మృత్యు తాండవం

మృత్యు తాండవం


ఈ తండాల మట్టి తీసుకెళ్లి రోడ్డు వేశారు.

ఇప్పుడు ఆ తండాల్లో మట్టి మిగల్లేదు..

అవును.. ఆ రోడ్డు మట్టినంతా మింగేసింది.

మనిషిని ఖననం చేసేటంత మట్టిని కూడా మిగల్చలేదు...

నిజానికి హైవే అన్నది ప్రగతికి పునాది కావాలి...

కాని పెద్దకుంట, ధన్‌సింగ్ తండాలకు అది సమాధి అయింది

హైవేల మీద తరచుగా సైన్‌బోర్డులు చూస్తూ ఉంటాం..

అతి వేగం ప్రాణాంతకం.. వేగం కన్నా ప్రాణం మిన్న.. అని!

ఇది నడిపేవారికి హెచ్చరిక...

కానీ ఇక్కడ అది నడిచేవారికి మరణశాసనం అవుతోంది!

మృత్యు‘తాండ’వం అవుతోంది.

ఈ చావు లెక్కలకు ఆ హైవే

దేశంలోనే అతిపెద్ద మైలురాయిగా నిలుస్తోంది...

 


అది ఊరు కాదు. వల్లకాడు. ఇది ఆగ్రహం కాదు. వాస్తవం. ఊరు ఊరంతా నెత్తుటి ప్రవాహమే అయితే, చిన్నా పెద్దా అందరినీ మృత్యువు కాటేస్తే చివరకు ఊరే వల్లకాడవుతుంది. ఒక్కో యింట్లో ఇద్దరూ, ముగ్గురూ... నలుగురూ... అక్కడ చనిపోయిన వారిని పూడ్చిపెట్టేందుకు అటు ఆరు, ఇటు మూడడుగుల జాగా కూడా మిగల్లేదు. కానీ అక్కడ ఇళ్ళన్నీ మనుషుల్ని కోల్పోయి మట్టిదిబ్బలుగా మారాయి. ఇళ్లకు తాళాలు తప్ప మానవ సంచారం కనిపించదు. బిడ్డల పొట్టనింపేందుకు భర్తల శరీరాలను ఛిద్రం చేసిన నెత్తుటి రహదారిపైనే స్త్రీలు తమ శరీరాలను అమ్మకానికి పెడుతున్నారు. ఇదంతా ఎక్కడో కాదు హైదరాబాద్‌కి కూతవేటు దూరంలోని మహబూబ్‌నగర్ జిల్లా షాద్‌నగర్‌కి దగ్గరలోని కొత్తూరు మండలం హైవే పక్కనే వున్న పెద్దకుంట తండా, ధన్‌సింగ్ తండాల పరిస్థితి.



ఆ తండాలకు వెళితే వృద్ధులు, స్త్రీలు తప్ప పురుషులు కనిపించరు. వాళ్ళంతా ఒకే చోట, జాతీయ రహదారిని దాటుతుండగా యాక్సిడెంట్‌లో చనిపోయినవారే. సహజంగా రహదారుల్లో జరిగే ప్రమాదాలను నివారించడం కష్టమే కావచ్చు. కానీ ఒకే ప్రదేశంలో, ఒకే తండాకి చెందిన వారు పదే పదే యాక్సిడెంట్లో చనిపోతున్నారంటే దానర్థం ఎక్కడో పొరపాటు జరుగుతున్నట్టే. ఆ నిర్లక్ష్యం ఖరీదు నిండు ప్రాణాలు.



 మానని గాయాలు

 శాంతికి నలుగురు కొడుకులు. పదేళ్ల క్రితం పెద్ద కొడుకు మల్లేష్, ఆ తర్వాత మూడేళ్లకు రెండోవాడు రవి, మిగిలిన ఇద్దరు కొడుకులు శంకర్, గోపాల్ యాక్సిడెంట్‌లో చనిపోయారు. ఈ బాధతోనే భర్త పోయాడు. జబ్బుతో శాంతి కాళ్ళు చచ్చుబడిపోయాయి. నడవలేదు, నించోలేదు. ఇంత ముద్దపెట్టే దిక్కులేక జీవచ్ఛవంలా బతుకీడుస్తోంది.



 పదహారేళ్ల శారద భర్త యాక్సిడెంట్‌లో చనిపోయాడు. అప్పటికే ఆమెకు ఓ కొడుకు. మామ పంచన బతుకుతోంది. ఆర్నెల్ల క్రితం మామ కిషన్‌కి కూడా యాక్సిడెంట్ అయ్యింది. అతనిప్పుడు నడవలేడు. గాయాలకు మందులేక ఇంకా రక్తమోడుతూనే వున్నాయి. రేషన్‌కార్డు కూడా లేకుండా బతికేదెలా ప్రశ్నిస్తోంది శారద, తన జీవితంలోని విషాదానికి కారకులెవరో తెలియక. ఇదే తండాకు చెందిన కొర్ర నేజి అనే మహిళ భర్త, అల్లుడు యాక్సిడెంట్లో చనిపోయారు. ఆ బాధ భరించలేక కొడుకు ఆత్మహత్య చేసుకున్నాడు. ఒంటరిగా ఇంట్లో ఉండే ధైర్యం చేయలేక రెండిళ్ళకి తాళాలు వేసి, భర్త చనిపోయిన హస్లి అనే ఆమె దగ్గర ఉంటోంది. ‘చిన్నపిల్లలున్నారు... రేషన్ కార్డయినా యిప్పించండం’టూ వేడుకుంటోంది.



 ఎందుకీ విషాదం...

 ధన్‌సింగ్, పెద్దకుంట తండాల నుంచి ఏ పనికి బయటకు వెళ్ళాలన్నా రహదారిని దాటాల్సిందే. అక్కడ ఎటువంటి ప్రమాద హెచ్చరికలు ఉండవు. సాయంత్రం అయ్యిందంటే చీకట్లో మలుపు అసలే కనిపించదు. 140, 120 స్పీడుతో వెళ్ళే వాహనదారులకు రోడ్డుదాటుతున్న వారు దగ్గరకొచ్చేంత వరకు కనిపించరు. పొలాల్లోనుంచి జనం పూర్తిగా రోడ్డుపైకి వచ్చే వరకు ఎత్తై రహదారిపైన ఏ వాహనాలొస్తున్నాయో కనిపించదు.



 నెత్తుటి దారిలోనే చిన్నారుల పాదముద్రలు...

 పనికే కాదు, పాఠశాలకు వెళ్ళాలన్నా రక్తసిక్తమైన రహదారులను దాటుకుంటూ భయం భయంగా వెళ్ళాల్సిందే. ప్రైమరీ స్కూల్‌లో చదువు అయిపోయాక ఆ చిన్నారులను హైస్కూల్‌కి పంపాలంటే ఆ దారి తప్ప వేరే దారి లేదు. చిన్నారులకు ఏ రోజు ఏం జరుగుతుందోనని ఆ తండాల జనం ప్రాణాలను గుప్పిట్లో పెట్టుకొని బతుకుతున్నారు. అందుకే పిల్లలు బడికి దూరంగా తండాల్లోనే ఉంటున్నారు.

 

ఏం జరుగుతోంది?


హైదరాబాద్ బెంగుళూరు జాతీయ రహదారిలో మహబూబ్ నగర్ జిల్లాలోని కొత్తూరు మండలంలో జరిగిన యాక్సిడెంట్లను పరిశీలిస్తే... 2010లో 41 మంది, 2011లో 39 మంది, 2012లో 39 మంది, 2013లో 47 మంది, 2014లో 61 మంది చనిపోయారు. 2015 జనవరి నుంచి ఈనెల 30 వరకు ఈ మండలంలో జరిగిన యాక్సిడెంట్లు 30, ఇందులో 19 మంది మరణిస్తే, 20 మంది క్షతగాత్రులయ్యారు. అయితే పైన వివరించిన లెక్కల్లో అత్యధిక శాతం పెద్దకుంట తండా, ధన్ సింగ్‌తండాకి చెందిన వారేనన్నది లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. ఇవన్నీ కేవలం ప్రభుత్వం చెబుతున్నవి. పోలీస్ రికార్డుల్లోకి ఎక్కని యాక్సిడెంట్లెన్నో చెప్పడం కష్టం.

 

 గత్యంతరం లేక...

 ఇంటి పెద్ద దిక్కు చనిపోతే, గత్యంతరం లేక పడుపువృత్తిలోకి దిగుతున్నారు ఇక్కడి స్త్రీలు. ఒక్కో ఇంట్లో ముగ్గురు పిల్లలు ముసలి వాళ్ళూ కలుపుకొని ఐదారుగురు వుంటే వాళ్ళకిస్తోంది 12 కేజీల రేషన్ బియ్యం. ‘ఎలా సరిపోతాయ’ని ప్రశ్నిస్తున్నారు. పడుపు వృత్తిని ఎంచుకున్న వీరి జీవితంలో భద్రత గాలిలో దీపమే. ఎలాంటి రక్షణా లేని వారి జీవితాలలో పొంచి వున్నది పెనుభూతమే. హెచ్.ఐ.వి లాంటి వ్యాధుల నిర్ధారణ కోసం చేసే వైద్యపరీక్షలేవీ వీరికి జరపకపోవడం విచారకరం.

 

 ప్రమాదాలను నివారించాలి...

 తండాల నుంచి నేరుగా హైవే పైకి ఎక్కకుండా లింక్ రోడ్డు వేయడం ద్వారా ప్రమాదాలు నివారించొచ్చు. రోడ్డు దాటే దగ్గర ప్రమాద హెచ్చరికలు, హైమాస్ట్  లైట్లు అమర్చాలి. స్టాపర్స్, సేఫ్టీ గార్డ్స్ పెట్టాలి. రహదారి మధ్యలో వున్న డివైడర్ పై చెట్లు లేకపోవడం వల్ల ఎదురెదురుగా వస్తున్న వాహనాల లైట్లు కళ్ళల్లో పడుతుంటాయి. యాక్సిడెంట్లకి మద్యం కూడా కారణమే. వీటికి తోడు జిల్లాలో ప్రత్యేకించి ట్రాఫిక్ పోలీస్ వ్యవస్థ లేదు. లా అండ్ ఆర్డర్ పోలీసులే ట్రాఫిక్‌నీ చూసుకోవాలి. దీనివల్ల ప్రత్యేకించి నిధులు కూడా జిల్లా పోలీసు యంత్రాంగానికి ఉండవు. ట్రాఫిక్ ఆంక్షలను అతిక్రమించినందుకు వసూలు చేసినదంతా ప్రభుత్వ ఖజానాకే పోతోంది. దీనివల్ల ఏ చర్యలు తీసుకోవాలన్నా జిల్లా అధికారులకు అవకాశం లేదన్నది కొందరి వాదన.

 

 టోల్ గేట్ లో హైదరాబాద్ నుంచి అడ్డాకుల వరకు 24 గంటల్లో 6 నుంచి 8 లక్షల పైచిలుకే ఆదాయం వస్తోంది. ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని, హెచ్చరిక బోర్డులు పెట్టాలని టోల్‌గేట్ యాజమాన్యానికీ. జాతీయ రహదారుల అధికారులకు ఎన్నో విజ్ఞాపనలు చేసారు. ఎవ్వరూ స్పందించలేదు. కనీసం హైమాస్ట్ లైట్లు కూడా పెట్టలేదు.

 - టి.జి.శ్రీనివాస్,  లెక్చరర్

 

జాతీయ రహదారి నిర్మాణం జరిగినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్నోసార్లు ప్రజలు ఆందోళనలు చేశారు. అనేక సందర్భాల్లో జాతీయ రహదారిని దిగ్బంధించారు. టోల్ గేట్ యాజమాన్యాన్ని అడిగితే అది పంచాయితీ పరిధిలోనిదంటున్నారు. కానీ జాతీయ రహదారిపై భద్రతా చర్యలు చేపట్టే అధికారం మాకు లేదు. చేసేది లేక చేజేతులా ప్రమాదాలను ఆహ్వనిస్తున్నారు తండా ప్రజలు.

 

 - కొమ్ము క్రిష్ణ, నందిగామ గ్రామ సర్పంచ్

 

 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top