకొని, గోదావరి అందాలను వీక్షించడం ఎప్పటికీ మరచిపోలేని మధురానుభూతి.

 

మూడవ రోజు: ఉదయం 8:00 గంలకు కొల్లూరు నుంచి దేవీపట్నానికి బోటులో బయల్దేరాలి. ఈ ప్రయాణం కనీసం మూడు గంటలు పడుతుంది. ఇక్కడే రంప జలపాతానికి ట్రెక్కింగ్ ద్వారా చేరుకోవాలి. మారేడుమిల్లి హిల్ స్టేషన్ (రంపచోడవరానికి 26 కి.మీ)లోని కాఫీ తోటలు, ఔషధ మొక్కలు, 10 కి.మీ దూరంలో గల పాములేరు అటవీ ప్రాంతం, పులుల స్థావరం, జలపాత అందాలను తిలకిస్తూ పర్యాటకులు మైమరచిపోతుంటారు. వాటిని సందర్శించి, అమృతధార జలపాతానికి ట్రెక్కింగ్ చేస్తూ వెళ్లేవారికి ఈ మార్గం ఉల్లాసమైన అనుభూతిని మిగుల్చుతుంది. మారేడుమిల్లిలో టూరిజమ్ టెంట్ల కింద రాత్రి భోజనం చేసి, నక్షత్రాలను లెక్కపెట్టుకుంటూ హాయిగా నిద్రపోవడం మరో తీయని అనుభూతి.

 

నాల్గవ రోజు: ఉదయం 5:00 గం.ల నుంచి పక్షుల కువకువల తో మేల్కొని, వాటిని వీక్షిస్తూ ఆ హాయిని, ఆనందాన్ని గుండెలనిండుగా నింపుకుంటారు పర్యాటకులు. ఇక్కడే అల్పాహారం చేసి, 130 కి.మీ దూరంలో గల బిక్కవోలుకు బయల్దేరాలి. బిక్కవోలులో చాళుక్యుల కాలంలో నిర్మించిన ప్రాచీన దేవాలయాలు ఉన్నాయి. నాటి కళా వైభవాన్ని కళ్లారా వీక్షించి కాకినాడకు గొల్లలమామిడాడ మీదుగా బయల్దేరుతూ పచ్చని పంటపొలాలను చూస్తూ ప్రయాణం కొనసాగించాలి. గంటన్నరలో కాకినాడ చేరుకొని మధ్యాహ్న భోజనం చేసి, అటు నుంచి 26 కి.మీ దూరంలో గల సామర్లకోటకి వెళితే ద్రాక్షారామం చారిత్రక వైభవాన్ని, ఆధ్యాత్మిక సౌరభాలను వెదజల్లుతూ ఆహ్వానిస్తుంది. ఇక్కడ భీమేశ్వర స్వామి, మాణిక్యాంబ దేవాలయాలు అంత్యంత ప్రాముఖ్యం గలవి. వీటిని దర్శించుకొని 18 కి.మీ దూరంలో గల యానాం బయల్దేరాలి. యానాం ఉద్యానాలకు బ్యాంక్. ఇక్కడి పార్కులలో మనోల్లాసాన్ని పొందడంతో పాటు గోదావరి తీరాన గల 19వ శతాబ్దపు చర్చి సందర్శన అత్యంత ప్రధానమైనది. ఆ తర్వాత 28 కి.మీ దూరంలో ఉన్న కాకినాడకు తిరిగి వెళ్లి, రాత్రి అక్కడే బస చేయాలి.

 

ఐదవ రోజు: ఉదయాన్నే రూమ్ చెక్ ఔట్ చేసి, అల్పాహారం ముగించుకొని ఆదుర్రుకు బయల్దేరాలి. కాకినాడ నుంచి 85 కి.మీ ప్రయాణిస్తే రాజోలు తాలూకాలో ఆదుర్రు గ్రామం వస్తుంది. ఇది చారిత్రక ప్రదేశం. ఇక్కడ 1700 ఏళ్ల నాటి బుద్ధుని స్థూపాలు ఉన్నాయి. పురావస్తు శాఖ 1953లో జరిపిన తవ్వకాల్లో నాటి మట్టి పాత్రలు, కుండలు బయటపడ్డాయి. ఇక్కడ మహాస్థూపం ఈ ప్రాంతానికి అతి పెద్ద ఆకర్షణ. రెండు గంటల పాటు ఇక్కడే తిరిగి, నాటి విశేషాలు తెలుసుకోవాలి. అటునుంచి మధ్యాహ్నం 2:00 గంలకు కాకినాడ నుంచి చెన్నైకి, ఇటు హైదరాబాద్‌కూ చేరుకోవచ్చు.

 

ప్రయాణమార్గాలు:

తూర్పుగోదావరికి రైలు, రోడ్డు, నీరు, వాయు మార్గాలు ఉన్నాయి. రాజమండ్రి, సామర్లకోటలో రైల్వే జంక్షన్లు. చెన్నై హౌరా రైల్వై లైన్ ఈ జిల్లా మీదుగా వెళుతుంది. రాజమండ్రిలోని ఎయిర్‌పోర్ట్‌కు హైదరాబాద్, చెన్నై, విజయవాడ, బెంగళూర్‌ల నుంచి చేరుకోవచ్చు.

 

చూడదగిన ప్రాంతాలు

 1.రాజమండ్రి పట్టణం సంస్కృతీ సంప్రదాయాలకు, చారిత్రక అంశాలకు ప్రాముఖ్యత

 2.కడియపులంక నర్సరీ

 3.గోదావరి నదిలో 70 కి.మీ దూరం బోటులో ప్రయాణం. పాపి కొండలు,గిరిజనుల గ్రామాలు, గిరిజనుల జీవనశైలి

 4.రంపా, అమృతధార జలపాతాలు, ట్రెక్కింగ్, కాఫీ తోటలు

 5.పాములేరు అటవీ సౌందర్యం

 6.కాపవరం బుద్ధుని స్థూపానికి దారి

 7.కొడవలి బుద్ధుని స్థూపం

 8.బిక్కవోలులో వెయ్యేళ్ల నాటి దేవాలయాలు

 9.ద్రాక్షారామంలో తూర్పుచాళుక్యుల కాలం నాటి భీమేశ్వరస్వామి దేవాలయం

 10. కోరింగ వణ్యప్రాణి సంరక్షణకేంద్రం.

 11. ఆదుర్రులో బుద్ధుని స్థూపం

 

ఈ ట్రిప్‌లో దాదాపు 758 కి.మీ. దూరం ప్రయాణించాల్సి ఉంటుంది. అంతా రోడ్డు మార్గమే! ఇందుకోసం స్థానిక బస్సులు, ఆటోలు, కార్లను ఆశ్రయించాల్సి ఉంటుంది. కొంతమంది సభ్యులుగా కలిసి ఈ ప్రాంతాలు చుట్టి రావాలనుకునేవారికి మంచి వినోదం, ఆహ్లాదంతో పాటు విజ్ఞానయాత్రగానూ, చిరకాలం ఓ మధుర జ్ఞాపకంగా మిగిలిపోతుంది. దాదాపు రూ.10,000/- నుంచి రూ.15,000/- (వారి వారి అవసరాలను బట్టి) ఖర్చు అవుతుంది.

 

- శ్రీను అరవపల్లి, టూర్ గైడ్, మినిస్ట్రీ ఆఫ్ టూరిజమ్

 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top