డిగ్రీతో కేంద్ర ప్రభుత్వ కొలువులు

డిగ్రీతో కేంద్ర ప్రభుత్వ కొలువులు


ఆర్ట్స్ నుంచి ఆర్కిటెక్చర్ వరకు.. సైన్స్ నుంచి సాఫ్ట్‌వేర్ ప్రొఫెషనల్స్ వరకు.. నేటి కార్పొరేట్ యుగంలోనూ.. ఏ విభాగంలో డిగ్రీ పూర్తిచేసిన వారికైనా సర్కారీ కొలువుపై తగని మక్కువ. బ్యాచిలర్స్ డిగ్రీ అర్హతగా అత్యున్నత సివిల్ సర్వీసెస్ మొదలు ఎన్నో కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో నిరంతరం పోస్టుల భర్తీకి కేరాఫ్‌గా నిలుస్తోంది.. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ). ఇందుకోసం జాతీయ స్థాయిలో పరీక్షలు నిర్వహిస్తోంది. 2015లో నిర్వహించే పరీక్షలకు యూపీఎస్సీ క్యాలెండర్ ఇయర్ ప్రకటించిన నేపథ్యంలో.. బ్యాచిలర్స్ డిగ్రీ అర్హతగా అందే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు, నిర్వహించే పలు పరీక్షలు..విజయానికి నిపుణుల సూచనలు...

 

 సివిల్ సర్వీసెస్.. సర్వోన్నత పరీక్ష

 

 డిగ్రీ నుంచి బీటెక్, ఎంబీబీఎస్ వంటి వృత్తి విద్య కోర్సుల ఉత్తీర్ణుల వరకు పరిచయం అవసరం లేని, అత్యంత క్రేజ్ కలిగిన పరీక్ష.. సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్. ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్, ఇండియన్ పోలీస్ సర్వీస్, ఇండియన్ ఫారెన్ సర్వీస్, ఇండియన్ రెవెన్యూ సర్వీస్ తదితర 20కిపైగా అఖిల భారత సర్వీసులకు అభ్యర్థులను ఎంపిక చేసే సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్‌కు ఏటేటా పోటీ పెరుగుతోంది.

 

 విద్యార్హతలు: ఏదేని బ్యాచిలర్స్ డిగ్రీలో ఉత్తీర్ణత.

 

 వయో పరిమితి: 21 నుంచి 32 ఏళ్ల మధ్యలో ఉండాలి.

 

 ప్రకటన: సాధారణంగా ప్రతి ఏటా జనవరి/ ఫిబ్రవరి నెలల్లో ప్రకటన వెలువడుతుంది. 2015లో మే 16న నోటిఫికేషన్ విడుదలవుతుంది.

 2015 ఆగస్టు 23న ప్రిలిమినరీ పరీక్ష జరుగుతుంది.

 

 ఎంపిక విధానం: సివిల్ సర్వీసెస్ ఎంపిక విధానం మూడు దశల్లో ఉంటుంది. అవి.. ప్రిలిమినరీ; మెయిన్‌‌స; పర్సనాలిటీ టెస్ట్.

 

 ప్రిలిమినరీ

 మొత్తం రెండు పేపర్లుగా 400 మార్కులకు ఈ పరీక్ష ఉంటుంది.

 

 పేపర్-1లో జనరల్ అవేర్‌నెస్, జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్ నుంచి ప్రశ్నలు ఉంటాయి.

 

 పేపర్-2లో కాంప్రహెన్షన్; ఇంటర్ పర్సనల్ స్కిల్స్; లాజికల్ రీజనింగ్ అండ్ అనలిటికల్ ఎబిలిటీ; డెసిషన్ మేకింగ్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్, జనరల్ మెంటల్ ఎబిలిటీ; బేసిక్ న్యూమరసీ, ఇంగ్లిష్ లాంగ్వేజ్ కాంప్రహెన్షన్ అంశాల నుంచి ప్రశ్నలు ఉంటాయి.

 

 సక్సెస్ టిప్స్: ఆబ్జెక్టివ్ విధానంలో నిర్వహించే ప్రిలిమినరీ ఎగ్జామినేషన్‌లో పేపర్-1లో విజయానికి అభ్యర్థులు నిర్దేశిత సిలబస్‌లోని అంశాలకు సంబంధించి ప్రాథమిక పరిజ్ఞానంతోపాటు, ఆయా అంశాలను సమకాలీన పరిణామాలతో అనుసంధానం చేసుకుంటూ చదవాలి. ఈ క్రమంలో ప్రాథమిక నైపుణ్యం కోసం ఎన్‌సీఈఆర్‌టీ హైస్కూల్ స్థాయి పుస్తకాలను చదవాలి. పేపర్-2 అభ్యర్థుల్లోని డెసిషన్ మేకింగ్ స్కిల్స్, భాష నైపుణ్యం, మ్యాథమెటికల్ స్కిల్స్, రీజనింగ్, స్పాంటేనిటీని ప్రశ్నించే విధంగా ఉంటుంది. దీనికోసం అభ్యర్థులు రీజనింగ్, అర్థమెటిక్ అంశాలతోపాటు, కాంప్రహెన్షన్ కోసం ఇంగ్లిష్ దినపత్రికలను చదవడం, వొకాబ్యులరీని పెంచుకోవడంపై దృష్టిపెట్టాలి.

 

 మెయిన్ ఎగ్జామినేషన్: పూర్తి డిస్క్రిప్టివ్ విధానంలో నిర్వహించే మెయిన్ ఎగ్జామ్‌లో ఏడు పేపర్లు ఉంటాయి. వీటితోపాటు మరో రెండు అర్హత పేపర్లు ఉంటాయి. వాటిలో ఒకటి భారత రాజ్యాంగం గుర్తించిన ఏదైనా భాషా పేపర్, మరొకటి ఇంగ్లిష్. ఈ రెండు పేపర్ల మార్కులను పరిగణనలోకి తీసుకోరు. ఎంపికలో పరిగణనలోకి తీసుకునే పేపర్లు..

 పేపర్-1 జనరల్ ఎస్సే - 250 మార్కులు

 పేపర్-2 జనరల్ స్టడీస్-1- 250 మార్కులు

 పేపర్-3 జనరల్ స్టడీస్-2- 250 మార్కులు

 పేపర్-4 జనరల్ స్టడీస్-3- 250 మార్కులు

 పేపర్-5 జనరల్ స్టడీస్-4- 250 మార్కులు

 పేపర్-6 ఆప్షనల్ సబ్జెక్ట్ పేపర్-1, 250 మార్కులు

 పేపర్-7 ఆప్షనల్ సబ్జెక్ట్ పేపర్-2, 250 మార్కులు

 మొత్తం 1750 మార్కులకు మెయిన్ ఎగ్జామినేషన్ ఉంటుంది.

 

 ఇందులో పేపర్-6, 7లకు సంబంధించి అభ్యర్థులు కమిషన్ నిర్దేశించిన 25 ఆప్షనల్ సబ్జెక్ట్‌ల్లో ఏదో ఒకదాన్ని ఎంపిక చేసుకోవచ్చు.

 

 జనరల్ స్టడీస్-1లో హిస్టరీ అండ్ జాగ్రఫీ; జనరల్ స్టడీస్-2లో పాలిటీ, గవర్నెన్స్, అంతర్జాతీయ అంశాలు, సామాజిక న్యాయం;

 

 జనరల్ స్టడీస్-3లో సైన్స్ అండ్ టెక్నాలజీ అంశాలు; జీఎస్-4లో ఎథిక్స్, ఇంటెగ్రిటీ, ఆప్టిట్యూడ్ అంశాలపై ప్రశ్నలు ఉంటాయి.

 

 సక్సెస్ టిప్స్: పూర్తిగా డిస్క్రిప్టివ్ విధానంలో నిర్వహించే మెయిన్ పరీక్షలో విజయానికి అభ్యర్థులు ముందుగా ఒక అంశానికి సంబంధించి భావ వ్యక్తీకరణ సామర్థ్యాన్ని పెంచుకోవాలి. నిర్దిష్ట అంశంపై సూటిగా స్పష్టంగా సమాధానం ఇచ్చే విధంగా ఆయా విభాగాల్లోని ముఖ్యాంశాలను గుర్తించే నైపుణ్యం సొంతం చేసుకోవాలి. అదే విధంగా ప్రిలిమ్స్‌లో పేర్కొన్న జనరల్ స్టడీస్ అంశాలను ముందునుంచే మెయిన్స్‌లోని జనరల్ స్టడీస్ అంశాలతో అనుసంధానం చేసుకుంటూ డిస్క్రిప్టివ్ తరహాలో ప్రిపరేషన్ సాగిస్తే మెరుగైన ఫలితాలు ఆశించొచ్చు.



 ఇంటర్వ్యూ: మెయిన్‌‌సలో ఉత్తీర్ణత సాధించినవారిని ఖాళీలు, రిజర్వేషన్‌‌స ఆధారంగా ఇంటర్వ్యూకు ఎంపిక చేస్తారు. దీనికి మార్కులు 275.

 

 సీఏపీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్స్

 

 కేంద్ర సాయుధ దళాల్లో గ్రూప్-ఎ గెజిటెడ్ అధికారి హోదాలో అడుగుపెట్టేందుకు మార్గం వేసే పరీక్ష.. యూపీఎస్సీ నిర్వహించే సీఏపీఎఫ్(సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్స్) అసిస్టెంట్ కమాండెంట్స్ ఎగ్జామినేషన్. బ్యాచిలర్స్ డిగ్రీ అర్హతగా నిర్వహించే ఈ పరీక్షలో విజయం సాధించడం ద్వారా సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్, బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్, సశస్త్ర సీమాబల్, ఇండో-టిబెటిన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ విభాగాల్లో అసిస్టెంట్ కమాండెంట్‌గా కెరీర్ ప్రారంభించొచ్చు.

 

 విద్యార్హత: బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణత.

 

 వయో పరిమితి: ప్రకటన వెలువడిన సంవత్సరంలో ఆగస్ట్ 1 నాటికి 20 నుంచి 25 ఏళ్ల మధ్యలో ఉండాలి. 2015కు సంబంధించి ఏప్రిల్ 11న నోటిఫికేషన్ వెలువడనుంది.

 

 ఎంపిక విధానం: సీఏపీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్స్ ఎంపిక విధానం రెండు దశల్లో ఉంటుంది. అవి.. రాత పరీక్ష, ఇంటర్వ్యూ.

 

 రాత పరీక్ష ఇలా: రాత పరీక్ష రెండు పేపర్లుగా ఉంటుంది.

 

 పేపర్-1 జనరల్ ఎబిలిటీ  అండ్ ఇంటెలిజెన్స్: అభ్యర్థుల్లోని జనరల్ నాలెడ్జ్, సమకాలీన అంశాలపై అవగాహనను పరీక్షించే విధంగా

 ఈ పేపర్‌లో ప్రశ్నలు ఉంటాయి. మొత్తం 125 ప్రశ్నలతో 250 మార్కులకు నిర్వహించే పేపర్-1లో భారత చరిత్ర, రాజ్యాంగం, ఎకానమీ, జాగ్రఫీ, సైన్స్, మ్యాథ్స్, రీజనింగ్, పర్యావరణం-జీవవైవిధ్యం, కరెంట్ అఫైర్స్ అంశాల నుంచి ప్రశ్నలు అడుగుతారు. ఈ పేపర్‌లో అత్యధిక మార్కులు సాధించాలంటే ముందుగా అన్ని సబ్జెక్ట్‌లకు సంబంధించి ఆరు నుంచి 12వ తరగతి వరకు ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాలను చదవాలి. ఫలితంగా అన్ని అంశాలకు సంబంధించి బేసిక్ కాన్సెప్ట్స్, ఫార్ములాలపై ప్రాథమిక అవగాహన లభిస్తుంది. కరెంట్ అఫైర్స్ విషయంలో ప్రధానంగా ఆర్థిక-రాజకీయ పరిణామాలపై దృష్టి సారించడం ఉపకరిస్తుంది.

 

 పేపర్-2- ఎస్సే, ప్రెసిస్ రైటింగ్ అండ్ రీడింగ్ కాంప్రహెన్షన్:

 మార్కులు - 200. ఈ పేపర్‌లో ఎస్సే రైటింగ్ విభాగంలో నిర్దేశిత అంశాలపై మూడు వందల పదాలకు మించకుండా చిన్నపాటి వ్యాసాలు రాయాల్సి ఉంటుంది. ప్రెసిస్ రైటింగ్, రిపోర్ట్ రైటింగ్, రీడింగ్ కాంప్రహెన్షన్‌లపై మిగతా ప్రశ్నలు ఉంటాయి. ఈ విభాగంలో రాణించాలంటే.. అభ్యర్థులకు బేసిక్ ఇంగ్లిష్ గ్రామర్‌పై పట్టుతోపాటు, భావ వ్యక్తీకరణ నైపుణ్యాలు అవసరం. ఇందుకోసం ఇంగ్లిష్ దినపత్రికల్లోని ఎడిటోరియల్స్, ఇతర వ్యాసాలు చదివి.. అందులోని ముఖ్యాంశాలతో సొంత శైలిలో పరీక్షలో నిర్దేశించిన మాదిరిగానే 300 పదాల్లో సారాంశాలను క్రోడీకరించడం ప్రాక్టీస్ చేయాలి. రాత పరీక్షలో నిర్ణీత కటాఫ్ మార్కులు పొందిన అభ్యర్థులకు 150 మార్కులకు ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.

 

 ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్

 

 అఖిల భారత సర్వీసుల్లో భాగంగా కేంద్ర అటవీ శాఖలో డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ లేదా డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్ హోదాతో కెరీర్ ప్రారంభించేందుకు అవకాశం కల్పించే పరీక్ష ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఎగ్జామినేషన్. అర్హత: బ్యాచిలర్స్ డిగ్రీ స్థాయిలో.. యానిమల్ హజ్బెండరీ అండ్ వెటర్నరీ సైన్స్, బోటనీ, కెమిస్ట్రీ, జువాలజీ, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, స్టాటిస్టిక్స్ సబ్జెక్ట్‌లలో ఏదో ఒకటి ప్రధానాంశంగా చదివిన అభ్యర్థులు లేదా బీఎస్సీ (అగ్రికల్చర్) లేదా బీఎస్సీ (ఫారెస్ట్రీ) లేదా ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణులు ఈ పరీక్షకు అర్హులు.

 

 వయో పరిమితి: నోటిఫికేషన్ వెలువడిన సంవత్సరంలో జూలై 1 నాటికి 21 నుంచి 30 ఏళ్ల మధ్యలో ఉండాలి.

 

 ఎంపిక విధానం: ఐఎఫ్‌ఎస్ ఎంపిక విధానం మూడు దశలుగా ఉంటుంది. అవి.. ప్రిలిమినరీ, మెయిన్స్, పర్సనాలిటీ టెస్ట్.

 

 ప్రిలిమినరీ: రెండేళ్ల క్రితం వరకు ఐఎఫ్‌ఎస్‌కు ప్రిలిమినరీ పరీక్షను యూపీఎస్సీ ప్రత్యేకంగా జరిపేది. గతేడాది నుంచి సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్షనే ఐఎఫ్‌ఎస్ ఔత్సాహికులకు కూడా నిర్వహిస్తోంది. అంటే.. ఐఎఫ్‌ఎస్ మెయిన్‌‌సకు హాజరవ్వాలనుకునే అభ్యర్థులు ముందుగా సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీలో ఉత్తీర్ణత సాధించాలి.

 

 మెయిన్స్: ప్రిలిమినరీలో ఉత్తీర్ణత సాధించినవారికి నిర్వహించే పరీక్ష మెయిన్స్ ఎగ్జామినేషన్. డిస్క్రిప్టివ్ విధానంలో ఉండే ఈ పరీక్షలో 1400 మార్కులకు మొత్తం ఆరు పేపర్లు ఉంటాయి. పేపర్-1 (జనరల్ ఇంగ్లిష్- మార్కులు-300); పేపర్-2 (జనరల్ నాలెడ్జ్ మార్కులు-300) అభ్యర్థులంతా తప్పనిసరిగా రాయాల్సిన పేపర్లు.పేపర్-3 నుంచి పేపర్-6 వరకు ఆప్షనల్ పేపర్లు. అభ్యర్థులు నిర్దేశించిన సబ్జెక్టుల్లో రెండింటిని ఆప్షనల్స్‌గా ఎంపిక చేసుకోవచ్చు. ఒక్కో పేపర్‌కు కేటాయించిన మార్కులు 200. ఖాళీల ఆధారంగా నిర్దిష్ట కటాఫ్ మార్కులు పొందిన అభ్యర్థులను మూడు వందల మార్కులకు నిర్వహించే పర్సనాలిటీ టెస్ట్‌కు ఎంపిక చేస్తారు.

 

 ఇంజనీరింగ్ సర్వీసెస్ ఎగ్జామ్

 

బీటెక్ ఉత్తీర్ణులకు ఎంఎన్‌సీలకు దీటుగా ప్రభుత్వ రంగంలో కెరీర్ అవకాశాలను అందించే నియామక పరీక్ష ఇంజనీరింగ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్. ఇందులో విజయం సాధించినవారు ఇండియన్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీస్; మిలిటరీ ఇంజనీరింగ్, బోర్డర్ రోడ్స్ ఇంజనీరింగ్, ఇండియన్ రైల్వేస్, సెంట్రల్ వాటర్, సెంట్రల్ ఇంజనీరింగ్, జియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా తదితర కేంద్ర ప్రభుత్వ ఇంజనీరింగ్ విభాగాల్లో గ్రూప్-1 స్థాయిలో అసిస్టెంట్ ఇంజనీర్స్, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్‌గా ప్రవేశించొచ్చు.

 

 విద్యార్హతలు

 ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, సివిల్, మెకానికల్ ఇంజనీరింగ్‌లలో బ్యాచిలర్స్ డిగ్రీ లేదా తత్సమాన కోర్సు ఉత్తీర్ణత.

 

 2015వ సంవత్సరానికి సంబంధించి మార్చి 14, 2015న నోటిఫికేషన్ వెలువడనుంది.

 

 ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా.

 

రాత పరీక్ష వివరాలు

సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్స్ ఇంజనీరింగ్ అనే నాలుగు కేటగిరీల్లో ఆబ్జెక్టివ్ విధానంలో రాత పరీక్ష ఉంటుంది. సెక్షన్ వన్‌లో జనరల్ ఎబిలిటీ, జనరల్ ఇంగ్లిష్ సబ్జెక్ట్‌లు ఒక పేపర్‌గా, అభ్యర్థులు ఎంచుకున్న సబ్జెక్ట్‌లు పేపర్-2, పేపర్-3గా ఉంటాయి. ఒక్కో పేపర్‌కు 200 మార్కులు చొప్పున 600 మార్కులకు ఆబ్జెక్టివ్ విధానంలో సెక్షన్-1 ఉంటుంది. సెక్షన్-2 పూర్తిగా కన్వెన్షన్ విధానంలో ఉంటుంది. ఇందులో అభ్యర్థులు తాము ఎంపిక చేసుకున్న సబ్జెక్ట్‌లకు సంబంధించి రెండు పేపర్లు రాయాల్సి ఉంటుంది. ఒక్కో పేపర్‌కు కేటాయించిన మార్కులు 200. ఇలా మొత్తం 1000 మార్కులకు రాత పరీక్ష ఉంటుంది. రాత పరీక్షలో విజయం సాధించిన విద్యార్థులకు ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.

 

 విజయం సాధించాలంటే: అభ్యర్థులకు బీటెక్ స్థాయిలో తమ అకడమిక్స్‌పై పరిపూర్ణ అవగాహన ఉంటే ఇంజనీరింగ్ సర్వీసెస్‌లో విజయం సులభమే. ఇంజనీరింగ్ సబ్జెక్ట్‌లకు సంబంధించి కాన్సెప్ట్స్, అప్లికేషన్ ఓరియెంటెడ్ ప్రాబ్లమ్స్‌ను ప్రాక్టీస్ చేయడం ఎంతో ఉపకరిస్తుంది. అదేవిధంగా గత ప్రశ్న పత్రాల పరిశీలన కూడా మరింత ఉపయుక్తంగా ఉంటుంది. అయితే సెక్షన్-1 లోని జనరల్ ఎబిలిటీలో ఎదురయ్యే హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రశ్నల సంసిద్ధత కోసం ఆరు నుంచి 12 తరగతుల ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాలు చదవడం లాభిస్తుంది. అదే విధంగా జనరల్ ఇంగ్లిష్ కోసం బేసిక్ గ్రామర్ అంశాలు, సెంటెన్స్ ఫార్మేషన్‌పై దృష్టి సారించాలి.

 

 సివిల్స్.. ముందస్తు వ్యూహంతోనే విజయం

 

 సివిల్ సర్వీసెస్ పరీక్ష అంటే చాలా మంది ఎంతో క్లిష్టమైంది, విజయం సాధించడం చాలా కష్టం అనే భావనలో ఉంటారు. కానీ నిర్దిష్ట ప్రణాళిక, వ్యూహం అనుసరిస్తే విజయం సులభమే. సివిల్స్‌లో విజయానికి అత్యంత ప్రధానమైన అంశం.. టైం మేనేజ్‌మెంట్. ఔత్సాహిక అభ్యర్థులు ఏడాది ముందుగా తమ ప్రిపరేషన్‌ను ప్రారంభిస్తే సత్ఫలితాలు సొంతమవుతాయి. చదివే ప్రతి అంశాన్ని శాస్త్రీయ దృక్పథంతో పరిశీలించాలి. నిర్దిష్ట అంశం నేపథ్యాన్ని సమకాలీన మార్పులకు అన్వయిస్తూ చదివితే సమయం ఆదా కావడంతోపాటు మెదడులో త్వరగా నిక్షిప్తం అవుతుంది. ఆప్షనల్ విషయంలో అభ్యర్థులు ఆందోళన చెందక్కర్లేదు. ఎంపిక చేసుకున్న ఆప్షనల్‌కు సంబంధించి.. సిలబస్‌ను అనుసరిస్తూ డిగ్రీ, పీజీ స్థాయి పుస్తకాలను చదివితే సులువుగానే విషయ పరిజ్ఞానం సొంతమవుతుంది. మెయిన్స్‌లో విషయ పరిజ్ఞానంతోపాటు అత్యంత ఆవశ్యకమైన అంశం భావవ్యక్తీకరణ. కాబట్టి అభ్యర్థులు రైటింగ్ ప్రాక్టీస్‌కు కూడా ప్రాధాన్యం ఇవ్వాలి. ఒక ప్రశ్నకు పరీక్షలో లభించే సమయాన్ని పరిగణనలోకి తీసుకుని ప్రిపరేషన్ దశలోనే సదరు సమయంలో సమాధానం ఇచ్చే విధంగా ప్రాక్టీస్ చేయాలి. గత ప్రశ్నపత్రాల పరిశీలన-సాధన, ఆయా అంశాలకు లభిస్తున్న వెయిటేజీ పరిశీలన వంటివి సివిల్స్‌లో విజయానికి ఉపకరించే ఇతర సాధనాలు.

 

 - జి. సృజన, అసిస్టెంట్ కలెక్టర్ (అండర్ ట్రైనీ)

 సివిల్స్-2012 విజేత (ఆల్ ఇండియా ర్యాంకు 44)


 

 ఎంబీబీఎస్ నాలెడ్జ్‌తో సీఎంఎస్‌లో విజయం

 

ఎంబీబీఎస్‌లోని అకడమిక్ అంశాల్లో పూర్తి స్థాయి అవగాహన ఉంటే కంబైన్డ్ మెడికల్ సర్వీసెస్‌లో సులువుగా విజయం సాధించొచ్చు. ఎయిమ్స్, ఇతర మెడికల్ పీజీ ఎంట్రెన్స్‌ల ప్రశ్నపత్రాలను, సీఎంఎస్ గత ప్రశ్నపత్రాలను సాధన చేస్తే విజయానికి 50 శాతం చేరువైనట్లే. ప్రధానంగా ిపీడియాట్రిక్స్, ప్రివెంటివ్ అండ్ సోషల్ మెడిసిన్ అంశాలు సులువుగా, ఎక్కువ మార్కులు పొందేలా ఉంటాయి. వీటిని నిర్లక్ష్యం చేయకూడదు.

 

 - కొండేపూడి సురేశ్‌కుమార్

 సీఎంఎస్-2013 విజేత


 

 ఐఈఎస్ పలు కోణాల్లో విశ్లేషించుకుంటూ..


 

ఇంజనీరింగ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ ఔత్సాహిక అభ్యర్థులు ఒక అంశాన్ని పలు కోణాల్లో విశ్లేషించుకుంటూ సాధించే నైపుణ్యం సొంతం చేసుకోవాలి. ప్రిపరేషన్ దశలో.. గేట్ ప్రశ్నపత్రాలు ప్రాక్టీస్ చేయడం కూడా లాభిస్తుంది. ఐఈఎస్ అభ్యర్థులు కేవలం తమ సబ్జెక్ట్ పేపర్స్‌కే కాకుండా.. జనరల్ నాలెడ్జ్, జనరల్ ఇంగ్లిష్ పేపర్‌పైనా దృష్టి పెట్టాలి. ప్రతి రోజు దీనికోసం కచ్చితంగా సమయం కేటాయించాలి. సాధారణంగా ప్రస్తుతం ఇంజనీరింగ్ విద్యార్థులు మూడో సంవత్సరం నుంచే గేట్ లక్ష్యంగా కృషి చేస్తున్నారు. గేట్ ప్రిపరేషన్‌ను ఐఈఎస్‌కు అనుసంధానం చేసుకోవడం, తద్వారా ఐఈఎస్‌లో విజయావకాశాలు మెరుగుపరచుకోవడం ఎంతో తేలిక.

 

 - వై.వి.గోపాలకృష్ణ,

 డెరైక్టర్, ఏస్ అకాడమీ


 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top